యెర్నేని సీతాదేవి ఇక లేరు 

posted on: May 27, 2024 11:14AM

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన యెర్నేని సీతాదేవి ఈ ఉదయం కన్నమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ముదినేపల్లి నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీతాదేవి విజయ డెయిరీ డైరెక్టర్‌ గానూ పనిచేశారు. ఆమె స్వస్థలం కైకలూరు మండలంలోని కోడూరు. 2013లో సీతాదేవి బీజేపీలో చేరారు.
సీతాదేవి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త నాగేంద్రనాథ్ (చిట్టి) ఏపీ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. నిరుడు ఆయన కన్నుమూశారు. నాగేంద్రనాథ్-సీతాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కైకలూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీతాదేవి మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...