డెబ్యూ బౌలర్ల వికెట్ల పండుగ.. రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం

posted on: Apr 14, 2026 8:52AM

హైదరాబాద్‌  వేదికగా   సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్), రాజస్థాన్ రాయల్స్ మధ్య సోమవారం (ఏప్రిల్ 13) జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అద్భుతమే జరిగింది. ఎస్ ఆర్ హెచ్  57 పరుగుల ఆధిక్యతతో ఆర్ ఆర్ పై చిరస్మరణీయమైన విజయం సా ధించింది. ఐపీఎల్ లో బలహీనమైన బౌలింగ్ అటాక్ ఎవరిది అని అడిగతే ఎవరైనా ఠక్కున ఎస్ ఆర్ హెచ్ అనే చెబుతారు. ఇప్పటి వరకూ  ఏ సీజన్ లోనైనా ఎస్ఆర్ హెచ్ సాధించిన విజయాలన్నీ ఆ జట్టు బ్యాటింగ్ బలంతోనే. బౌలింగ్  విభాగం బలహీనంగా ఉండటంతో ఆ జట్టు 200 పరుగుల పై చిలుకు స్కోరును కూడా కాపాడుకోలేక చతికిల పడిన సందర్భాలున్నాయి.

అటువంటి ఎస్ఆర్ హెచ్ సోమవారం (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్ లో  బౌలింగ్ ప్రదర్శన వల్లనే భారీ విజయం నమోదు చేసింది. ఈ సారి ఆ జట్టు తన  సీనియర్ బౌలర్లను పక్కన పెట్టి ఇద్దరు యువ పేసర్లను బరిలోకి దించింది. ఐపీఎల్ లో తొలి సారి ఆడుతున్న ఆ ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్ బలమైన బ్యాటింగ్  లైనప్ ను పేకమేడలా కూల్చేశారు.  ఆ ఇద్దరు బౌలర్లూ ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్. ఇద్దరికీ ఇదే ఐపీఎల్ డెబూ.. అయినా ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. వీరి  బౌలింగ్ కు ఆర్ఆర్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. డెబ్యూ మ్యాచ్ లోనే ఇద్దరూ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టారు. 

ఇక మ్యాచ్  విషయానికి వస్తే టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ఇషాంత్ శర్మ తొలి బంతికే డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే స్కిప్పర్ ఇషాంత్ కిషన్ అద్భుతంగా ఆడి   44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 28; 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

ఇక 217 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ ల ధాటికి పేకమేడలా కూప్పకూలింది. డెబ్యూలో వేసిన తొలి ఓవర్లోనే ప్రఫుల్ హింగే.. అరవీర భయంకర ఫామ్ లో ఉన్నసూర్యవంశీని డకౌట్ చేశాడు. అక్కడితో ప్రఫుల్ హింగే విధ్వంసం ఆగలేదు. నాలుగో బంతికి ధృవ్ జురేల్ ను, చివరి బంతికి ప్రిటోరియస్ ను పెవిలియన్ కు పంపించాడు. డెబ్యూలో తొలి ఓవర్ లోనూ మూడు వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాశించాడు.  ఆ తరువాత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సాకిబ్ హుస్సేన్ యశస్విజైస్వాల్ కు ఔట్ చేశాడు. ఇక ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ప్రఫుల్ సింగ్ ఆర్ఆర్ స్కిప్పర్ రియాన్ పరాగ్ ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో 9 పరుగులకే ఆర్ఆర్ ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరకుపోయింది.

అయితే ఆ దశలో   డోనోవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా  నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో ఇరువురూ ఆరో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఫెరీరా 7 ఫోర్లు, 3 సిక్సర్ల తో  42 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. అలాగే జడేజా  32 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేశాడు.  అయితే సాకిబ్ హుస్సేర్ మళ్లీ మాయ చేశాడు. వీరి భాగస్వామ్యన్ని విడదీశాడు. వీరిద్దరు ఔటైన తరువాత రాజస్థాన్ ఇక కోలుకోలేదు. చివర్లో తుషార్ దేశ్ పాండే 11 బంతుల్లో 3 సిక్సర్లు బాది పాతిక పరుగులు చేసినా అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి తప్ప ఎందుకూ పనికి రాలేదు. చివరకు ఆర్ఆర్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...