24 గంటలు.. 12 అత్యాచారాలు.. తమిళనాట ప్రభుత్వం ఉందా?

posted on: Jun 17, 2026 11:36AM

తమిళనాడు ఒకప్పుడు దేశంలోనే మహిళల రక్షణకు, శాంతిభద్రతలకు మారుపేరుగా నిలిచింది. శాంతి భద్రతల విషయంలో కానీ, మహిళల భద్రత విషయంలో కానీ తమిళనాడు దేశానికి ఆదర్శవంతంగా ఉండేది. అయితే  గడిచిన కొన్నేళ్లుగా అక్కడ  పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో   కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 12 లైంగిక దాడి కేసులు నమోదు అయ్యాయి.  

శాంతిభద్రతలకు నిలయంగా భావించే చెన్నై నగర పరిధిలోనే ఈ ఘోరాలన్నీ చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.   నమోదు అయిన కేసుల్లో ఒకటి మూడు సంవత్సరాల చిన్నారిపై   హత్యాచారం. అలాగే.. మరో ఏడుగురు మైనర్ బాలికలపై కూడా లైంగిక దాడులు జరిగాయి.  అంటే మొత్తం కే12 కేసుల్లో ఎనిమిది  మైనర్ బాలికలపై జరిగిన లైంగిక దాడులే కావడం  ఈ నేరాల తీవ్రతను తెలియజేస్తున్నది.  నగరంలో మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని చెప్పడానికి  24 గంటల వ్యవధిలో 12లైంగిక దాడుల కేసులు నమోదు కావడమే నిదర్శనం. 

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం నడుస్తోంది. నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారి  ఇటీవలె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్  ఇప్పుడు రాష్ట్రంలో, రాష్ట్ర రాజధానిలో పెరిగిపోయిన ఈ నేర సంస్కృతిని ఎలా అరికడతారన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. నేరాలను అరికట్డడం, మహిళా భద్రత విషయంలో రాష్ట్రం, చెన్నై నగరాన్ని సురక్షితం అన్న విశ్వాసాన్ని పాదుగొలపడం, ఆయన పాలనకు, పాలనా దక్షతకు ఒక పరీక్షగా మారిందనడంలో సందేహం లేదు.  కేవలం ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై, పోలీసు యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

సోషల్ మీడియా వేదికగా నెటిజనులు సీఎం విజయ్ స్పందనను, కఠిన చర్యలను డిమాండ్  చేస్తున్నారు.   ఇలాంటి మృగాళ్లపై   సాధారణ చట్టపరమైన చర్యలు సరిపోవని, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   శాంతిభద్రతల పరిరక్షణలో  ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా కనబడుతోంది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...