దత్తతకు వూరే అక్కర్లేదు...రోగి కూడా..!

posted on: Jun 3, 2016 2:46PM

భారత ప్రధాని నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నారైలు, విద్యావంతులు, అధికారులు, సెలబ్రిటిలు ఇలా చాలా మంది గ్రామాలను దత్తత తీసుకుని వాటి బాగోగులు చూస్తున్నారు. దేశం మొత్తం ఇది ఒక ఉద్యమంలా సాగుతోంది. ఈ దత్తత అన్న పదానికి కొత్త అర్థం చెప్పేందుకు అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్‌) వినూత్నంగా ఆలోచించింది.

 

అదేంటంటే ఊరిని దత్తత తీసుకున్నట్టే రోగులను కూడా దత్తత తీసుకోవచ్చు కదా అని పలువురిని ఆలోచింపజేస్తోంది. వైద్య రంగంలో దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఎయిమ్స్‌కు ప్రతిరోజూ దాదాపు 10 వేల మంది రోగులు వస్తూ ఉంటారు. వీరిలో దాదాపు రెండు లక్షల మంది నయం కాని జబ్బులతో ఆసుపత్రిలో చేరుతారు. అందరూ పేద, మధ్యతరగతి వారే..శస్త్ర చికిత్స చేస్తే తప్ప వీరిలో చాలా మంది బతకడం కష్టం, కాని వారికి ఆపరేషన్ చేయించుకునే స్థోమత ఉండదు. ఒకవేళ ఆసుపత్రి నిధుల నుంచి ఆపరేషన్ చేసి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తే, ఇంటికెళ్లి అవసరమైన చికిత్స చేసుకోవడానికి తగిన పరికరాలను వారు కొనలేకపోతున్నారు. నానా తిప్పలు పడి బ్రతుకుతారని ఆపరేషన్ చేయిస్తే..ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లి వైద్య ఖర్చులు భరించే శక్తి వారి వారి కుటుంబసభ్యులకు, బంధువులకు లేదు. అందుకే అటువంటి రోగులను వారి బంధువులు ఇళ్లకు తీసుకెళ్లకుండా ఆసుపత్రిలోనే వదిలేస్తున్నారు.

 

ఈ పరిస్థితిని గమినించిన ఎయిమ్స్ యాజమాన్యం రోగుల బతుకులు మార్చాలని ఆలోచించింది. అందుకే "రోగిని దత్తత తీసుకోండి" అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం క్రింద పెద్ద మనసున్న దాతలు రోగులను పరిశీలించి, విరాళాన్ని ఆన్‌లైన్ ద్వారా ఇవ్వవచ్చు. బుధవారం ప్రయోగాత్మకంగా ప్రారంభమైన 24 గంటల్లోనే ఇద్దరు దాతలు రూ.14 వేలు విరాళంగా ఇచ్చారు. ఈ పథకాన్ని ఎయిమ్స్‌ డైరెక్టర్ ఎంసీ మిశ్రా అధికారికంగా రేపు ప్రారంభించనున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలన్న గొప్ప మనుసున్నవారు ఎప్పుడూ స్పందిస్తారని ఈ విషయం ద్వారా మరోసారి నిరూపితమైంది. ఎయిమ్స్‌ బాటలో మరిన్ని ఆసుపత్రులు నడిస్తే దేశంలో వైద్యం అందక చనిపోయేవారి సంఖ్య తగ్గుతుంది. సో హ్యాట్సాఫ్ టూ ఎయిమ్స్.

google-ad-img
    Related Sigment News
    • Loading...