1956 నిబంధనకి నో ఛాన్స్!

posted on: Jul 21, 2014 12:55PM

 

ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థుల స్థానికతలు 1956 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పుడు తెలంగాణలోని సీమాంధ్ర విద్యార్థులతోపాటు అనేకమంది తెలంగాణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిబంధన వల్ల అనేకమంది పక్కా తెలంగాణ విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం వుందని వారు వాపోయారు. తెలంగాణ ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ఫీ రీఎంబర్స్‌మెంట్‌కి 1956నే ప్రామాణికతగా నిర్ణయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేసింది. ఈ నిర్ణయంతో అనేకమంది తెలంగాణ విద్యార్థులు హతాశులయ్యారు. తెలంగాణలోని విద్యార్థి లోకం నుంచి ఈ నిర్ణయం మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1956 నిబంధన కనుక అమలు అయితే వేలాదిమంది తెలంగాణ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం వుంది. వీరిలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు కూడా వుంటారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వారి పిల్లలు కూడా ఈ జాబితాలో చేరతారు. తెలంగాణ కోసం ఇంత పోరాటం చేస్తే తమకే ప్రభుత్వం షాక్ ఇచ్చిందన్న అభిప్రాయం వీరిలో కలిగింది. ఈ అభిప్రాయాల సెగ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తగిలింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకునే అవకాశం వుందని తెలుస్తోంది. తెలంగాణలోని మీడియా ప్రతినిధులతో కేసీఆర్ జరిపిన ఒక సమావేశంలో దీనికి సంబంధించిన సూచనలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. 1956 నిబంధనను కచ్చితంగా అమలు చేయడం వల్ల తెలంగాణ విద్యార్థులకు కూడా నష్టం జరగడంతోపాటు న్యాయపరమైన ఇబ్బందులు కూడా వస్తాయని అర్థం కావడం వల్ల కేసీఆర్ ఈ విషయంలో పునరాలోచనలో పడ్డారని పరిశీలకులు అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...