రాహుల్ విదేశీ పర్యటనలు.. వివాదాస్పద శక్తులతో సంబంధాలపై ముసురుకుంటున్న విమర్శలు

posted on: May 26, 2026 4:20PM

ఇండియన్ పాలిటిక్స్ లో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం ముసురుకుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వరుసగా ఎదురవుతున్న ఎన్నికల పరాజయాలను తట్టుకోలేక..  దేశంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు దేశంలో పెద్ద ఎత్తున  చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని నవతరాన్ని అంటే జెన్-జెడ్ ను  ఒక అస్త్రంగా వాడుకుంటూ..  ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అంతర్గత అలజడులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు దేశాల్లో సంభవించిన రాజకీయ సంక్షోభాల తరహా వాతావరణాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలనేది ఆయన ఆలోచనగా ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

అంతర్జాతీయ వ్యూహాలు, డీప్ స్టేట్ సంబంధాలుఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న అంశం అంతర్జాతీయ  డీప్ స్టేట్  శక్తులతో కాంగ్రెస్ నాయకత్వానికి ఉన్న సంబంధాలు. అమెరికాకు చెందిన కొన్ని కీలక నిఘా సంస్థలు,  అంతర్జాతీయ ప్రభావశీలురైన జార్జ్ సోరోస్, ఇల్హాన్ ఒమర్, జెరెమీ కార్బిన్ వంటి భారత్ వ్యతిరేక శక్తులతో రాహుల్ గాంధీ ఎందుకు సన్నిహితంగా ఉంటున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రకమైన విదేశీ శక్తులకు తాను వ్యతిరేకమని రాహుల్ గాంధీ  బహిరంగంగా ప్రకటించగలరా అని విమర్శకులు సవాల్  విసురుతున్నారు. 

బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ ద్వారా నడిచిన డీప్ స్టేట్ నమూనాను, గ్రెటా థన్‌బర్గ్ టూల్‌కిట్ వంటి అంతర్జాతీయ వ్యూహాలను భారతదేశంలో కూడా ప్రయోగించి ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరచాలని చూస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.  విద్యార్థుల అసంతృప్తి, కుల రాజకీయాల వినియోగం దేశీయంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను కూడా రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మలచుకుంటున్నారనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. సీబీఎస్ఈ పునర్మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న సాంకేతిక లోపాలను సాకుగా చూపి..  విద్యార్థుల్లో ఆగ్రహాన్ని రగిల్చేందుకు ప్రయత్నించడం ఇందులో భాగమేనని ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన విద్యావ్యవస్థ లోపాలను విస్మరించి..  ఇప్పుడు కేవలం యువతను రోడ్లపైకి తెచ్చేందుకు ఈ అంశాన్ని వాడుకుంటున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. 

అదేవిధంగా.. రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతంలో పోలీసుల తుది నివేదిక ప్రకారం మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని తేలినప్పటికీ, దానిని కుల వివక్షగా చిత్రీకరించి దళితులను  రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు గతంలో వెల్లువెత్తున సంగతిని గుర్తు చేస్తున్నారు.  విభజన శక్తులతో సాన్నిహిత్యం,  చమురు రాజకీయాలు, జెఎన్‌యూలో గతంలో జరిగిన దేశ వ్యతిరేక నినాదాల ఉదంతంలో పాలుపంచుకున్న శక్తులతో రాహుల్ గాంధీ వేదికలను పంచుకోవడాన్నిప్రస్తావిస్తూ..  విమర్శకులు ఆయనకు ఒక రకమైన తీవ్రవాద లేదా అర్బన్ నక్సల్ మనస్తత్వం ఉందంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు..  అంతర్జాతీయంగా వెనిజులా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా నుంచి భారత్‌పై వస్తున్న ఒత్తిళ్లను, దేశీయంగా ఇంధన ధరల పెరుగుదలపై జరుగుతున్న ప్రచారాన్ని దీనికి ముడిపెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, భారతదేశంలో మాత్రం ధరల పెరుగుదలను ఆసరాగా చేసుకుని దేశంలో అలజడులు సృష్టించాలని చూసే ధోరణి సరైనది కాదని అంటున్నారు. 

  ప్రాంతీయ రాజకీయాలు - బాహ్య శక్తుల ప్రభావం

ఈ మొత్తం వ్యవహారంలో తూర్పు భారతదేశ ప్రాంతీయ రాజకీయాల పాత్ర కూడా చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్‌కు సమీపంలో ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపంలో విదేశీ సైనిక స్థావరాల ఏర్పాటు ప్రయత్నాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుసరిస్తున్న వ్యూహాలు అన్నీ ఒకే అంతర్జాతీయ ఎజెండాలో భాగమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ వంటి సంస్థలతో అంతర్జాతీయ నేతల భేటీలు యాదృచ్ఛికం కావనీ, బాహ్య శక్తులు,  దేశీయ శక్తుల ద్వారా భారతదేశ భద్రతను దెబ్బతీసేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నాయని  హెచ్చరిస్తున్నారు.  

పారదర్శకతపై పెరుగుతున్న డిమాండ్లు

ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో..  రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలను దేశ ప్రజల ముందు ఉంచాలనే డిమాండ్ జోరందుకుంది. ముఖ్యంగా మస్కట్ వంటి నగరాల్లో ఆయన జరిపిన రహస్య సమావేశాలు ఏమిటి? అక్కడ ఎవరిని కలిశారు?  విదేశీ నిఘా విభాగాలతో ఆయనకు ఉన్న సంబంధాలు ఏంటి?  అనే విషయాలపై పారదర్శకత అవసరమని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు సంబంధించిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందంటున్నారు. 

ప్రస్తుతం సాగుతున్న ఈ రాజకీయ దుమారం రాబోయే రోజుల్లో మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నప్పటికీ..  జాతీయ భద్రతకు,  అంతర్గత శాంతికి ముప్పు వాటిల్లేలా సాగుతున్న ఈ పరిణామాలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ కుట్రల వెనుక ఉన్న అసలు నిజాలు నిగ్గుతేలితేనే దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం సురక్షితంగా ఉంటుందంటున్నారు. భవిష్యత్తులో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, రాహుల్ గాంధీ ఈ ప్రశ్నలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...