బొత్సకెందుకో ఉలుకు?
posted on: Feb 5, 2014 1:31PM

పైకి సమైక్య నినాదం.. లోపల మాత్రం విభజనవాదం... సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల ఈ ఉభయచర ధోరణే రాష్ట్రం రెండు ముక్కలు అయ్యే పరిస్థితులు తీసుకొచ్చింది. తెలుగు జాతిని రెండు ముక్కలు చేసింది. పచ్చని తెలుగు జాతితో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆటలాడుకుంటూ, తెలుగువారి చేత కాళ్ళు పట్టించుకునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులలో వుండే ఉభయచర బుద్ధి తాజాగా మరోసారి బయటపడింది.
ఇటు సమైక్యవాదులు, అటు విభజనవాదులు ఎవరి పనిలో వాళ్ళు వుంటే, సీమాంధ్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఉన్నత స్థానంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో ఒక హోటల్లో సమావేశమయ్యాడని, వాళ్లిద్దరి మధ్య గంటలకు గంటలు చర్చలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందు తన ఆవేదదను వ్యక్తం చేశాడు. ఇలాంటి నాయకుల ధోరణి వల్లే ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు వచ్చాయని మొత్తుకున్నాడు. కేసీఆర్తో సమావేశమైన సదరు నాయకుడు జగన్తో కూడా టచ్లో వుంటున్నాడని లగడపాటి వెల్లడించాడు.
లగడపాటి మాట్లాడుతూ ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. అయితే, గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అర్జెంటుగా రంగంలోకి దిగిపోయాడు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుడెవరూ కేసీఆర్తో సమావేశం కాలేదని ఢంకా భజాయించి చెప్పేశాడు. ఈ ఇష్యూలో బొత్స అత్యుత్సాహం చూసి కేసీఆర్తో ఢిల్లీలో సమావేశమైంది, జగన్తో టచ్లో వుంటున్నదీ బొత్స సత్యనారాయణేనని రాజకీయ వర్గాలు కన్ఫమ్ అయిపోయాయి.



.jpg)

.webp)

.webp)


