ట్రంప్, నెతన్యాహును చంపితే రూ.558 కోట్లు నజరానా

posted on: May 19, 2026 3:24PM

పార్లమెంటులో బిల్లు తెచ్చే యోచనలో ఇరాన్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని  బెంజమిన్ నెతన్యాహులను హతమార్చిన వారికి ఏకంగా రూ. 558 కోట్ల (58 మిలియన్ డాలర్లు) భారీ బహుమతిని  ఇచ్చేందుకు ఇరాన్ పార్లమెంట్ ఒక చట్టాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో  అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్, నెతన్యాహులను లక్ష్యంగా చేసుకుని వారిద్దరినీ హతమార్చిన వారికి ఏకంగా 50 మిలియన్ యూరోలు .. భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.558 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామంటూ ఇరాన్ పార్లమెంట్ ఒక వివాదాస్పద బిల్లును సిద్ధం చేస్తోంది. 'ఇరాన్ వైర్', 'ది టెలిగ్రాఫ్ యూకే' వంటి అంతర్జాతీయ పత్రికల కథనాల ప్రకారం.. ఈ ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించేందుకు ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్‌పై జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక అమెరికా, ఇజ్రాయెల్‌ల హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే.  ఖమేనీ హత్యకు వ్యూహకర్తలుగా వ్యవహరించినందుకు గానూ డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహులతో పాటు అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌లను లక్ష్యంగా చేసుకోవాలని ఇరాన్ నిర్ణయించింది.

ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిషన్ సభ్యుడు మహమూద్ నబవియాన్ మాట్లాడుతూ.. 'ట్రంప్, నెతన్యాహులను నరకానికి పంపే' వారికి భారీ రివార్డును అధికారికంగా ప్రకటించేందుకు చట్టసభ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేవలం పార్లమెంట్ మాత్రమే కాకుండా ఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ 'మసాఫ్', అలాగే ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ వార్‌ఫేర్ గ్రూప్ 'హందాలా' కూడా "కిల్ ట్రంప్" క్యాంపెయిన్ కోసం ఇప్పటికే 50 మిలియన్ డాలర్ల నిధులను సేకరించినట్లు ప్రకటించాయి. గతంలో కూడా ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని చూడటంతో అంతా షాక్ అవుతున్నారు.

ముఖ్యంగా ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ చట్టం వస్తే నాశనం అవుతుందని భావిస్తున్నారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ.. తనపై ఇరాన్ ఎలాంటి దాడికి ప్రయత్నించినా, ఆ దేశాన్ని భూమ్మీద లేకుండా పూర్తిగా తుడిచి పెట్టేస్తామని వ్యాఖ్యానించారు.ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...