Latest News
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం
posted on: Mar 26, 2026 9:13AM

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది సజీవదహనమయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం పలకల క్వారీల వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు 40 మంది ప్రయాణికులతో వెడుతున్న హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు మితిమీరిన వేగంతో వచ్చి టిప్పర్ను ఢీకొట్టింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దఈ ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
అయితే, 10 మంది మంటల్లో చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.



.webp)


