కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో విషాదం..!

posted on: Jul 5, 2026 12:30PM

 

పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది. కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణ వార్తను తెలియజేస్తూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. ‘మిస్ యూ డాడ్’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న 22 ఏళ్ల యువకుడు, నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు, లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి నెట్టివేయబడి దారుణ హత్యకు గురయ్యాడు. నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి పక్కా స్కెచ్‌తో ఘోరానికి ఒడిగట్టారు. జూన్ 18న జరిగిన ఈ ఘోర కలి మనవడిని ఎంతగానో ప్రేమించే ఆ తాతయ్య గుండెను పిండేసింది. మనవడు ఇక లేడనే నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.

కేతన్ అగర్వాల్ మరణించిన నాటి నుంచి ఆయన తాత, సక్సెస్ గ్రూప్ వ్యవస్థాపకుడు దేవీచంద్ అగర్వాల్ (71) తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. శనివారం రాత్రి 9:45 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో ఆయన కన్నుమూశారు. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన మనవడు హత్యకు గురికావడం, ఆ నింద కాబోయే కోడలిపైనే పడటంతో ఆ వృద్ధుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మనవడి మరణం మిగిల్చిన తీరని శోకమే చివరకు ఆయన ప్రాణాలను బలితీసుకుంది. అగర్వాల్ కుటుంబంలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరోవైపు ఈ సంచలన కేసులో పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సియా గోయల్, కుటుంబ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. కేతన్‌కు ఉన్న నత్తి, బట్టతల కారణంగా తలపాగా (విగ్) ధరించడం ఆమెకు నచ్చలేదని, అందుకే అతడిని వదిలించుకోవాలని చూసినట్లు పేర్కొంది. ఇందుకోసం జూన్ 14నే ఓసారి లోహగఢ్ కోటపై నుంచి నెట్టేయడానికి ప్రయత్నించగా, కేతన్ పొదలను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు పాము వచ్చిందని అబద్ధం చెప్పి తప్పించుకున్న సియా, జూన్ 18న 400 అడుగుల లోతున్న ఘోస్ట్ పాయింట్ లోయలోకి ప్రియుడితో కలిసి నెట్టేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

ఈ హత్యకోసం నిందితుడు చేతన్ టోల్ ప్లాజాల వద్ద దొరికిపోకుండా ఉండేందుకు ఏకంగా 90 కిలోమీటర్లు స్కూటర్ పై ప్రయాణించి కోట వద్దకు చేరుకున్నాడు. క్రైమ్ సీన్ రీక్రియేషన్ కోసం పోలీసులు డమ్మీని ఉపయోగించి దర్యాప్తు చేయగా, సియా ఈ దారుణానికి ముందే స్నాప్‌చాట్ లో తన స్నేహితురాలికి 'అసలు జరగని పెళ్లి కోసం ఆధార్ కార్డు పంపమంటూ' గుప్త సందేశాలు పంపినట్లు ఆధారాలు లభించాయి. 

కేతన్ మరణించాక కూడా అతడి మొబైల్ ఫోన్‌ను కొంతసేపు సియా తన వద్దే ఉంచుకుని ఆధారాలు నష్టం చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ 14 రోజుల జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను నియమించింది. ఒకవైపు న్యాయ పోరాటం సాగుతుండగానే, తాతయ్య దేవీచంద్ గుండె పగిలి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా అందరినీ కలచివేస్తోంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...