హోంమంత్రి రాజీనామా..నేపాల్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం

posted on: Apr 23, 2026 12:58PM

నేపాల్‌  రాజకీయాలు మరోసారి సంక్షోభంలో పడ్డాయి. ప్రధానమంత్రి బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరి   నెల రోజులు కూడా గడవక ముందే ఆయన కేబినెట్ లో కీలకమైన హోంమంత్రి ర రాజీనామా చేశారు. నేపాల్ హోంమంత్రి  సుదన్ గురుంగ్ బుధవారం (ఏప్రిల్ 22) తన పదవికి రాజీనామా చేస్తూ ప్రధానికి లేఖ సమర్పించారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఇలా ఆకస్మికంగా తప్పుకోవడం ఇప్పుడు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. 

ఇటీవల కొన్ని రోజులుగా  సుదన్ గురుంగ్‌పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంతో పాటు, మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న  దీపక్ భట్టా సంస్థల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు బయటపడటంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే  నిష్పాక్షిక విచారణకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో..  నైతిక బాధ్యత వహిస్తూ తాను తప్పుకుంటున్నట్లు గురుంగ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.  

ఇలా ఉండగా.. బాలెన్ షా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ముఖ్యంగా భారత్‌తో సరిహద్దు వాణిజ్య నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. వంద నేపాలీ రూపాయల కంటే ఎక్కువ విలువైన భారతీయ వస్తువులపై కస్టమ్స్ సుంకం విధించడం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి నిరసనగా కాఠ్మండు సహా ప్రధాన నగరాల్లో విద్యార్థులు, రాజకీయ పక్షాలు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

అవినీతి రహిత పాలన  వాగ్దానంతో   పీఠమెక్కిన బాలెన్ షాకు, తన కేబినెట్ మంత్రిపైనే  తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది.  ఇటు టు సొంత పార్టీలో అసమ్మతి, అటు వీధుల్లో జనం నిరసనల మధ్య ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...