భగత్‌సింగ్‌ చుట్టూ రాజకీయాలు మొదలు

posted on: Mar 23, 2016 10:56AM


 

భగత్‌సింగ్‌ను కన్నయాకుమార్‌తో పోలుస్తూ కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలు ఓ తేనెతుట్టుని కదిపినట్లున్నాయి. శశిథరూర్‌ వ్యాఖ్యలు కలిగించిన వేడిని చల్లార్చేందుకు, కాంగ్రెస్ నేతలు వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఆ పార్టీ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ ‘భగత్‌సింగ్‌ ఒక్కడేననీ, ఆయనను వేరెవ్వరితోనూ పోల్చడం సరికాదని’ పేర్కొన్నారు. పంజాబ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, వారి హీరో అయిన భగత్‌సింగ్‌ను వివాదంలోకి లాగడం ఆ పార్టీకి తప్పకుండా నష్టం కలిగించవచ్చు. ఇక కమ్యూనిస్టులు కూడా ఈ వ్యాఖ్యలతో కంగుతిన్నారు. ఆది నుంచీ కూడా వారు భగత్‌సింగ్‌ను, తమ వర్గానికి చెందిన నేతగా భావించారు. ఇప్పుడు కన్నయాతో పోల్చడంతో ఆయన స్థాయి తగ్గించినట్లైపోయింది. ఇక బీజేపీ మాత్రం ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే కన్నయతో భగత్‌సింగ్‌ను పోల్చడం గురించి బీజేపీ ఇప్పటికే మండిపడుతోంది. మార్చి 23 భగత్‌సింగ్‌ను ఉరితీసిన రోజు కావడంతో, ఆ రోజు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా, భగత్‌సింగ్‌ త్యాగాన్ని ప్రజలకు మరోసారి గుర్తుచేస్తామని ఆ పార్టీ చెబుతోంది. మరి ఈ వివాదం చిలికి చిలికి ఎక్కడికి దారితీస్తుందో, ఎన్ని ఎన్నికలలో ప్రభావం చూపిస్తుందో చూడాలి!

google-ad-img
    Related Sigment News
    • Loading...