ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..!

posted on: Jul 22, 2026 2:23PM

 

వేధింపుల కేసు.. షీ టీమ్స్‌కు బదిలీ..!

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసు ఉన్నతాధికా రులు, ఇప్పటివరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న దర్యాప్తును ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు. షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణ లో ఇకపై కేసు విచారణ కొనసాగనుంది. దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీసీపీ లావణ్య బుధవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా భావిస్తున్న బాధిత మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఆమె అకాడమీకి వెళ్లారు. అకాడమీ అధికారుల సమక్షంలో అధికారికంగా స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. 

బాధిత అధికారిణి ఇచ్చే వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ములగాని ఉదయ్ కృష్ణారెడ్డి ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం వైద్యుల అనుమతితో ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. కేసు దర్యాప్తులో ఆయన వర్షన్ కూడా కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి పేరుతో ఉన్నట్లు భావిస్తున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించి, అందులోని రాతలు, వివరాలపై నిపుణులతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సూసైడ్ నోట్‌లోని అంశాలను కేసులో లభించిన ఇతర ఆధారాలతో సరిపోల్చి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ములగాని ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

 తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జే. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది అప్పటి వరకు ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరారు.
ఇంకా తన వాదనలు వినిపి చేందుకు ప్రయత్నించగా, పూర్తి స్థాయిలో వచ్చే సోమవారం విచారణ చేపడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

దీంతో కేసు విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవైపు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం కావడం, మరోవైపు హైకోర్టులో న్యాయపరమైన విచారణ కొనసాగుతుండటంతో ఈ కేసు మరింత కీలక దశకు చేరుకుంది. బాధిత అధికారిణి వాంగ్మూలం, ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి స్టేట్‌మెంట్, సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ నివేదిక, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా దర్యాప్తు తదుపరి దిశ నిర్ణయించబడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

 Trainee IPS Uday Krishna Reddy, Telangana High Court, Attapur Police Station, DCP Lavanya Naik Jadhav, Trainee IPS harassment case, She Teams Hyderabad, IPS officer sexual harassment case
 

google-ad-img
    Related Sigment News
    • Loading...