ఫిబ్రవరి 1 నుంచి పాన్‌మసాలా, సిగరెట్లపై అదనపు పన్ను

posted on: Jan 30, 2026 9:04PM

 

పాన్‌మసాలా, సిగరెట్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్నులు విధించే అవకాశముందని పీటీఐ  నివేదిక వెల్లడించింది. జీఎస్టీ పరిహార సెస్‌కు బదులుగా ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్‌ను నోటిఫై చేసినట్లు సమాచారం. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, వర్తించే జీఎస్టీ రేట్లకు అదనంగా పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులపై ‘ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్’ విధించనున్నారు.

ఈ కొత్త సెస్ అమలుతో పాన్‌మసాలా, సిగరెట్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధిక పన్నులతో ఉన్న ఈ ఉత్పత్తులపై మరింత భారం పడనుండడంతో వినియోగదారుల జేబుకు గట్టిదెబ్బ తగలనున్నది.అదేవిధంగా, ఈ చర్య ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుందని, మరోవైపు ప్రజారోగ్య పరిరక్షణ దిశగా వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. 

పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్యపరమైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త పన్ను అమల్లోకి వస్తే మార్కెట్‌లో పాన్‌మసాలా, సిగరెట్ల ధరలు వెంటనే పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాలకు మారే అవకాశమూ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...