లంచం ఇవ్వలేదని పసిపిల్ల కాలు విరగ్గొట్టిన డాక్టర్!

posted on: Jun 4, 2026 3:22PM

 

వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు. ప్రాణాలు కాపాడే డాక్టర్లను మనం దేవుడిలా భావిస్తాం. కానీ సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది అనడానికి ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘోర ఘటనే నిదర్శనం. డబ్బు పిచ్చితో కళ్లు మూసుకుపోయిన ఒక ప్రభుత్వ డాక్టర్, లంచం ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో, ఆపరేషన్ చేసి అతికించిన ఒక పద్నాలుగేళ్ల బాలిక కాలును మళ్లీ దారుణంగా విరగ్గొట్టాడు. ముజఫర్‌నగర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ అమానుష ఘటన ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. సమాజాన్ని నివ్వెరపరిచేలా చేసిన ఈ దారుణమైన ఉదంతం వెనుక ఉన్న అసలు నిజాలు వింటే ఎవరికైనా రక్తం మరగాల్సిందే.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన రేష్మ ఒక నిరుపేద వితంతువు. ఆమెకు 14 ఏళ్ల కుమార్తె ఉంది. దురదృష్టవశాత్తూ కొన్ని రోజుల క్రితం ఆ బాలిక కాలు విరిగింది. పేదరికం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక, రేష్మ తన కుమార్తెను చికిత్స నిమిత్తం ముజఫర్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ డ్యూటీలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ (ఎముకల వైద్యుడు) బాలికను పరీక్షించాడు. ఆపరేషన్ చేయాలని చెప్తూ.. అందుకు ఏకంగా రూ. 25,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. భర్త లేని ఆ పేద తల్లి అంత పెద్ద మొత్తాన్ని చూసి హతాశురాలైంది. తన దగ్గర అంత డబ్బు లేదని, దయచేసి ఉచితంగా వైద్యం చేయాలని డాక్టర్ కాళ్లు పట్టుకుని బతిమాలినా ఆ కాసుల కక్కుర్తి వైద్యుడు కనికరించలేదు.

డాక్టర్ నిర్దయాత్మక వైఖరితో విసిగిపోయిన రేష్మ, జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO)ని ఆశ్రయించింది. తాను ఒక వితంతువునని, అంత లంచం ఇచ్చుకోలేనని తన బాధను మొరపెట్టుకుంది. దీంతో స్పందించిన సీఎంఓ, ఆ బాలికకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా ఉచితంగా సర్జరీ చేయాలని సదరు ఆర్థో సర్జన్‌ను ఆదేశించారు. అయినప్పటికీ ఆ డాక్టర్ లో లంచంపై ఉన్న ఆశ చావలేదు. సీఎంఓ ఆదేశాలను కూడా పక్కనబెట్టి సర్జరీ వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో బాధితురాలు ఏకంగా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. కలెక్టర్ తీవ్రంగా పరిగణించి వెంటనే బాలికకు ఉచితంగా ఆపరేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎంఓకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ జోక్యంతో సీఎంఓ రెండోసారి గట్టిగా ఆదేశించడంతో ఆ డాక్టర్ ఎట్టకేలకు ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాడు.

కానీ, సర్జరీకి సరిగ్గా కొద్ది నిమిషాల ముందు ఆ వైద్యుడు మళ్లీ తన అసలు స్వరూపాన్ని చూపించాడు. డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దిక్కుతోచని స్థితిలో రేష్మ తన వద్ద ఉన్న రూ. 8,000 నగదును ఆ డాక్టర్ చేతిలో పెట్టింది. మిగిలిన రూ. 17,000 మొత్తాన్ని సర్జరీ పూర్తయ్యాక సర్దుబాటు చేసి ఇస్తానని ఒప్పుకుంది. అలా నెలన్నర క్రితం బాలికకు కాలు సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అయితే, రోజులు గడుస్తున్నా పేదరికం వల్ల రేష్మ మిగిలిన లంచం డబ్బులు చెల్లించలేకపోయింది. దీంతో కక్ష పెంచుకున్న ఆ డాక్టర్, సర్జరీ తర్వాత రెగ్యులర్ చెకప్ (రివ్యూ) పేరుతో బాలికను, ఆమె తల్లిని ఆస్పత్రికి రప్పించాడు.

రివ్యూ కోసం వచ్చిన రేష్మను చూసి, ఆ డాక్టర్ మళ్లీ మిగిలిన లంచం డబ్బుల కోసం పీడించడం మొదలుపెట్టాడు. తన దగ్గర ప్రస్తుతం పైసా కూడా లేదని ఆ తల్లి కన్నీరు పెట్టుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ డాక్టర్, కేవలం చెకప్ చేస్తానని నమ్మించి బాలికను వార్డు లోపలికి పిలిపించుకున్నాడు. తల్లి బయట ఉండగానే, గదిలో ఎవరూ లేని సమయం చూసి, నెలన్నర క్రితం తానే ఆపరేషన్ చేసి అతికించిన ఆ పద్నాలుగేళ్ల బాలిక కాలును మళ్లీ ఉద్దేశపూర్వకంగా విరగ్గొట్టాడు. లోపల ఏం జరుగుతుందో తెలియని ఆ పసిపిల్ల నొప్పితో తల్లడిల్లిపోతూ, విలవిల్లాడుతూ గట్టిగా కేకలు వేసింది. బయట ఉన్న తల్లి లోపలికి పరుగెత్తుకెళ్లి చూసేసరికి కూతురు నరకయాతన అనుభవిస్తోంది.

ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం కాస్తా సోషల్ మీడియా, స్థానిక మీడియా ద్వారా బయటకు రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉలిక్కిపడింది. మీడియా ప్రతినిధులు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) ని వివరణ కోరగా, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు. సదరు ప్రభుత్వ వైద్యుడు ఉద్దేశపూర్వకంగానే బాలిక కాలును విరిచినట్లు ప్రాథమిక దర్యాప్తులో రుజువైతే, అతనిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, మెడికల్ కౌన్సిల్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తామని వెల్లడించారు. దేవుడిలా కాపాడాల్సిన వైద్యుడే ఇలా రాక్షసుడిగా మారిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...