బాబు మాటలని నిజం చేసి చూపిన ఎసిబి
posted on: Jun 9, 2015 10:50AM
.gif)
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మంగళగిరిలో జరిగిన సభలో మాట్లాడుతూ “ఎవరింట్లో అయినా శుభకార్యం జరుగుతుంటే బుద్దున్నవాడు ఎవడూ కూడా దానిని పాడు చేయాలనుకోడు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఒకవైపు ట్యాంక్ బ్యాండ్ మీద తెలంగాణా సంభరాలు జరుపుకొంటూనే మరోవైపు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొన్న శుభసందర్భంగా ఏర్పాటు చేసుకొంటున్న ‘మహాసంకల్ప దీక్ష’ బహిరంగ సభను చెడగొట్టాలని ప్రయత్నించారు,” అని విమర్శించారు. ఆయన ఆరోపణలకు బలం చేకూర్చుతున్నట్లుగా ఈరోజు ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డి, మిగిలిన ముగ్గురు నిందితుల ఇళ్ళలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి భార్య గీతను ఎసిబి అధికారులు ప్రశ్నించారు. మరొక రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి దంపతుల కుమార్తె వివాహ నిశ్చితార్ధం జరుగబోతోంది. ఇటువంటి సమయంలో భర్త అరెస్ట్ కావడంతో చాలా కలత చెంది ఉన్న ఆమె, ఇప్పుడు ఎసిబి అధికారులు తమ ఇంట్లో సోదాలు చేయడం, తనపై ప్రశ్నల వర్షం కురిపించడంతో మరింత క్రుంగిపోయారు. వారి ఇంట్లో శుభ కార్యం జరుగబోతున్న విషయం అందరికీ తెలుసు.
ఎసిబి అధికారుల సోదాలతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదని తెరాస మంత్రులు వాదించవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయన భార్యా పిల్లలను భయబ్రాంతులను చేయడం ఎవరూ హర్షించరు. ఎసిబి అధికారులు ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం వలన ఒకవేళ వారి ఇంట్లో జరుగబోయే శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడితే వారిని ప్రజలు కూడా క్షమించరని గ్రహిస్తే మంచిది. రాజకీయాలను పార్టీల వరకే పరిమితం చేసుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని సదరు నేతల కుటుంబాలను ఈ విధంగా వేధింపులకి గురి చేయడాన్ని ఎవరూ కూడా హర్షించరని గ్రహిస్తే మంచిది.



.jpg)
.jpg)


.webp)


