తుపాను బాధితులకు సాయంగా రూ.3 వేలు : సీఎం చంద్రబాబు

 

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3,000 చొప్పున అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి, వైద్య శిబిరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అత్యవసర వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం చేపడుతున్న సహాయక చర్యలు భవిష్యత్తు తుపానులకు ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.మొంథా' తుపాను ప్రభావంతో విజయవాడ నగరానికి వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన జారీ చేసింది.

మంగళవారం నగరంలో 16 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారు.

తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం ఉద్ధృతంగా ఉన్న సమయంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని సూచించారు. అయితే, పాలు, కూరగాయలు, మెడికల్ షాపుల వంటి నిత్యావసర సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కార్యాలయం సీసీఎస్ కు మార్పు

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్​ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం హదరాబాద్ సీపీ నేతృత్వంతో  మరో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొనసాగిన  సిట్ కార్యాలయాన్ని  కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ (సిసిఎస్)కు మార్చారు. శనివారం (డిసెంబర్ 20) నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యకలాపాలన్నీ సీసీఎస్ కేంద్రంగానే సాగుతాయి.   ఫోన్ ట్యాపింగ్‌  కేసులో మరింత లోతైన, సమగ్రమైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం (డిసెంబర్ 18) ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.   ఈ సిట్‌ లో  రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి,   డీఎస్పీలు శ్రీధర్. నాగేందర్ సభ్యులుగా నియమించారు.   రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలను వెలికితీయడమే లక్ష్యంగా సజ్జనార్ నేతృత్వంలోని సిట్ కు విస్తృత అధికారాలు కల్పించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.   ఇలా ఉండగా ఈ కేసులో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ ఎంక్వయిరీలో ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును సిసిఎస్‌కు తరలించారు. సిసిఎస్‌లో ప్రభాకర్ రావుకు ప్రత్యేక గదిని సిట్ ఏర్పాటు చేశారు.   

ఐదో టి20లో సఫారీలు చిత్తు..టి20 సిరీస్ టీమ్ ఇండియా కైవసం

దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ ను టీమ్ ఇండియా 3-1 తేడాతో కైవసం చేసుుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్ 19) రాత్రి జరిగిన చివరి ఐదో టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా  సఫారీలను  30 పరుగుల తేడాతో చిత్తు చేసింది.  ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్నీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి  231 పరుగుల భారీ స్కోరు సాధించింది. 232 పరుగులు విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 201 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. భారీ విజయలక్ష్యంతో భాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత ఆరంభాన్ని అందించాడు.   డికాక్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా ప వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసి మంచి స్థితిలో ఉంది. ఆ తరువాత  13 పరుగులు చేసిన హండ్రిక్స్  ఔటయ్యాడు. అయితే డికాక్ దూకుడు కొనసాగించాడు. డికాక్ క్రీజ్ లో ఉన్నంత సేపూ దక్షిణాఫ్రికా లక్షాన్ని ఛేదిస్తుందనే అనిపించింది. అయితే  11వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా   డికాక్ ను కాట్ అండ్ బౌల్డ్ గా పెవిలియన్ కు పంపాడు. డీకార్   డికాక్ 35 బంతుల్లో 65 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా లయ కోల్పోయింది. బ్యాట్స్ మన్ పరుగుల కోసం అంత చలిలోనూ చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. డికాక్ ఔటైన తర్వాత   5 ఓవర్లలో ఆఫ్రికా 38 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే.. భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్ధమౌతుంది.  డివాల్డ్ బ్రెవిస్ (31) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.  ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అదిరే ఆరంభాన్నిచ్చారు. సంజు శాంసన్  22 బంతుల్లో 37 పరుగులు, . అభిషేక్ శర్మ 21 బంతుల్లో34 పరుగులు చేశాడు. ఆ తరువాత తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యాలు పరుగుల సునామీ సృష్టించారు. ముఖ్యంగా హార్ధిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగి పాతిక బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  అలాగే తిలక్ వర్మ  42 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, హర్షదీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హార్ధిక్ పాండ్యాకు దక్కింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు.

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

  ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి తాజా రాజకీయ పరిణామలపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను చంద్రబాబు, అమిత్ షాకి వివరించారు.  కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయిన సీఎం అమరావతి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని, హైవే నెట్‌వర్క్‌లతో రాజధానిని కనెక్ట్ చేయాలని కోరారు. మరోవైపు కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి  హర్దీప్ ఎస్ పూరీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రూ. 96,862 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులలో ఒకటి అయిన నెల్లూరు జిల్లాలోని బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి  మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి సమావేశం  అయ్యారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు అవశ్యకతను ఆయన కు వివరించారు. సవరించిన డీపీఆర్ లను ఆమోదించాలని కోరారు. 

భార్యపైన తనకున్న ప్రేమను చాటుకున్న ఓ రైతు

  రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలో ఉన్న చిలుకూరు గ్రామంలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 89 ఏళ్ల వయసులోనూ తన జీవిత సహచరిపై ఉన్న అపారమైన ప్రేమను చాటుతూ ఓ రైతు తన భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన దృశ్యాన్ని  చూసిన వారు కంటతడి పెట్టుకున్నారు. కళ్లెం నర్సింహారెడ్డి, లక్ష్మి దంపతులు... వీరు చిలుకూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు.  గత సంవత్సరం క్రితం భార్య లక్ష్మి మరణించింది. దీంతో భార్య లక్ష్మి ప్రధమ వర్ధంతి సందర్భంగా కళ్లెం నర్సింహా రెడ్డి, తన వ్యవసాయ క్షేత్రంలో భార్య లక్ష్మీ విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూతుళ్లు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయన కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం ఆమె పక్కనే తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ముప్పై సంవత్సరాల పాటు అమెరికాలో వ్యవసాయం చేస్తూ ఆధునిక, ఉత్తమ వ్యవసాయ పద్ధతులను అమలు చేసిన నర్సింహా రెడ్డి, ఆ కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ చేతుల మీదుగా అవార్డును కూడా అందు కున్నారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన చిలుకూరులో స్థిరపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. తన ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్న భార్య లక్ష్మీ మరణించడంతో నర్సింహా రెడ్డి ఒంటరిగా మిగిలిపోయారు. అయితే ఆమె జ్ఞాపకాలను మరచి పోకుండా ఉండేందుకు, జీవితాంతం తనతోనే ఆమె ఉంటుందనే భావనతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. “ఆమె ఒంటరిగా ఉండ కూడదు… నేను ఆమెకు తోడుగా ఉంటాను” అన్న భావంతోనే భార్య పక్కనే తన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినట్లు ఆయన తెలిపారు. జీవిత భాగస్వామి పై నిస్వార్థమైన అనురా గాన్ని చూపిస్తున్న రైతును చూసి అందరూ కంటతడి పెట్టుకున్నారు.చిలుకూరులో జరిగిన ఈ ఘటన, ప్రేమకు వయస్సుతో పని లేదని మరోసారి నిరూపించింది.

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

  తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న A29 టిటిడి అధికారి సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సుబ్రహ్మణ్యం 2017–18 మరియు 2020 నుంచి 2023 వరకు టిటిడి కొనుగోళ్ల విభాగంలో జనరల్ మేనేజర్‌గా పనిచేసిన సమయంలో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పీపీ వివరించారు. డెయిరీ ప్లాంట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేయకుండానే అనుకూల నివేదికలు ఇచ్చి, అర్హత లేని సంస్థలైన భోలేబాబా డైరీ, వైష్ణవీ డైరీ, మలగంగా మిల్క్ అగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుంచి తిరుమలకు నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించినట్టు వాదించారు. దీనికి ప్రతిఫలంగా నిందితుడు సుబ్రహ్మణ్యం వెండి ప్లేట్లు, శాంసంగ్ మొబైల్ ఫోన్‌తో పాటు రూ.3.50 లక్షల లంచం తీసుకున్నట్టు సిట్ గుర్తించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, అప్పన్నతో కలిసి కుట్ర చేసిన తీరును స్పష్టంగా చూపించే సాక్ష్యాలు ఉన్నాయని పీపీ జయశేఖర్ తెలిపారు. అలాగే వైవి సుబ్బారెడ్డి పీఏ అప్పన్న ఒత్తిడితోనే సుబ్రహ్మణ్యం ఈ అక్రమాలకు పాల్పడ్డాడని కోర్టులో వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ న్యాయమూర్తి, నిందితుడిపై ఉన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంటూ సుబ్రహ్మణ్యం బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించారు.  

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి

  ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరమే లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజావాణి రెండో వార్షికోత్సవం సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతు ఇప్పటివరకు 74 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించారు. విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నా, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.   అధికారానికి దూరమైన విపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. తాము మరింత ముందుకు వెళ్తామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజావాణి విజయవంతం చేసిన చిన్నారెడ్డి, దివ్యాదేవరాజన్‌కు డిప్యూటీ సీఎం  అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను విని వాటికి పరిష్కారం చూపే ఈ ప్రజావాణి కార్యక్రమం నిజమైన ప్రజా పరిపాలనకు ప్రతిరూపమని ఆయన అన్నారు. దేశంలో ఇంత సమర్థంగా ప్రజా గోడు విని పరిష్కరిస్తున్న కార్యక్రమం ఎక్కడా లేదని పేర్కొన్నారు.సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాంకేతిక సహకారంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేయడం ద్వారా మరింత పారదర్శకంగా ప్రజావాణి కొనసాగుతుంది. ప్రజల మేలు కోసం రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థ పనిచేయడం మా ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి ఇన్‌ఛార్జి దివ్యదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారుల తమ అనుభవాల పంచుకున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్... మరో సిట్ ఏర్పాటు

  తెలంగాణలో రాజకీయంగా సంచలనం సృష్టించిన.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు నమోదైన 21 నెలల తర్వాత.. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం.. టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. దీంతో.. ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుందనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. ఐదుగురు ఐపీఎస్‌లు సహా తొమ్మిది మంది పోలీసు అధికారులతో.. డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. గతంలో డిపార్ట్మెంట్ పరంగా సిట్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రభుత్వపరంగా సిట్ ఏర్పాటు అయింది.  మొన్నటిదాకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరినే.. మరోసారి సిట్ దర్యాప్తు అధికారిగా నియమించడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించారు. వారితో పాటు వందల మంది సాక్షుల వాంగ్మూలాలు సేకరించారు. ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో జరగబోయే దర్యాప్తులో.. ఇంకా ఎవరు బయటికొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అధికారులు దర్యాప్తు చేసినా.. ఇన్వెస్టిగేషన్‌ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతుల్లో జాప్యం జరిగిందే ప్రచారం జరుగుతున్న క్రమంలో.. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారనే కోణంలో ఈసారి దర్యాప్తును విస్తృతం చేసే అవకాశముంది.  ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి.. ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌లో అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడటం ద్వారా.. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సహకరించారనే ఆరోపణలతో.. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. అప్పట్లోనే టాస్క్‌ఫోర్స్‌ రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్‌రావును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని విచారణలోనే.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా గుర్తించి.. 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు అమెరికాలో తలదాచుకోవడంతో.. రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయించి భారతదేశానికి రప్పించారు.  వారిని రప్పించినా.. ఎస్‌ఐబీలో కీలక ఆధారాలను ధ్వంసం చేయడంతో దర్యాప్తులో పురోగతి కనిపించలేదు. సిట్ విచారణలో.. కీలక నిందితుడు ప్రభాకర్ రావు నోరు విప్పలేదు. కీలక సమాచారం ఏదీ ఇవ్వలేదని సిట్ తెలిపింది. అధికారుల ఆదేశాలతో.. అంతా రూల్స్ ప్రకారమే చేశానని చెప్పినట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు, వ్యాపారస్తులు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై ప్రభాకర్ రావు స్పష్టత ఇవ్వలేదు. రివ్యూ కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ జరిగిందని సమాధానమిచ్చారు. హార్డ్‌ డిస్కుల ధ్వంసం కూడా నిబంధనల ప్రకారమే చేశానన్నారు. ఈ-మెయిల్, క్లౌడ్ డేటాలో వ్యక్తిగత సమాచారం మాత్రమే డిలీట్ అయిందని తెలిపారు.  ట్యాపింగ్ డివైజ్‌లు అమెరికాలోనే మరిచిపోయానని తెలిపారు. కానీ.. అసలు సూత్రధారులపై సమాచారం ఇవ్వలేదు. దాంతో.. దర్యాప్తు ముందుకు కదల్లేదు. పైగా.. ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో చెప్పిన ఉన్నతాధికారులను విచారించేందుకు అవాంతరాలు ఎదురవడంతో.. ఈ కేసు విచారిస్తున్న సిట్ టీమ్ ముందుకెళ్లలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. వారిని విచారిస్తే గానీ.. కేసు దర్యాప్తు కొలిక్కి రాదనే అభిప్రాయాలు వ్యక్తమైనా.. ఇన్నాళ్లూ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ వ్యవహారం వెనుక.. అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతలున్నా.. ఆధారాల్ని ధ్వంసం చేశామనే ధీమాతోనే ప్రభాకర్ రావు వాస్తవాలను చెప్పడం లేదని అనుమానిస్తున్నారు.  ఈ క్రమంలోనే.. మరింత లోతుగా విచారించేందుకు.. ఉన్నతాధికారులు, నాయకుల గుట్టు విప్పేందుకే.. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావుకు మరో షాక్ తగిలింది. సిట్ దర్యాప్తునకు సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన కస్టడీని డిసెంబర్ 25 దాకా పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు కస్టడీ ఇంటరాగేషన్ స్టేటస్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు.  ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదని.. ఇంకొన్ని రోజులు విచారణ జరిపేందుకు.. కస్టడీ పొడిగించాలని.. ప్రభుత్వం తరఫు లాయర్లు కోరారు. ఇందుకు ఏకీభవించిన ధర్మాసనం ప్రభాకర్ రావు కస్టడీని వారం పొడిగించింది. ఆ మరుసటి రోజే.. ఆయన్ని విడుదల చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ సమయంలో.. తదుపరి విచారణ దాకా.. ప్రభాకర్ రావు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను.. జనవరి 16కు వాయిదా వేసింది. అయితే.. ఇన్నాళ్లూ తేల్చనిది.. ఈ నెల రోజుల్లో కొత్తగా గవర్నమెంట్ వేసిన సిట్ ఏం తేల్చబోతోందనేది ఆసక్తి రేపుతోంది.

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్.. సెలబ్రిటీల ఆస్తులు అటాచ్

  ఇటీవల బెట్టింగ్ యాప్స్‌తో కోట్ల రూపాయలు కాజేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఇందుకోసం కొంతమంది సెలబ్రెటీలను ప్రమోషన్లకు వాడుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ కోసం సెలబ్రెటీలు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేసిన వారిపై ఈడీ కొరడాఝులిపిస్తుంది.  ఆన్‌లైన్ బెట్టింగ్, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు దూకుడు పెంచారు. పీఎంఎల్ ఏ కేసులో ప్రముఖల ఆస్తులను అటాచ్ చేశారు. ఇప్పటికే నటులు సోనూసూద్‌, నేహాశర్మ ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ, తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, రాబిన్ ఊతప్ప, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, నటి ఊర్వశి రౌతేలా తల్లి ఆస్తులు సైతం అటాచ్ చేశారు. 

పీపీపీకి మద్దతిస్తే అరెస్టులా...జగన్ బెదిరింపులపై పల్లా ఫైర్

  పీపీపీ విధానానికి మద్దతిచ్చిన వారిని అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు  ఘాటుగా మండిపడ్డారు. మనం డా.బీఆర్ అంబేడ్కర్  రచించిన రాజ్యాంగంలో జీవిస్తున్నాం. నీ తాత రాజారెడ్డి రాసిన రాజ్యాంగంలో కాదు అంటూ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్–ప్రైవేట్ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంటే, పీపీపీకి మద్దతిచ్చిన వారిని జైలుకు పంపుతామని బెదిరించడం నియంతృత్వ ఆలోచనలకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజల చేతిలో ఇప్పటికే గుణపాఠం నేర్చుకున్నప్పటికీ జగన్ ఇంకా మారలేదని, అదే అహంకారంతో మళ్లీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీకి మద్దతిచ్చిన వారిని అరెస్టు చేస్తామని భయపెట్టడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నవారిని జగన్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ పాలనలోనే అనేక పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని గుర్తు చేశారు.  జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరు జడిచేది లేదని, చట్టాలు ఎవరు అతిక్రమించినా జైలు ఊసలు లెక్కించాల్సిందేనని పల్లా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పారని, రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గవర్నర్ వద్దకు తీసుకెళ్లిన ఒక కోటి సంతకాలు నిజమైతే, వాటికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను మీడియాకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని టీడీపీ చీఫ్ ప్రశ్నించారు. ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు వైసీపీ ఎంపీలు పీపీపీ మోడల్‌కు మద్దతు ఇచ్చి, రాష్ట్రానికి వచ్చాక దానికే వ్యతిరేకంగా ఫేక్ ఉద్యమాలు చేయడం డిల్లీలో ఒక మాట – గల్లీలో ఇంకో మాట అనే జగన్ రాజకీయ నాటకానికి నిదర్శనమన్నారు. పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్న విధానమని పల్లా  స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతోనే నడుస్తాయని, వాటి యాజమాన్యం, పరిపాలన, పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని తెలిపారు.  అడ్మిషన్లు, ఫీజు నిర్మాణం, సేవల ప్రమాణాలు అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ప్రైవేట్ భాగస్వామికి ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం లేదన్నారు. ఈ కాలేజీల్లో 70 శాతం పడకలు ఎన్టీఆర్ వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్ పథకాల లబ్ధిదారులకే కేటాయిస్తారని, దీని ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జగన్ పాలనలో మెడికల్ కాలేజీల పేరుతో కేవలం రూ.1,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అవి కూడా కేంద్ర నిధులేనని పల్లా గుర్తు చేశారు. ఇప్పుడు రూ.3,000 కోట్లు ఖర్చు చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రూ.450–500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించినప్పుడు పేదల ఆరోగ్యం, సంక్షేమం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.  అదే డబ్బుతో కనీసం రెండు మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని, కానీ ప్రజలకు ఉపయోగం లేని వైట్ ఎలిఫెంట్‌గా రుషికొండ ప్యాలెస్ మిగిలిందని విమర్శించారు. మీ సాక్షి పత్రికే రుషికొండకు రూ.450 కోట్లు ఖర్చయిందని రాసిందని, ఇప్పుడు రూ.230 కోట్లు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని నిలదీశారు. మిగిలిన డబ్బు ఎవరికి కమీషన్లుగా వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నీ పాలనలోనే 104, 108 సేవలను ప్రైవేటైజ్ చేశావని, ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయినప్పుడు ప్రజల ఆరోగ్యం గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అమరావతి, పోలవరం, పరిశ్రమలను అక్కసుతో నాశనం చేసిన నువ్వు ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదని పల్లా  మండిపడ్డారు.  రుషికొండపై చూపిన ప్రేమను నర్సీపట్నం మెడికల్ కాలేజీపై చూపి ఉంటే అది ఇప్పటికి పూర్తయ్యేదని అన్నారు. 30 ఏళ్లు పట్టే మెడికల్ కాలేజీలను కేవలం రెండేళ్లలో పూర్తి చేసే పీపీపీ విధానాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావని ప్రశ్నించారు. మీ వాటాదారులకు కమీషన్లు పోతాయనే భయమే దీనికి కారణమా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పేదల సంక్షేమమే లక్ష్యంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేశారని పల్లా  తెలిపారు. ఈ విధానంతో అదనంగా 220 మెడికల్ సీట్లు రాష్ట్రానికి వస్తాయని, అందులో 110 సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలోనే ఉంటాయని చెప్పారు. రెండేళ్లలోనే కాలేజీలు పూర్తై 2,500 ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.  జగన్ విధానంలో అయితే ఇదే ఫలితం సాధించడానికి 15–20 ఏళ్లు పట్టేదన్నారు. పీపీపీ విధానానికి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, నేషనల్ మెడికల్ కమిషన్, నీతి ఆయోగ్, హైకోర్టు కూడా పూర్తి మద్దతు ఇచ్చాయని టీడీపీ చీఫ్ గుర్తు చేశారు. వైద్య విద్య ఖర్చులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పీపీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు.