Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో రికార్డు స్థాయిలో సిజేరియన్లు.. ప్రతీ 10 ప్రసవాల్లో 6 ఆపరేషన్లేనా?
posted on: May 30, 2026 3:06PM

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ, పలు సూచీల్లో దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, ఒక విషయంలో మాత్రం తీవ్ర కలవరం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు వైద్య వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇక్కడ జరుగుతున్న ప్రతి పది ప్రసవాలలో దాదాపు ఆరుగురు మహిళలకు ఆపరేషన్ల ద్వారానే డెలివరీ అవుతుండటం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 98.8 శాతం ప్రసూతి కేసులు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ఇది జాతీయ సగటు అయిన 90.6 శాతం కంటే ఎంతో మెరుగైన స్థానం. ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు పెరగడం శుభపరిణామమే అయినప్పటికీ, అందులో 62.2 శాతం డెలివరీలు సిజేరియన్ సెక్షన్ ద్వారా జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘోరమైన సంఖ్య జాతీయ సగటు అయిన 27.2 శాతంతో పోలిస్తే ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. గతంలో జరిగిన ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సర్వే సమయంలో ఈ సిజేరియన్ల సంఖ్య 60.7 శాతంగా ఉండగా, తాజా నివేదిక ప్రకారం అది మరింత పెరిగింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఈ స్థాయిలో సిజేరియన్ల సంఖ్య పెరగకపోవడం ఇక్కడి పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ సిజేరియన్ల రేటు 52.2 శాతంగా నమోదు కాగా, ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో దేశంలోనే అత్యల్పంగా కేవలం 13.2 శాతం మాత్రమే సిజేరియన్లు జరుగుతున్నాయి.
ఈ సర్వే నివేదిక ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని కూడా బట్టబయలు చేసింది. తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న డెలివరీలలో ఏకంగా 83.9 శాతం సిజేరియన్ పద్ధతిలోనే సాగుతున్నాయి. ప్రైవేట్ రంగంలో జాతీయ సగటు కేవలం 54.1 శాతం మాత్రమే ఉండగా, తెలంగాణలో అది కొండెక్కి కూర్చుంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం 48.1 శాతం సిజేరియన్ రేటు నమోదైంది. దీనికి విరుద్ధంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సగటున కేవలం 16.9 శాతం మాత్రమే సిజేరియన్లు జరుగుతున్నాయి.
మరోవైపు గర్భిణుల సంరక్షణ విషయంలో తెలంగాణ మహిళలు ఎంతో అవగాహనతో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. గర్భం దాల్చిన మొదటి 100 రోజుల వరకు రాష్ట్రంలోని 81 శాతం మంది గర్భిణులు ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను క్రమం తప్పకుండా వాడుతున్నారు. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 54.9 శాతం మాత్రమే కావడం విశేషం. గర్భిణులు ఆరోగ్య నియమాలను చక్కగా పాటిస్తున్నప్పటికీ, ప్రసవ సమయానికి వచ్చేసరికి సహజ ప్రసవాల కంటే సిజేరియన్ల వైపే మొగ్గు చూపడం లేదా ఆసుపత్రులు ఆ దిశగా ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలపై ఇప్పుడు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుఖ ప్రసవాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.






