చిక్కుల్లో చిదంబరం!

posted on: Mar 2, 2016 10:15AM

 

ప్రముఖ కాంగ్రెస్‌ నేత, మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం గ్రహస్థితి ఏమీ బాగున్నట్లు లేదు. ఇటు చూస్తే ఆయన పుత్రరత్నం 'కార్తి చిదంబరం' ఎడాపెడా దేశవిదేశాలలో వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలు ప్రచురించిన ఓ ఆంగ్ల పత్రికను పట్టుకుని నిన్న పార్లమెంటులో ఏఐడీఎంకే సభ్యులు, కాంగ్రెస్‌ మీద విరుచుకుపడ్డారు. మరోవైపు చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తమిళ వ్యాపారస్తునికి చెందిన ఎయిర్‌సెల్‌కు అనుకూలంగా ఒప్పందాలను ఖరారు చేయించారన్న విమర్శ కూడా పార్లమెంటుని కుదిపేసింది.

 

అటు కొడుకునీ సమర్థించలేక, ఇటు తను చేసిన పనికి సంజాయిషీ చెప్పుకోలేక చిదంబరం తంటాలు పడుతున్నారు. రెండువైపులా ఇలా మద్దెల దరువులో ఇరుక్కుంటే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు గుమ్మం కూడా తొక్కవలసి వచ్చేట్లుంది. గుజరాత్‌లో ఎన్‌కౌంటర్‌ అయిన ఇస్రత్ జహాన్ తీవ్రవాది కాదంటూ తను హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోర్టులకు సమర్పించిన ప్రకటన నిజం కాదని తేలడంతో, సుప్రీం కోర్టు కూడా చిదంబరం మీద గుర్రుగా ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...