Latest News
రీల్స్ నుంచి రాడికల్ నెట్వర్క్ వరకూ.. హైదరా బాద్ మహిళ విచారణలో విస్తుపోయే వాస్తవాలు!
posted on: Mar 28, 2026 3:51PM

సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ఓ మహిళ ఉగ్రవాద కార్యకలాపాల్లో చిక్కుకున్నట్టు పోలీసులు వెల్లడించడంతో నగరంలో తీవ్ర కలకలం రేగింది. పాతబస్తీ చంచల్గూడ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల సయీదా బేగం ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం.. గృహిణిగా జీవితం ప్రారంభించిన ఆమె వ్యక్తిగత సమస్యల కారణంగా భర్త నుంచి వేరుపడి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అక్కడి నుంచే అనుమా నాస్పద నెట్వర్క్లోకి ప్రవేశించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్ చంచల్గూడ ప్రాంతానికి చెందిన సయీదా బేగం తన భర్తతో విభేదాల కారణంగా విడిపోయి ఏడాది క్రితం పుట్టింటికి వచ్చింది. జీవనోపాధి కోసం ఇళ్ళల్లో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆమె, ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాను ఆశ్ర యించింది. ఆమె గజల్స్ పాడడం, వంట వీడియోలు చేయడం, కుట్టు పనులపై చిన్న వీడియోలు రూపొం దించడం ప్రారంభించింది. ఈ వీడియోలను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేయడంతో కొద్ది కాలంలోనే 30 వేలకు పైగా ఫాలోవర్లను సంపాదించింది. ఆన్లైన్ ద్వారా కొంత ఆదాయం కూడా రావడం ప్రారంభమైంది.
కాగా ఆమె రెండో పెళ్లి కోసం సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు ఆమె జీవితాన్ని మలుపుతిప్పిందని పోలీసులు అంటున్నారు. పెళ్లి కోసం ఆమె పోస్టును గమనించిన ఓ వ్యక్తి తాను పోలీసు అధికారినని చెప్పుకుంటూ ఆమెను సంప్రదించాడు. తరువాత రోజూ వాట్సప్ ద్వారా చాటింగ్ చేస్తూ ఆమెకు సన్నిహితుడై నమ్మకం సంపాదించాడు. అతడి ప్రభావంతోనే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఉగ్రవాద ప్రచారంలోకి దిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మార్గదార్శకత్వంలోనే ఏడు రాష్ట్రాలకు చెందిన 42 మందితో సయీదాబేగం వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ఇన్స్టాగ్రామ్
సందేశాల ద్వారా సభ్యు లను సమీకరించడం కూడా చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెట్వర్క్ వెనుక అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది. ఈ అనుమానాస్పద కార్య కలాపాలపై విజయవాడ పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సాంకేతిక ఆధారాలతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ఆమె తెలియకుండా ఉగ్రవాదుల వలలో పడిందా? లేక ఉద్దేశపూ ర్వకంగా సహకరించిందా? అన్న కోణాలలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. డిజిటల్ ఆధారాలు, విదేశీ లింకులు, గ్రూప్ సభ్యుల వివరాలు సేకరిస్తూ విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలు, మానసిక ప్రభావాలు, సైబర్ రాడికలైజేషన్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి ఎత్తి చూపింది.






