స్వదేశీ రక్షణ రంగంలో సరికొత్త శకం

posted on: Jun 1, 2026 12:38PM

భారత రక్షణ చరిత్రలో అపూర్వమైన అధ్యాయానికి తెరలేచింది. దశాబ్దాలుగా ప్రభుత్వరంగ సంస్థలకే పరిమితమైన అధునాతన యుద్ధ విమానాల తయారీ ప్రక్రియ, ఇప్పుడు ప్రైవేటు రంగానికి విస్తరించింది. భారత స్వదేశీ స్టెల్త్ ఫైటర్ జెట్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్- ఏఎమ్సీఏ ప్రాజెక్టులో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, రక్షణ రంగంలో భారతదేశం సాధిస్తున్న స్వావలంబనకు నిదర్శనం. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా, సొంత గగనతలాన్ని తామే రక్షించుకోవాలనే సంకల్పంతో భారత్ వేస్తున్న ఈ అడుగు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి బాటలు ప‌రుస్తోంది.

భారత వాయుసేన అవసరాల దృష్ట్యా.. ఐదో తరం యుద్ధ విమానాల తయారీ అత్యంత అవ‌స‌ర‌మని గుర్తించిన భారత ప్రభుత్వం, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఏడీఏ  నేతృత్వంలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గతంలో తేజస్ ప్రాజెక్టు విజయంతో ఊపిరి పోసుకున్న భారత స్వదేశీ రక్షణ పరిశ్రమ..  ఇప్పుడు మరింత శక్తిమంతమైన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన విమానాల తయారీకి సిద్ధమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  హెచ్ఏఎల్ తో పాటు ప్రైవేటు దిగ్గజాలను కూడా ఈ బృహత్తర యజ్ఞంలో భాగం చేయడం ద్వారా, తయారీ సామర్థ్యాన్ని, వేగాన్ని పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం.

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లార్సెన్  అండ్ టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థల బిడ్లను ఆహ్వానించారు. మొదటి దశ ప్రోటోటైప్‌ల తయారీకి సుమారు రూ. 15 వేల‌ కోట్ల భారీ కేటాయింపు చేశారు.  2031 నాటికి ఐదు ప్రోటోటైప్‌ల నిర్మాణం ఇందులోని ప్ర‌ధానాంశం. ఈ మార్పును కేవలం వాణిజ్య పరంగా చూడకూడద‌ని అంటారు నిపుణులు. ఇది జాతీయ భద్రతకు సంబంధించినది. ఉగ్రవాదం, ప్రాంతీయ ఘర్షణలు, అస్థిరమైన  స‌ప్లై చైన్ ఉన్న ఈ సిట్యువేష‌న్లో విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడటం ప్రమాదకరమని భావించింది ప్రభుత్వం.

ఏఎంసీఏలో రెండు ఇంజన్లు ఉండటం, ఆయుధాలను బాడీ లోపల ఉంచడం టివి శత్రువుల రాడార్లకు చిక్కకుండా చేస్తాయి.  హెచ్ఏఎల్ తనకున్న పరిమితుల వల్ల పనులన్నింటినీ ఒకేసారి చేయలేదు. టాటా, ఎల్ అండ్ టి వంటి సంస్థల రాక వల్ల ప్రాజెక్టులో నైపుణ్యం, వేగం, నాణ్యత పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు  విశ్లేషకులు.

విదేశీ సరఫరాదారుల షరతులు, సుంకాల యుద్ధం, రాజకీయ ఒత్తిళ్ల నుంచి భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఈ  ఆత్మనిర్భరతే  ఏకైక మార్గంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిణామం రక్షణ రంగంలో ఉన్న మోనోపోలీని విచ్ఛిన్నం చేస్తోంది. ప్రైవేటు సంస్థల ప్రవేశం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, రక్షణ రంగానికి సంబంధించి ఒక బలమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతోంది. అయితే, ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందా? ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? అనే అంశాలపై మేధోవర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, రాజకీయాలకు అతీతంగా దేశ భద్రతను బలోపేతం చేసే ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సానుకూలత వ్యక్తమవుతోంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...