మసూద్‌ అజార్‌ తీవ్రవాది కాదు... చైనా

posted on: Apr 2, 2016 3:43PM

 

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న సామెత చైనా దౌత్యవేత్తలకు సరిగ్గా వర్తిస్తుందేమో. మసూద్‌ అజార్ అనే కరోడా తీవ్రవాదిని నిషేధించాలంటూ భారత్‌ ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనని అడ్డుకోవడమే కాకుండా, అజార్ నిషేధం ఎదుర్కొనేంతటి తీవ్రవాది కాదంటూ చైనా తన పనిని వెనకేసుకు వచ్చింది. పైగా ఇలాంటి ప్రతిపాదనలు చేసేటప్పుడు సరైన కారణాలు చూపాలంటూ భారత్‌ను దెప్పిపొడిచింది. అజార్‌ తన దేశంలో హాయిగా విహరించేందుకు, తన ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు పాకిస్తాన్‌ కావల్సినంత స్వేచ్ఛని అందిస్తోంది.

 

ఒకవేళ ఐక్యరాజ్యసమితిలో ఈ ప్రతిపాదన కనుక అమలై ఉంటే అజార్ కదలికల మీదా, అతని ఆస్తుల మీదా పాకిస్తాన్ నిషేధాన్ని అమలుచేయాల్సి వచ్చేది. అందుకే పాకిస్తాన్ కోరిక మేరకు చైనా ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. చైనా ఇలా పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదని కాపాడటం ఇది మొదటిసారేమీ కాదు. లష్కర్‌ ఏ తయ్యబా అనే సంస్థ ద్వారా ముంబైలో మారణహోమాన్ని సృష్టించిన రెహ్మాన్ లఖ్వీని కూడా ఇలాగే వెనకేసుకు వచ్చింది. చైనా తీరు మీద భారతీయ నేతలే కాదు, అధికారులు కూడా మండిపడుతున్నారు. అంతకు మించి ఏం చేస్తారో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...