వైసీపీ ఎమ్మెల్యేలు... బీజేపీతో బేరాలు...
posted on: Jan 19, 2015 3:43PM

ఆయనొక ఎమ్మెల్యే. ఒక యువ హీరో అండదండలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా వుండేవారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరమై వైసీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి మొన్నటి ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజాబలం కంటే నోటి బలం ఎక్కువ అని ఆయన పేరు జనం నోళ్ళలో బాగా నానింది. ఆయన నోటి దురుసుతనం గురించి, తల బిరుసు గురించి ఆయన నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. తనకు రాజకీయంగా జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి అకారణంగా దూరమవ్వడమే కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీనే నోటికొచ్చినట్టు తిట్టేంత నోటి దురుసుతనం ఆయన సొంతం. బోలెడంత రెబల్గా వుండే ఆయన ప్రస్తుతం వైసీపీ నాయకుడు జగన్ ముందు మాత్రం కుక్కిన పేనులా పడి వుండే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీని తిట్టే విషయంలో తప్ప మరే విషయంలోనూ పాపం ఆయనకి వాయిస్ లేకుండా పోయింది. దానికితోడుగా ఏపీలో వైసీపీ మెల్లగా కనుమరుగు అయ్యే పరిస్థితులు ముంచుకుని వస్తూ వుండటంతో ఆయన మెల్లగా ఆ పార్టీ నుంచి తన బిచాణా ఎత్తేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
వైసీపీ నుంచి ఏ పార్టీలోకి జంప్ చేయాలా అని తీవ్రంగా ఆలోచించిన ఆయనకు కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే దిక్కులా కనిపించింది. వైసీపీలో చేరిన తర్వాత టీడీపీని ఆయన తిట్టిన తిట్ల ధాటికి ఆ పార్టీలోకి ఆయనకి ద్వారాలు శాశ్వతంగా మూసుకుని పోయాయి. ఆయనగారిని మళ్ళీ పార్టీలోకి తీసుకుని కొరివితో తల గోక్కునే రిస్క్ తెలుగుదేశం పార్టీ పొరపాటున కూడా చేయదు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరదామా అంటే... ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన రోజే చచ్చిపోయింది. ఇప్పుడు ఈయన ఆ పార్టీలో చేరితే, సంవత్సరానికోసారి ఆ పార్టీకి తద్దినం పెట్టడం తప్ప మరో పని వుండదు. ఇక ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో వేళ్ళూనుకుంటున్న భారతీయ జనతా పార్టీ. దాంతో ఇప్పుడు ఆయన దృష్టి బీజేపీ మీద పడింది. ఆటోమేటిగ్గా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.
వైసీపీని వదిలి తానొక్కడినే వస్తానని అంటే ఒంటికాయ సొంఠికొమ్ములా ఒక్కడివే ఏంటయ్యా అంటారని అనుకున్నారో ఏమోగానీ, తనకు బాగా మిత్రులైన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా ఆయన తోడు చేసుకున్నారు. మేం ముగ్గురం మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోతాం... మాకేంటి... అని ఆయన బీజేపీ అగ్ర నాయకత్వంతో బేరసారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల్ని డైరెక్టుగా రంగంలోకి దించకుండా బీజేపీతో లావాదేవీలను ఆయన ఒక్కడే చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఏపీ నాయకత్వంతో పలు దఫాలుగా మీటింగ్స్ కూడా జరిగాయట. మొన్నీమధ్య ఢిల్లీకి వెళ్ళి బీజేపీ కార్యాలయంలో కేంద్ర నాయకత్వంతో కూడా మాటామంతీ జరిపారట. నేడో రేపు ఈ ముగ్గురూ బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నోటి దురుసు ఎమ్మెల్యే గారి వాగ్ధాటి గురించి బీజేపీ నాయకత్వానికి తెలిసినప్పటికీ ఏపీలో బలం పెంచుకోవడానికి ఇలాంటి వాళ్ళను కూడా చేర్చుకోక తప్పదనే అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం.




.jpg)

.webp)



