Latest News
వాట్సాప్ చాటింగ్ గొడవ.. కానిస్టేబుల్ హత్య
posted on: Mar 16, 2026 10:10AM
.webp)
ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ కుమార్ ను అతడి స్నేహితుడే దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. ఇంతకూ ఈ హత్యకు కారణమేంటంటే.. వాట్సాప్ చాటింగ్ లో ఇరువురి మధ్యా జరిగిన గొడవ. వాట్సాప్ లో మొదలైన చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారి దారుణ హత్యకు దారి తీసింది.
పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన సుధీర్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్లో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. చిలుకానగర్కు చెందిన ఆటో డ్రైవర్ సంతోష్ నాయక్ అతడి స్నేహితుడు. శనివారం(మార్చి 14) రాత్రి వీరిద్దరి మధ్య వాట్సప్లో మాటామాటా పెరిగింది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇద్దరూ ఆదివారం(మార్చి 15) రాత్రి చిలుకానగర్లోని ఆదర్శనగర్లో కలుసుకున్నారు.
సుధీర్ తన స్నేహితుడు ఇమ్రాన్తో కలిసి వెళ్లగా, అప్పటికే అక్కడ వేచి ఉన్న సంతోష్ సుధీర్పై కత్తితో దాడి చేసివిచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఈ ఘటనలో సుధీర్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు సంతోష్ నాయక్, అతడి సహచరుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మృతుడు సుధీర్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


.webp)
.webp)


