రైతుల కన్నీళ్లే ఈ రోజు అమరావతికి పునాదిరాళ్లు.. పెమ్మసాని

posted on: Apr 1, 2026 2:26PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక,శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రం బుధవారం (ఏప్రిల్ 1) లోక్ సభలో ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. ఎన్డీయే కూటమికి చెందిన ఏపీ సభ్యులు, కేంద్ర మంత్రులు ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొని గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  మూడు రాజధానులంటూ జగన్ తన ఐదేళ్ల హయాంలో  రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకున్నారని, ఈ చారిత్రాత్మక బిల్లుతో ఆ గందరగోళానికి పర్మనెంటుగా  తెరపడిందనిన్నారు. 

సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్  గత ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక రంగు మార్చి మూడు రాజధానులన్నారని దుయ్యబట్టారు. జగన్ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవన్నారు.  ఈ బిల్లు ద్వారా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధ రక్షణ లభించిందని, రాజధానిని ఇక్కడి నుంచి తరలించడం ఇక ఎవరికీ సాధ్యం కాదని సీఎం రమేష్ అన్నారు.

అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని అమరావతి రైతుల పోరాటాన్ని ప్రస్తావిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.  రాజధాని కోసం భూములిచ్చిన వేలాది మంది రైతులను గత ప్రభుత్వం 'పెయిడ్ ఆర్టిస్టులు' అని దారుణంగా  అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  1600 రోజులకు పైగా సాగిన అమరావతి రైతుల మహోద్యమంలో  మహిళలు, వృద్ధులపై జరిగిన దాడులను ఆయన ఈ సందర్భంగా సభకు తెలియజేశారు. ఆనాడు రైతులు చిందించిన కన్నీళ్లే ఈరోజు అమరావతికి పునాదిరాళ్లుగా మారాయని పెమ్మసాని అన్నారు. 

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వంటి మహానగరాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు  ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అమరావతి వంటి ఒకే ఒక శక్తివంతమైన రాజధాని అవసరమని,  జగన్ ఐదేళ్ల హయాంలో జరిగిన    పాలనా  వైఫల్యాల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని, పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయారని ఈ బిల్లుపై ప్రసంగించిన ఎంపీలు అన్నారు. రాజధానిని నిర్ణయించే అత్యున్నత అధికారం పార్లమెంటుకే ఉంటుందన్న గత కోర్టు తీర్పుల ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ బిల్లు ఆమోదంద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతిపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోవడంతో, ఇక  అభివృద్ధి పనులు మరింత వేగంపుంజుకుంటాయని జనం అభిప్రాయపడుతున్నారు.  రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి మరిన్ని నిధులు, ప్రాజెక్టులు రాజధాని ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమౌతోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...