Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయి : కేటీఆర్
posted on: Apr 22, 2026 8:15PM
.webp)
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారానికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ తీర్పు ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, ఇది కేవలం తెలంగాణ ప్రజలు, రైతుల విజయమని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న అధికార ప్రభుత్వానికి ఈ తీర్పు ఒక చెంపపెట్టు అని కేటీఆర్ అభివర్ణించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని చేసిన కుట్రలు, చిల్లర రాజకీయాలు ప్రజల ముందు బట్టబయలయ్యాయని ఆయన విమర్శించారు. ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా నిజాన్ని దాచలేరని స్పష్టం చేశారు.
అసలు కాళేశ్వరం విషయంలో జరిగిన ప్రచారం వాస్తవం కాదని, అది కేవలం రాజకీయ ఎత్తుగడలని ఆయన ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో సాగునీటి విస్తీర్ణం భారీగా పెరిగిందని, ప్రతి నీటి చుక్క ఆయన ముందుచూపు వల్లే రైతులకు అందుతోందని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో కావాలనే లేనిపోని వివాదాలు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వాన్ని పలు కీలక ప్రశ్నలు సంధించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో జరిగిన లోపాలు, కార్మికుల మరణాలు, కరీంనగర్లో చెక్డ్యాంల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం తమపై బురద చల్లడం కోసం ప్రాధాన్యత లేని అంశాలపై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ మీద ఉన్న కక్షతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. రైతుబంధు, కరెంట్ సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం రైతుల పట్ల ఉదాసీనత ప్రదర్శించడం దారుణమని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు రాజకీయాలు మానుకుని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇటువంటి తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తే, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. అభివృద్ధిని అడ్డుకోవడం కాకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.






