Latest News
పోచారంలో రాంబాయి సీన్.. పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువకుడు
posted on: Mar 14, 2026 2:20PM

హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పరిధిలో 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా తరహాలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందని కోపంతో ఓ యువకుడు యువతికి ఎయిడ్స్ వ్యాధి ఉన్న రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణమైన ఘటనలో నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులకు కూడా గతంలోనే ఎయిడ్స్ సోకినట్లు అధికారులు గుర్తించారు.
పోచారంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన సంచలనం రేపింది. పెళ్లి నిరాకరించిందన్న కారణంతో పోచారం ప్రాంతా నికి చెందిన యువకుడు మనోహర్ ఓ యువతికి ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఎక్కించాడు. మనోహర్ కు పోచారం ప్రాంతానికే చెందిన యువతితో కొంతకాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారి వివాహానికి కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపడంతో ఇద్దరికీ వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. అయితే ఈ తరువాత మనోహర్కు అతని తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉందని తెలిసింది. దీంతో యువతి కుటుంబం ఆ వివాహాన్ని రద్దు చేసుకుంది. దీనితో మనోహర్ కక్ష పెంచుకున్నాడు.
చివరి ప్రయత్నం అన్నట్లుగా ఈ నెల 11న మనోహర్ ఆ యువతి ఇంటి కి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే యువతి స్పష్టంగా నిరాకరించడంతో మనోహర్ తన వెంట తెచ్చుకున్న ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా యువతికి ఎక్కించాడు. రెప్పపాటు వ్యవధిలో జరిగిన ఈ దారుణంతో యువతి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. వెంటనే యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోచారం పోలీసులు నిందితుడు మనోహర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.



.webp)


