Latest News

చంద‌న స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు...చందాలు అడుక్కోవ‌డ‌మేంటి?

posted on: Mar 27, 2026 8:03PM

 

స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి? ఆమె తండ్రి దాచిన సొమ్మంతా ఏమైంది? ఇంత‌కీ ఆ డ‌బ్బు ఎక్క‌డుంది? ఆ వివ‌రాలేంటి?  విద్యారాణి ఇప్ప‌టి వ‌ర‌కూ ఏయే పార్టీలు మారింది?  ప్ర‌స్తుత పార్టీ ప‌రిస్థితేంటి? అస‌లేంటి విద్యారాణి రాజ‌కీయం?

చంద‌న‌పు దొంగ వీర‌ప్ప‌న్ పేరు వింటే ఇప్ప‌టికీ స‌త్య మంగ‌ళం అడ‌వులు గ‌జ‌గ‌జ‌లాడుతాయి. వేల కోట్ల విలువైన చంద‌న‌పు చెక్క‌లు, ఏనుగు దంతాలు స్మ‌గ్లింగ్ చేసిన వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి ప్రస్తుతం రాజ‌కీయాల్లో రాణించ‌డానికి చందాలు అడుగుతున్నారు. మ‌రి స్మ‌గ్లింగ్ చేసి వీర‌ప్ప‌న్ సంపాదించిన సొమ్మంతా ఏమైన‌ట్టు? ఆయ‌న కుటుంబానికి మ‌రీ ముఖ్యంగా త‌న రాజ‌కీయ కుమార్తెకు అంత పేద‌రిక‌మేంటి?  ఇంత‌కీ విద్యారాణి తండ్రి సంపాదించిన ఆ నిధి మొత్తం ఏమైన‌ట్టు? అన్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఆ కాలంలోనే వీర‌ప్ప‌న్ సుమారు రూ.150 కోట్ల  విలువ చేసే చంద‌న‌పు చెక్క‌లు, ఏనుగు దంతాల‌ను స్మ‌గ్లింగ్ చేశాడ‌ని అంచ‌నా. ఇక క‌న్న‌డ కంఠీర‌వ‌గా పేరున్న రాజ్ కుమార్‌ని  కిడ్నాప్ చేసిన‌పుడు సుమారు 15 నుంచి ఇర‌వై కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేశాడ‌ని చెబుతారు. అయితే ఈ డ‌బ్బు ప్ర‌స్తుతం ఎక్క‌డుంది?  ఇప్ప‌టి లెక్క‌ల ప్ర‌కారం ఈ మొత్తం కొన్ని వేల కోట్ల విలువ చేస్తుంది. మ‌రి ఆ సొమ్ము మొత్తం ఏమైన‌ట్టు అన్న  ప్ర‌శ్న‌ల‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది.  

వీర‌ప్ప‌న్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే.. ఈ మొత్తం బ్యాంకుల్లో కాకుండా ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో చుట్టి అడ‌వుల్లో, గుహ‌ల్లో, చెట్ల కింద పాతిపెట్టాడ‌ని అంటారు. అయితే వీర‌ప్ప‌న్ చ‌నిపోయాక‌.. పోలీసులు జ‌రిపిన గాలింపుల్లో కేవ‌లం ఆహార ధాన్యాలు త‌ప్ప‌.. భారీ న‌గ‌దు ల‌భించ‌నే లేదు. ఇంత‌కీ వీర‌ప్ప‌న్ తాను సంపాదించిన సొమ్ము ఏం చేసేవాడ‌ని చూస్తే.. త‌న గ్యాంగ్ నిర్వ‌హ‌ణ‌కు ఇన్ ఫార్మ‌ర్ల‌కు, ఆయుధాల‌కు, అడ‌వి ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌డానికే ఎక్కువ‌గా ఖ‌ర్చు చేసేవాడ‌ని అంటారు.

కొంద‌రు ఏమంటారంటే ఆ డ‌బ్బు ఎక్క‌డుందో తెలిసిన వారంద‌రూ కూడా ఎన్ కౌంట‌ర్ల‌లో చ‌నిపోయార‌ని చెబుతారు. దీంతో ఆ డ‌బ్బు మొత్తం అడ‌వి మ‌ట్టిలో క‌ల‌గ‌ల‌సిపోయి ఉంటుంద‌నే భావిస్తున్నారు. అందుకే విద్యారాణికి త‌న తండ్రి నుంచి వార‌స‌త్వంగా ఎలాంటి సంప‌దా క‌ల‌సిరాలేద‌ని అంటారు.బేసిగ్గా అయితే విద్యారాణి తాను చ‌దివిన చ‌దువు ప్ర‌కారం ఒక లాయ‌ర్. సామాజిక కార్య‌క‌ర్త  కూడా. త‌న తండ్రికి ద‌క్షిణాది రాబిన్ హుడ్ గా ఉన్న ఇమేజీని వాడుకుని.. రాజ‌కీయాల్లో ఎద‌గాల‌ని చూస్తున్నారు.

విద్యారాణి మొద‌ట ప‌ట్టాలి మ‌క్క‌ల్ క‌ట్చి, అనే పార్టీలో చేరారు. త‌ర్వాత అంటే 2020లో ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీ యువ‌జ‌న విభాగంలో కీల‌క ప‌ద‌విలో ప‌ని చేశారు. ప్ర‌స్తుతం అంటే 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ఆమె బీజేపీని వీడి,, శీమాన్ నేతృత్వంలోని నామ్ త‌మిళ‌ర్ క‌ట్చిలో చేరారు. కృష్ణ‌గిరి ఎంపీగా  పోటీ చేసి ఓడిపోయారు.
 
ప్రస్తుతం విద్యారాణి నామ్ తమిళర్ కట్చి-NTKలోనే కొనసాగుతున్నారామె. 2026 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెట్టూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ పార్టీ అభ్య‌ర్ధిగా పోటీ  చేస్తున్నారు వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి. అయితే త‌న ఎన్నిక‌ల ప్ర‌చారానికి.. త‌గిన డ‌బ్బు త‌న ద‌గ్గ‌ర లేద‌ని.. తండ్రి  సంపాద‌న‌లో ఏదీ త‌న‌కు ద‌క్క‌లేద‌ని చెబుతూ.. సోష‌ల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. వాటి  ద్వారా చందాల‌ను ఆశిస్తున్నారు. త‌న  తండ్రి అడ‌వి బిడ్డ‌ల కోసం పోరాడార‌నీ.. తాను కూడా అదే బాట‌లో న‌డుస్తాన‌ని న‌మ్మ‌బలుకుతున్నారు.

స‌త్య‌మంగ‌ళం అడ‌వుల్లో.. కోట్లాది రూపాయ‌ల సామ్రాజ్యాన్ని విస్త‌రించిన ఒక స్మ‌గ్ల‌ర్ వార‌సురాలు నేడు త‌న ద‌గ్గ‌ర ఏదీ లేద‌ని చెబుతూ.. చందాలు అడ‌గ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న  తండ్రి  పై ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతి, క్రేజ్ ని వాడుకుని ఎలాగైనా స‌రే చ‌ట్ట‌స‌భ‌ల్లో అడుగు పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...