వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముందుకు సాగాలి : ద్రౌపదీ ముర్ము

posted on: Aug 14, 2026 8:36PM

 

స్వాతంత్ర్య దినోత్సవ వేళ జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం..!

స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే శతాబ్ది దిశగా 'వికసిత్ భారత్-2047' స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు దేశప్రజలందరూ ఏకతాటిపై నిలిచి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక సవాళ్లు మరియు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, భారతదేశం స్థిరమైన, వేగవంతమైన ప్రగతితో బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడటం గర్వకారణమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగమే అత్యున్నతమైన దిక్సూచి అని, దాని పవిత్రతను నిలబెడుతూ గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పునరుద్ఘాటించారు.

సామాజిక భద్రత, పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని ప్రతికూల వర్గాలకు చేరువ చేస్తూ జన్‌ధన్ యోజన ద్వారా ఇప్పటికే దాదాపు 59 కోట్ల ఖాతాలను తెరిచినట్లు తెలిపారు. అలాగే ఆహార భద్రతలో భాగంగా 80 కోట్ల మందికి పైగా రేషన్ లబ్ధిని, ఆయుష్మాన్ భారత్ తో 60 కోట్ల మందికి ఉచిత ఆరోగ్య రక్షణను అందిస్తున్నామని పేర్కొన్నారు.రైతాంగ సాధికారతపై మాట్లాడుతు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వ్యవసాయం  దానికి అనుబంధంగా ఉన్న అనేక రంగాలు ఎంతో బలోపేతమయ్యాయని వెల్లడించారు. 

ఆర్థిక ప్రగతిని కేవలం గణాంకాలకే పరిమితం చేయకుండా, ప్రజా సంక్షేమంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే భారత అభివృద్ధి మోడల్ ప్రత్యేకత అని ఆమె స్పష్టం చేశారు.అంతేకాకుండా, నూతన సాంకేతిక రంగాలు మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మనదేశంలో నిర్మించిన డిజిటల్ వ్యవస్థ అత్యంత సమర్థవంతమైనదని, పట్టణాల నుంచే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం డిజిటల్ చెల్లింపుల సేవలను వినియోగించుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారతదేశం నిలవడం మన సాంకేతిక ప్రగతికి నిదర్శనమని చెప్పారు. క్షేత్రస్థాయి వరకు ప్రభుత్వ ఫలాలు నేరుగా చేరుతుండటంతో పారదర్శకత పెరిగి, మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా తొలగిపోయిందని పలువురు ఆర్థిక విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ప్రస్తుత సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమాన్ని, డిజిటల్ విప్లవాన్ని సమన్వయం చేయడం ద్వారా దేశంలో సామాజిక సమానత్వం వేగవంతమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.2047 నాటికి సంపూర్ణ వికసిత భారత్‌గా నిలవడానికి అవసరమైన గట్టి పునాదులు ఇప్పటికే పడ్డాయని, పౌరులందరి సమిష్టి భాగస్వామ్యంతో భారతదేశం ప్రపంచంలో అగ్రగామి శక్తిగా అవతరిస్తుందని ప్రజాబాహుళ్యం విశ్వసిస్తోంది.

 Draupadi Murmu speech, Independence Day address, President of India message, President Murmu speech details, Independence Day 2024, Sakshi Telugu news

google-ad-img
    Related Sigment News
    • Loading...