ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టిస్తోన్న రాథోడ్‌... వణుకుతోన్న జోగు, ఇంద్రకరణ్‌!

posted on: Jun 6, 2017 11:45AM

 

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నేత. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తారని సీఎం కేసీఆర్.... పార్టీలో చేర్చుకున్నారు. అయితే అధినేత నిర్ణయం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు దడపుట్టిస్తోంది. ఇప్పటికే ఖానాపూర్ టీఆర్ఎస్ నాయకులు... ఎమ్మెల్యే రేఖాశ్యామ్ వర్గం నుంచి రాథోడ్ వైపు చేరారు. ఇదేవిధంగా నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ  పార్టీలో ఆధిపత్యం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారు. దాంతో జిల్లా మంత్రులైన జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల్లో వణుకు పుడుతోంది.

 

మంత్రి  ప్రాతినిథ్యం వహిస్తున్న అదిలాబాద్ మున్సిపాలిటిలో మంత్రి చెప్పినా జరగని పనిని చేసి చూపించారు రాథోడ్. తానే స్వయంగా రంగంలోకి దిగి మున్సిపల్ కమిషనర్ ను బెదిరించి కార్యాలయాన్ని సాధించిపెట్టారు. దీంతో రాథోడ్ వర్గం అనందానికి అవధులు లేకుండా పోయింది. పార్టీలో చేరి వారం రోజులు కూడా గడవక ముందే రాథోడ్ పట్టుబిగుస్తుండటంతో మంత్రి జోగురామన్న అందోళన చెందుతున్నారు. ఇలానే రాథోడ్  స్పీడ్ పెంచితే, తాము పలుచన కావడం ఖాయమని భయపడుతున్నారు. రాథోడ్ దూకుడుకు మొగ్గలోనే కళ్లెం వేసేలా చర్యలు తీసుకోవాలని జోగురామన్నను కోరుతున్నారు.

 

ఖానాపూర్ లో పట్టు సాదించిన రాథోడ్... ఆసిఫాబాద్ లోనూ పట్టుబిగించడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతో ఆ పార్టీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా ఆందోళన చెందుతున్నారు. కోవ లక్ష్మి  బదులు సర్పంచ్ సరస్వతిని పార్టీలోకి తీసుకురావడానికి రాథోడ్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. టీడీపీలో ఉన్నప్పుడు జిల్లాలో ఆధిపత్యం సాధించి, పార్టీని అంతా తన కనుసన్నల్లో నడిపించిన నాయకుడిగా రాథోడ్ కు గుర్తింపు ఉంది. అదే ఊపుతో ఎమ్మెల్యేల నియోజకవర్గంలోనూ పార్టీలో పట్టుసాధిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు నెలల రోజులు చెప్పులు అరిగేలా తిరిగినా కాని పనులను రాథోడ్ గంటల్లో పూర్తిచేస్తున్నారు.

 

మంత్రి ఇంద్రకరణ‌్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలో ఇప్పటికే జెడ్పీ ఛైర్మన్‌ శోభా సత్యనారాయణ, పార్టీ నేత శ్రీహరిరావు గ్రూపులతో సతమతవుతున్నారు. రాథోడ్ తన ప్రాబల్యం పెంచుకోవడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యామ్ సుందర్ ను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రులతో సంబంధం లేకుండా రాథోడ్ అన్ని నియోజకవర్గాల్లో దూసుకుపోతుండటంతో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. రాథోడ్ కారెక్కి వారం రోజులు కాకముందే... గ్రూపులు కడుతుండటంతో పార్టీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. రాథోడ్ చేరిక రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పలేదన్న తీరుగా ఉందని మదనపడుతున్నారు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు.

google-ad-img
    Related Sigment News
    • Loading...