వరంగల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. భారీగా బయటపడిన అవకతవకలు

posted on: Apr 3, 2026 11:04AM

హనుమకొండ జిల్లా వరంగల్  సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం లో ఏసీబీ  నిర్వహించిన ఆకస్మిక తనిఖీలhay భారీ అవకతవకలు బయటపడ్డాయి.  గురువారం (ఏప్రిల్ 2) నిర్వహించిన ఈ దాడుల్లో కార్యాలయంలో అనధికార డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ పటిష్టంగా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తనిఖీల సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికారిక ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు పనిచేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అధికారిక లెక్కల్లో చూపని రూ.47,450లు నగదుతో పాటు రిజిస్ట్రేషన్ చేయని 70 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సబ్‌ రిజిస్ట్రార్‌ల ఆధీనంలో 204 అందజేయని రిజిస్టర్డ్ పత్రాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లను పరిశీలించగా గత ఏడాది కాలంలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి సుమారు రూ.42.03 లక్షల రూపాయలను ఫోన్‌పే ద్వారా లావా దేవీలు జరిగినట్లు బయటపడింది. ఈ వ్యవహారంలో ఎస్‌ఆర్‌ఓ-1 జమాలపురం రామనరసింహారావు, ఎస్‌ఆర్‌ఓ-2 దావులూరి ఆనంద్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ల ద్వారా  కీలక ఆధారాలు బయటపడ్డాయి. అనధికారిక డాక్యుమెంట్ రైటర్లు ఇచ్చిన పత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ రిజిస్ట్రే షన్ ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.

కార్యాలయ తనిఖీలతో పాటు ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌ల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎస్‌ఆర్‌ఓ-2 దావులూరి ఆనంద్ నివాసంలో రూ.24.61 లక్షల నగదు, 819.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి ఆభరణాలు, కపిల్ చిట్స్‌లో రూ.30.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా పలు ఆస్తి పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు పూర్తి వివరాలతో ప్రభుత్వం‌కు నివేదిక సమర్పించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...