Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యువత అంబేద్కర్ని స్పూర్తిగా తీసుకొని బాగా చదువుకోండి : హరీష్ రావు
posted on: Apr 14, 2026 3:48PM

సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తడ్కపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిందని, గ్రామ ప్రవేశంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరిని ముందుగా ఆహ్వానించేది అంబేద్కర్ అవుతారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం సాయి , ఆయన కుమారుడు విగ్రహం ఏర్పాటు చేయడంపై వారిని అభినందించారు.
అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదని, ఆయన అందరికీ చెందిన మహానుభావుడని హరీష్ రావు స్పష్టం చేశారు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదగడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ఆయన గొప్పతనమని తెలిపారు.పేదరికం చదువుకు అడ్డంకి కాదని అంబేద్కర్ జీవితాన్ని చూసి యువత నేర్చుకోవాలని సూచించారు. విదేశాల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నప్పటికీ, దేశంలోని అణగారిన వర్గాల కోసం పోరాడి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వాగ్దానం చేసిన ఆర్థిక సహాయం అందించలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అదేవిధంగా, మాజీ సీఎం కేసీఆర్ కాలంలో విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డిపై కూడా హరీష్ రావు విమర్శలు చేస్తూ, అంబేద్కర్ పట్ల గౌరవం చూపడం లేదని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువతకు హరీష్ రావు పలు సూచనలు చేశారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు బానిసలుకాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. అంబేద్కర్ చూపించిన మార్గంలో నడుస్తూ ఉన్నత విద్యను సాధించాలని పిలుపునిచ్చారు.“వ్యసనాలకు అలవాటు అయితే జీవితాలు నాశనం అవుతాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షల రూపాయలు కోల్పోవద్దు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయొద్దు” అంటూ యువతకు హరీష్ రావు సూచించారు.






