సీరియల్స్‌ని కూడా సెన్సార్ చేయండి... ఓ నిర్మాత కేసు

posted on: Mar 30, 2016 1:01PM

 

టీవీ పెడితే చాలు, కళ్లు మిటకరిస్తూ, బూతులు తిట్టుకుంటూ హడలెత్తించే సీరియల్స్ కోకొల్లలు. ఇక అక్రమసంబంధాలు, వెకిలి నృత్యాల సంగతి చెప్పనే అవసరం లేదు. ఇవి చూసీచూసీ చిరాకేసినవారికి ఓ శుభవార్త. టీవీలో వెలువరించే కార్యక్రమాలకు సెన్సార్‌ చేయరేమంటూ ఓ నిర్మాత కోర్టు మెట్లెక్కాడు. ఎమ్.ఎస్.రవీంద్ర అనే వ్యక్తి కన్నడంలో ఇటీవలే ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రంలో ఫలానా ఫలానా సంగతులు ఉన్నాయంటూ ఆర్భాటంగా టీవీల్లో ప్రకటనలు ఇచ్చాడు. తీరా తుది చిత్రానికి మాత్రం అక్కడి సెన్సార్‌ బోర్డు అంటకత్తెర వేసి వదిలింది. కొన్ని దృశ్యాలను టీవీలో ప్రకటనకి అనుమతించిన సెన్సార్‌ బోర్డు, తుది చిత్రంలో సదరు మార్పులు ఎందుకు చేసిందన్నది రవీంద్ర వాదన.

 

టీవీలో ప్రకటన చూసి వచ్చిన ప్రేక్షకులు, చిత్రంలో సదరు దృశ్యాలు లేకపోవడంతో నిరుత్సాహపడ్డారన్నది అతని ఆవేదన. అసలు టీవీలో వచ్చే కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి సెన్సార్‌ నిబంధనలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం ఏ మేరకు అమలుచేస్తోందో తెలియచేయాలంటూ రవీంద్ర కర్ణాటక హైకోర్టుని వేడుకున్నాడు. రవీంద్ర వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రాంతీయ సెన్సార్‌ బోర్డుకీ, సమాచార మంత్రిత్వ శాఖకీ తాఖీదులు జారీ చేసింది. టీవీలలో వచ్చే ధారావాహికలు, ప్రకటనలు వంటి కార్యక్రమాలన్నింటికీ కూడా సెన్సార్‌ వర్తింపచేయాలని ఎప్పటి నుంచో జనం కోరుతున్నారు. ఈ కేసు ద్వారా అయినా వారి ఆశకి అవకాశం లభిస్తుందేమో చూడాలి!

google-ad-img
    Related Sigment News
    • Loading...