భారత్ పరుగుల వరద...564 రన్స్‌కు ఇన్నింగ్స్ డిక్లేర్!

posted on: Jun 7, 2026 4:22PM

 

న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతక్కొట్టడంతో పాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 

టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 500 ప్లస్ స్కోరు సాధించిన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా ఇది నిలిచింది. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడటంతో ఆఫ్ఘన్ బౌలర్లు చేతులెత్తేశారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ పేసర్ మహ్మద్ సలీం అద్భుత స్పెల్‌తో 6 వికెట్లు పడగొట్టి భారత్‌ను కాస్త కట్టడి చేయగలిగాడు. అయినప్పటికీ మొదటి ఇన్నింగ్స్‌లోనే భారత్ భారీ ఆధిక్యం వైపు అడుగులు వేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది.

భారత ఇన్నింగ్స్ హైలైట్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. గిల్ 177 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 126 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ అద్భుత శతకంతో గిల్ టెస్ట్ కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని దాటడమే కాకుండా, కెప్టెన్‌గా అతని బ్యాటింగ్ సగటు రికార్డు స్థాయిలో 82.8 కి చేరింది. 

క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అత్యధిక టెస్ట్ కెప్టెన్సీ సగటు కలిగిన రికార్డును గిల్ తన పేరిట లిఖించుకోవడం విశేషం. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా మొదటి రోజు అద్భుత సెంచరీ (100) చేసి జట్టు భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు. వీరిద్దరి సెంచరీలతో పాటు ఓపెనర్ సాయి సుదర్శన్, స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు.

రిషభ్ పంత్, సాయి సుదర్శన్ ఇద్దరూ చెరో 81 పరుగులు చేసి జట్టు స్కోరును ఐదువందల దాటించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 169 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఫ్ఘనిస్తాన్‌పై టెస్ట్ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మిడిల్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకునే ఆటతీరుతో అజేయంగా 52 పరుగులు చేసి తన ఆరో టెస్ట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లోయర్ ఆర్డర్‌లో మహ్మద్ సిరాజ్ కేవలం 12 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపు ఇచ్చాడు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో యువ పేసర్ మహ్మద్ సలీం సంచలన ప్రదర్శన చేశాడు. 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ 140 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఐదు వికెట్ల మైలురాయిని అందుకోవడం గమనార్హం. 

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్‌కు భారత స్పిన్నర్లు ఆదిలోనే షాక్ ఇచ్చారు. అరంగేట్రం చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ తన కెరీర్ 4వ బంతికే ఓపెనర్ అబ్దుల్ మాలిక్‌ను 16 పరుగుల వద్ద అవుట్ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...