పీఎల్జీఏ కమాండర్ సోది కేశాలు సహా 42 మంది మావోలు లొంగుబాటు

posted on: Apr 10, 2026 5:32PM

మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని సాయుధ పోరాటం చేస్తున్న 42 మంది మావోయిస్టులు శుక్రవారం (ఏప్రిల్ 10) తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. వీరిలో అత్యంత కీలకమైన తెలంగాణ స్టేట్ కమిటీ (టీఎస్సీ) నేతలతో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ బెటాలియన్ సభ్యులు కూడా ఉన్నారు.

లొంగిపోయిన వారిలో ప్రధానంగా పీఎల్జీఏ బెటాలియన్ ఇన్-చార్జ్ కమాండర్ సోది  కేశాలు, , తెలంగాణ స్టేట్ కమిటీ మిలిటరీ చీఫ్ చప నారాయణ అలియాస్ మధు, డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు  వంటి అగ్రశ్రేణి నాయకులు ఉన్నారు. వీరితో పాటు మొత్తం 42 మంది క్యాడర్ బయటకు రావడంతో తెలంగాణలో మావోయిస్టు సంస్థాగత నిర్మాణం దాదాపుగా కుప్పకూలిందని పోలీసు వర్గాలు ప్రకటించాయి.

ఈ సందర్భంగా మావోయిస్టులు భారీగా ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.  వీటిలో 5 ఏకే-47లు, ఎస్ఎల్ఆర్‌లు, ఇన్సాస్ రైఫిల్స్, స్టెన్ గన్‌లతో పాటు మొత్తం 36 రకాల ఆయుధాలు, వెయ్యికి పైగా తూటాలు ఉన్నాయి. అంతేకాకుండా, పార్టీ నిధులకు సంబంధించిన  800 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులకు అంద చేశారు. ఈ పరిణామంతో తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందని, ఇకపై రాష్ట్రంలో వారి ఉనికి నామమాత్రమేనని అధికారులు భావిస్తున్నారు. 

ప్రభుత్వ పునరావాస పథకంలో భాగంగా లొంగిపోయిన వారందరికీ తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. మొత్తం రూ.1.93 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయగా, ప్రాథమికంగా ఒక్కొక్కరికి  25 వేల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ మెరుగైన వైద్యం కోసం హెల్త్ కార్డులు అందజేస్తామని ఈ సందర్భంగా డీజీపీ చెప్పారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...