Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మారారా.. మారినట్లు నటిస్తున్నారా?.. సోము వీర్రాజుపై కూటమి పార్టీల్లో అనుమానాలు!
posted on: Mar 12, 2025 10:22AM

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ బెర్త్ లభించడం, ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో హై డ్రామా చోటు చేసుకోవడం మారిపోయింది. బీజేపీ అడిగింది సరే.. చంద్రబాబు ఎలా అంగీకరించారు? గత ఎన్నికల సమయంలో సోము వీర్రాజు, జీవీఎల్ వంటి వారు పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పోటీకి చేసిన ప్రయత్నాలను గట్టిగా అడ్డుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు సోముకు బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడాన్ని ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడం పక్కన పెడితే.. అసలు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ బెర్త్ లభించడం తెలుగుదేశం క్యాడర్ ను తీవ్ర నిరాశకు గురి చేసిందనడంలో సందేహం లేదు.
ఒక్క తెలుగుదేశం క్యాడర్ నే కాదు, జనసేన శ్రేణులు కూడా సోముకు ఎమ్మెల్సీ బెర్త్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఆఖరికి బీజేపీలో కూడా సోముకు టికెట్ పై నిరాశ, నిస్ఫృహలు వ్యక్తం అవుతున్నాయి. 2014-19లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సోము వీర్రాజు తెలుగుదేశంకు వ్యతిరేకిగా వ్యవహరించారు, ఆ తరువాత 2019-24 మధ్య అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వంతో అంటకాగారు. జగన్ చెప్పినట్లల్లా వ్యవహరించారు. అప్పట్లో సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, జివిఎల్ నరసింహారావు తదితరులు టీడీపీకి బద్ధ వ్యతిరేకులుగా వ్యవహరించారు. అంతే కాదు 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం, బీజేపీ పొత్తును వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 2018లో తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు రావడానికి ఒక విధంగా సోము వీర్రాజు అండ్ కో యే కారణం.
సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయన వ్యవహరించిన తీరును బీజేపీ రాష్ట్ర నాయకులే వ్యతిరేకించారు. పార్టీ అధిష్ఠానానికి సోముపై ఫిర్యాదులు చేశారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య చక్కటి సమన్వయం ఉన్న సమయంలో మళ్లీ సోము వీర్రాజును ఎమ్మెల్సీ చేయాలని బీజేపీ హైకమాండ్ భావించడం, దానిని చంద్రబాబు అభ్యంతరం లేకుండా ఆమోందించి అంగీకరించడంతో కూటమి పార్టీల శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన తరువాత సోము వీర్రాజు మీడియాతో మాట్లాడిన మాటలను విశ్వసించలేకపోతున్నాయి. మీడియాతో మాట్లాడుతూ.. సోము వీర్రాజు తాను సుద్దపూసనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. తాను మునుపటి వీర్రాజును కాననీ, పూర్తిగా మారిపోయాననీ నమ్మించడానికి ప్రయత్నించారు. తనకు చంద్రబాబుతో చక్కటి అనుబంధం ఉందని చెప్పుకున్నారు. చంద్రబాబుతో తన అనుబంధాన్ని మోడీ, చంద్రబాబుల మధ్య ఉన్న అనుబంధంతో పోల్చారు. అక్కడితో ఆగకుండా.. తాను జగన్ కోవర్టును కాననీ, అసలు జగన్ 2019లో సీఎం అయ్యే వరకూ ఆయనెవరో కూడా తనకు తెలియదనీ చెప్పుకున్నారు.
అమరావతిని తాను వ్యతిరేకించానంటూ జరిగిన ప్రచారం నిజం కాదనీ, తానెప్పుడూ అమరావతికి మద్దతుగానే నిలిచాననీ నమ్మబలకడానికి ప్రయత్నించారు. అయితే ఇంతగా సోము వీర్రాజు తాను జగన్ కోవర్టును కాదని చెప్పుకోవడానికి ప్రయత్నించినా తెలుగుదేశం క్యాడర్ కానీ, జనసేన శ్రేణులు కానీ నమ్మడం లేదు. సోము వీర్రాజులో మార్పు నిజమేనా, లేక తాను మారానని నమ్మించడానికి ఆస్కార్ స్థాయిలో ఆయన నటిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కార్ మనుగడ పూర్తిగా చంద్రబాబుపై అంటే తెలుగుదేశం పార్టీకి లోక్ సభలో ఉన్న సంఖ్యాబలంపై ఆధారపడి ఉంది. అందుకే సోము వీర్రాజు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయగానే చంద్రబాబు ఆశీర్వాదం కోసం పరుగెత్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు కూడా సోము వీర్రాజుకు ఆ సందర్భంగా గట్టి హెచ్చరికే చేశారని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సహా కూటమి పార్టీలేవీ సోము వీర్రాజును విశ్వసించడం లేదనీ, ఆయనలో మార్పు వచ్చిందని నమ్మడం లేదనీ పరిశీలకులు అంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ మనుగడ తెలుగుదేశంపై ఆధారపడి ఉంది కనుక సోము గతంలోలా తోక జాడించలేరనీ, జగన్ కోసం పని చేయలేరనీ అంటున్నారు. మొత్తం మీద ఆయన కూటమి పార్టీల నిఘాలోనే ఉంటారనడంలో సందేహం లేదు.


.webp)



