కేసీఆర్‌‌నే నా పార్టీలోకి ఆహ్వానిస్తా : కవిత

posted on: Mar 11, 2026 4:48PM

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి గులాబీ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. అవసరమైతే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌నే తన జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తాని కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. పొలిటికల్‌గా డాడీ, మోడీ, రేవంత్‌రెడ్డి తనకు ప్రత్యర్థులని, వారితోనే తన రాజకీయ కొట్లాట ఉంటుందని స్పష్టం చేశారు.. 

తాను రాసిన లేఖ లీకైన నాటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్‌, కేటీఆర్‌లతో మాట్లాడలేదని తెలిపారు. తన తల్లితో మాత్రం భావోద్వేగంగా మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పారు. వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ వద్ద కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. అయితే బాధితులకు న్యాయం జరిగే వరకు తన దీక్ష కొనసాగుతుందంటూ జాగృతి కార్యాలయం వద్ద కవిత మళ్లీ నిరాహార దీక్షకు దిగారు.

ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ 2022 మేలో తనపై కేసు నమోదైనప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తనకు ఎవరి మద్దతూ లేదనే బాధ కలిగిందని, అందరినీ ట్రోల్ చేసే బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కూడా తనకు అండగా నిలవలేదని అన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేలా, తెలంగాణ మదర్ బోర్డ్‌లా పనిచేసే కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

“జైలు నన్ను జగమొండిని చేసింది. ఇందుకు కారణమైన వారు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. జాతీయ రాజకీయాల్లో నాకు శత్రువులు ఎవరన్నది ముఖ్యం కాదు. మనకు నష్టం చేస్తున్నది ఎవరనేది గుర్తించాలి. మోదీ, డాడీ, రేవంత్‌తోనే రాజకీయంగా పోరాడాలి. వారు శత్రువులా కాదా అన్నది కాదు, ప్రత్యర్థులన్నదే ముఖ్యం. మా పార్టీ నిలబడాలంటే ప్రత్యర్థులతో పోరాటం చేయాల్సిందే” అని కవిత స్పష్టం చేశారు.వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అక్కడ కూల్చివేసిన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లు కట్టించాలని కోరారు. ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు తన నిరాహార దీక్ష కొనసాగుతుందని కవిత తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...