ఏపీ మద్యం కుంభకోణం.. ఏ9 ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అరెస్టు.!

posted on: Aug 4, 2026 10:42AM

ఆంధ్రప్రదేశ్  మద్యం కుంభకోణం కేసులో  కీలక పరిణామం చోటు చేసుకుంది.  వైసీపీ హయాంలో జరిగిన ఈ భారీ మద్యం కుంభకోణంలో నిందితుడైన  ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్  సోమవారం (ఆగస్టు 3) రాత్రి  హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించింది. మద్యం వ్యాపారంలో వచ్చిన కోట్లాది  రూపాయల ముడుపుల సొమ్మును  దారి మళ్లించేందుకు  డొల్ల కంపెనీలను సృష్టించడంలో కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించాడని సిట్ ఆరోపిస్తోంది.

ఃఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మద్యం కుంభకోణం దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయగానే అరెస్టు భయంతో కిరణ్ కుమార్ రెడ్డి 2024 నవంబర్ లోనే   దుబాయ్ పారిపోయాడు. దీంతో అధికారులు కిరణ్ కుమార్ రెడ్డిపై  లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది. 

అయితే ఈ కేసులో పలువురు అరెస్టు కావడం, సుదీర్ఘ కాలం విదేశాలలో తలదాచుకోవడం సాధ్యం కాకపోవడంతో.. కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  ఆ యాంటిసిపేటరీ బెయిలు కొట్టివేసిన సుప్రీం కోర్టు తక్షణమే  లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో గత్యంతరం లేక.. కిరణ్ కుమార్ రెడ్డి..  దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం (ఆగస్టు 3) చేరుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ ఉండటంతో.. శంషాబాద్ విమానాశ్రయ ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను గుర్తించి అదుపులోనికి తీసుకుని సిట్ కు సమాచారం అందించారు.  వెంటనే హైదరాబాద్ నుంచి సిట్ ప్రత్యేక బృందం కిరణ్ కుమార్ రెడ్డిని తమ అదుపులోనికి తీసుకుని విజయవాడ తరలించింది. మంగళవారం (ఆగస్టు 4) కిరణ్ కుమార్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు.  

Kiran Kumar Reddy Arrested, IIT Kharagpur Liquor Scam, Shamshabad Airport SIT Arrest

google-ad-img
    Related Sigment News
    • Loading...