Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బండి భగీరథ్ను పోలీసులే అరెస్ట్ చేశారు : సీఎం రేవంత్
posted on: May 21, 2026 2:45PM

తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రభుత్వం మరియు పోలీసుల చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఒక వైపు ప్రతిపక్షాలు ఈ అరెస్ట్ను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం స్పష్టం చేశారు.
బండి భగీరథ్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా పోలీసులకు అప్పగించారని వస్తున్న వార్తలను ముఖ్యమంత్రి పూర్తిగా ఖండించారు. భగీరథ్ను ఇంట్లో అప్పగిస్తే అది అప్పగింత అవుతుందని, కానీ పోలీసులు ఆయనను హైదరాబాద్ నగరంలోని అప్పా జంక్షన్ వద్ద నడిరోడ్డుపై కారును ఆపి మరీ అరెస్ట్ చేశారని రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టత ఇచ్చారు.
ఈ కేసులో పోలీసులు చట్టప్రకారం నడుచుకున్నారని, ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.ఈ మొత్తం వ్యవహారంలో ఒక మైనర్ బాలికకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వైఖరిని తప్పుబడుతూ, రాజకీయాలు చేయాలనుకుంటే నేరుగా తనను ఓడించాలని, అంతే తప్ప ఒక మైనర్ ఇష్యూని పట్టుకుని చౌకబారు రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.
బాధితురాలైన 17 ఏళ్ల మైనర్ బాలిక వయసును కేటీఆర్ నిర్ధారిస్తారా అని సీఎం ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, గతంలో కేటీఆర్ సొంత బావమరిది డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పుడు చట్టాన్ని గౌరవించి ఎందుకు పోలీసులకు అప్పగించలేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నిలదీశారు. అలాగే గతంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ఫామ్హౌస్లో పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తులను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కేసు మూలాల్లోకి వెళితే, గత మే 8వ తేదీన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బండి భగీరథ్పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74, 75 మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. గత 7 నుండి 8 నెలలుగా సదరు బాలికతో భగీరథ్కు పరిచయం ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శివారులోని ఫామ్హౌస్లో రెండు సార్లు మద్యం తాగించి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, ఈ ఫిర్యాదు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సదరు బాలిక కుటుంబంపై ఎదురు ఫిర్యాదు చేశారు. వారు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, తిరస్కరించడంతో తప్పుడు కేసులు పెడతామని బెదిరించి రూ. 50,000 వసూలు చేశారని, ఆపై రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ క్రిమినల్ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ కేసులో మే 8న ఫిర్యాదు వచ్చినప్పటికీ మే 11 వరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర దుమారం రేగింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన భద్రతా ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నమవడం వల్లే స్వల్ప ఆలస్యమైందని డీజీపీ సి.వి. ఆనంద్ వివరణ ఇచ్చారని తెలిపారు.
అయినప్పటికీ ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. అటు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఈ ఘటనపై సుమోటోగా స్పందించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా బాధితురాలికి న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం నొక్కి చెప్పింది.


.webp)



