Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కెప్టెన్సీ నుంచి ఆ ముగ్గురికీ ఉద్వాసనేనా?
posted on: May 26, 2026 9:34AM

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ పూర్తయ్యింది. ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్లో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి.మిగిలిన జట్లు ఇంటిబాట పట్టాయి. ముఖ్యంగా ప్లేఆఫ్స్ చేరని జట్ల కెప్టెన్లపై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేళాడుతోంది. టీ20 ఫార్మాట్లో నాయకుడి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, జట్టు ఓటమికి కెప్టెన్ బాధ్యత వహించక తప్పదు. ఈ నేపథ్యంలో మూడు జట్ల కెప్టెన్లు ఆ బాధ్యతల నుంచి వైదొలగడమో, ఉద్వాసనకు గురి కావడమో తప్పదని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ ముగ్గురూ ఎవరంటే.. లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ రిషభ్ పంత్, కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్.
మొదటిగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ విషయానికి వస్తే.. లక్నో జట్టుకు సారథిగా రిషభ్ పంత్ పరిస్థితి గడిచిన రెండేళ్లుగా ఏమాత్రం బాగాలేదు. భారీ రికార్డు స్థాయి జీతంతో ఈ ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టిన పంత్, ఆశించిన స్థాయిలో జట్టును నడిపించలేకపోయాడు. 2025 మరియు 2026 వరుస సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును పాయింట్ల పట్టికలో ఏడో స్థానం కంటే ముందుకు తీసుకెళ్లడంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. కెప్టెన్సీ ఒత్తిడి అతడి బ్యాటింగ్ను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో పంత్ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తన జట్టు కాగితంపై బలంగానే ఉందని పంత్ పదే పదే చెప్పినప్పటికీ, మైదానంలో సరైన వ్యూహాలు అమలు చేయడంలో, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడ్డాడు. జట్టు సహాయక సిబ్బంది నిర్ణయాల జోక్యంపై అతడు అసంతృప్తిగా ఉన్నట్లు పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ పరిస్థితుల్లో పంత్ కెప్టెన్సీ భారాన్ని పక్కనపెట్టి, కేవలం.. బ్యాటర్గా తన మునుపటి ముద్రను చూపిస్తేనే అతడి కెరీర్కు మళ్లీ పూర్వవైభవం వస్తుంది.
అలాగే.. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే. రహానే మైదానం వెలుపల ఒక ప్రశాంతమైన, మంచి నాయకుడిగా కనిపించినప్పటికీ, ఒక ఓపెనింగ్ బ్యాటర్గా మాత్రం ఈ సీజన్ లో కేకేఆర్ జట్టుకు భారంగా మారాడు. ఆధునిక టీ20 క్రికెట్ వేగంగా దూసుకుపోతుంటే, రహానే పాతకాలపు యాంకర్ రోల్ పోషిస్తూ పవర్ప్లేలో వేగంగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. 2026 సీజన్ లో ఆడిన 14 ఇన్నింగ్స్లలో రహానే కేవలం 25.77 సగటుతో, అలాగే 135.08 స్వల్ప స్ట్రైక్ రేట్తో కేవలం 335 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మందకొడి బ్యాటింగ్ కారణంగా జట్టుపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్రస్తుత వేగవంతమైన టీ20 ప్రమాణాల ప్రకారం రహానేకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కడమే కష్టంగా మారింది. అందువల్ల రహానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటే, జట్టుకు కొత్త రక్తం అందుతుంది. అలాగే అవసరమైన కొన్ని ప్రత్యేక మ్యాచ్లలో అతడిని పించ్ హిట్టర్గా లేదా ఒక అనుభవజ్ఞుడైన బ్యాటర్గా వాడుకోవడానికి మేనేజ్మెంట్కు వీలుంటుంది.
చివరిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న సిఎస్కేను నడిపించడం అంత సులువైన విషయం కాదు. అయితే రుతురాజ్ గైక్వాడ్కు మాత్రం 2026 ఐపీఎల్ సీజన్ ఒక పీడకలలా మిగిలిపోయింది. కెప్టెన్గా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడమే కాకుండా, బ్యాటింగ్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. లీగ్ చివరి మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్పై 21 బంతుల్లో 15 పరుగులు, ముంబై ఇండియన్స్పై 14 బంతుల్లో 22 పరుగులు, గుజరాత్ టైటాన్స్తో జరిగిన కీలక పోరులో 7 బంతుల్లో 16 పరుగులు చేసి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. కొన్ని మ్యాచ్లలో అతడి స్ట్రైక్ రేట్ 46.15 మరియు 71.43 మాత్రమే ఉండటం అతడి పూర్ ఫామ్ ను తెలియజేస్తుంది. కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా గైక్వాడ్ తన సహజసిద్ధమైన ఆటను కోల్పోతున్నాడు. కాబట్టి.. ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు తమ కెప్టెన్సీని వదులుకుని, కేవలం ఆటగాళ్లుగా మైదానంలోకి దిగితేనే అటు జట్లకు, ఇటు వారి వ్యక్తిగత భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఆర్సీబీ బెంగళూరు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా తప్పుకుని బ్యాటర్ గా అమోఘంగా రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.


.webp)



