Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రశ్నపత్రాల లీకేజీలు...పాలకుల వైఫల్యమా, వ్యవస్థ లోపమా?
posted on: Jun 4, 2026 8:07PM
.webp)
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశాలపై తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ‘తెలుగువన్ వాస్తవ వేదిక’లో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలు, విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా నీట్ పరీక్ష వ్యవహారం దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల నిజమైన ప్రతిభావంతులు నష్టపోతుండగా, అక్రమ మార్గాల్లో పేపర్లు సంపాదించిన వారికి ప్రయోజనం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్య, వైద్యం ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధాన అంశాలుగా ఉంటాయని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అభివృద్ధిపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టడం లేదని చర్చలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో లోపాలు బయటపడినప్పుడు బాధ్యత స్వీకరించాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం తప్పులను అంగీకరించకుండా విమర్శకులపైనే ఎదురుదాడికి దిగుతున్నారని పేర్కొన్నారు.
విద్యా సంస్థలు ర్యాంకులు, ఐఐటీ సీట్ల సంఖ్యలను ప్రచారం చేస్తూ మార్కెటింగ్పై దృష్టి పెడుతున్నాయని, కానీ మిగిలిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఎవ్వరూ చర్చించడం లేదని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. సాంకేతిక పరికరాల సహాయంతో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని, దీనివల్ల అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు.
సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపాలు కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయని చర్చలో ప్రస్తావించారు. సరైన సన్నాహకాలు లేకుండా కొత్త విధానాలను అమలు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన వారిని ప్రోత్సహించి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు, వారిని దేశద్రోహులుగా లేదా విదేశీ ఏజెంట్లుగా ముద్రవేసే ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రధాన స్రవంతి మీడియా కూడా ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రచారానికే అధిక ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.
ఈ పరిస్థితులు భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని, విద్యార్థులు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి రానున్న రోజుల్లో రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే విద్యా రంగంలో పారదర్శకత పెంచడం, అవినీతిని అరికట్టడం, తప్పులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని సూచించారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేయకపోతే దాని ప్రభావం కేవలం విద్యార్థులపైనే కాకుండా దేశ భవిష్యత్తుపై కూడా పడుతుందని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పాలకులు రాజకీయాలకు అతీతంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అంశాలపై కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చు.





