అక్కడ 90 ఏళ్లు మించి బతికేస్తారు - ఎందుకంటే...
1990లో మన దేశపౌరుల సగటు ఆయుర్దాయం 58 ఏళ్లు. ఇది ప్రస్తుతం 68 ఏళ్లకు చేరుకుంది. శిశు మరణాలు తగ్గడం, మంచి పోషకాహారం, మెరుగైన వైద్య సదుపాయాలు వంటి కారణాల వల్లే ఈ మార్పు వచ్చిందని మన ప్రభుత్వాలు సంబరపడుతూ ఉంటాయి. కానీ మిగతా దేశాలతో పోలిస్తే మన సగటు ఆయుర్దాయం చాలా దారుణం. ఆయుర్దాయాల జాబితాలో మనది ఏకంగా 164వ స్థానం. ఇదిలా ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు ఉలిక్కిపడేలా మరో సర్వే వెలుగులోకి వచ్చింది. బ్రిటన్లోని ప్రఖ్యాత Imperial College London, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఈ సర్వేను నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితులని అంచనా వేస్తూ 2030 నాటికి వేర్వేరు దేశాలలోని ఆయుర్దాయం ఎలా ఉంటుందనేదే ఈ సర్వే లక్ష్యం. ఇందుకోసం వారు 35 అభివృద్ధి చెందిన దేశాల తాలూకు గణాంకాలను సేకరించారు. ఇందులో దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో నిలిచే అవకాశాలు మెరుగ్గా కనిపించాయి. 2030నాటకి అక్కడి సగటు మనిషి ఆయుర్దాయం 90 ఏళ్లకు మించిపోతుందట. కేవలం దక్షిణ కొరియానే కాదు... స్విట్జర్లాండ్, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలెన్నో 80 ఏళ్లకు మించిన సగటు ఆయుర్దాయాన్ని సాధిస్తాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. పై జాబితాను చూడగానే దక్షిణ కొరియాలో అంతేసి ఆయుర్దాయం ఉండేందుకు కారణాలు ఏమిటి అన్న అనుమానం రాక మానదు. ఎదిగే వయసులో తగిన పోషకాహారం అందడం, రక్తపోటు అదుపులో ఉండటం, పొగతాగే అలవాటు లేకపోవడం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పుల మీద ఎప్పటికప్పుడు అవగాహన ఏర్పరుచుకోవడం వంటి చర్యల వల్లే అక్కడి ఆయుర్దాయం అద్భుతంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ కొరియా సంగతి అలా ఉంచితే అమెరికా వాసుల ఆయుర్దాయంలో మాత్రం 2030 నాటికి పెద్దగా మార్పులు రాకపోవచ్చునని తేలింది. పెరిగిపోతున్న ఊబకాయం, పేట్రేగుతున్న హత్యల కారణంగా వారి సగటు ఆయుష్షు 80 ఏళ్లలోపే ఉంటుందట. ఒకప్పుడు మనిషి సగటు ఆయుర్దాయం 90 ఏళ్లు దాటడం అసాధ్యం అనుకునేవారు. కానీ ఆ ఊహ కేవలం అపోహేనని తాజా సర్వే రుజువుచేస్తోంది. 65 ఏళ్లు దాటినవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిక్షేపంగా నిండు నూరేళ్లు జీవించవచ్చని చెబుతోంది. అంతేకాదు! ఒకప్పుడు ఆడవారికంటే మగవారు త్వరగా చనిపోతారనే నమ్మకం కూడా ఉండేది. అనారోగ్యకరమైన అలవాట్లు, హత్యలకు దారితీసే గొడవలు, రోడ్డు ప్రమాదాల కారణంగా వారు కాస్త త్వరగానే తనువు చాలించేసేవారు. కానీ రానురానూ మగవారి జీవిత విధానం బోలెడు జాగ్రత్తలతో నిండిపోతోందట. కాబట్టి మున్ముందు మగవారికీ, ఆడవారికీ మధ్య ఆయుర్దాయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని చెబుతున్నారు. సర్వే జరిగిన దేశాల జాబితాలో మన దేశం లేదు. కానీ ఈ సర్వే నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. విజ్ఞానరంగం అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహిస్తే చాలు సెంచరీ కొట్టేయడం అసాధ్యం కాదు. అలాగే 60వ వడిలో పడిన వృద్ధులకి ప్రభుత్వరం ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ తగిన భరోసాని కల్పించగలిగితే వారు హాయిగా మరెంతో కాలం జీవించే అవకాశం ఉంది. - నిర్జర.
read moreఉపవాసం ఇలా చేసి చూడండి
శివరాత్రి అనగానే ఉపవాసం గుర్తుకువస్తుంది. ఉపవాసం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు... ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ అది చేకూర్చే లాభం అసమాన్యం. అలాంటి ఉపవాసాన్ని చేసేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. - చాలామంది రేపు ఉపవాసం అనగానే ముందురోజు రాత్రి సుష్టుగా భోజనం చేస్తారు. ఇదేమంత మంచి పద్ధతి కాదు. శరీరాన్ని నిదానంగా ఉపవాసాన్ని సిద్ధపరచడం ముఖ్యం. అందుకే మన పెద్దలు ఏకాదశి రోజు ఉపవాసం చేయాలంటే దశమి రాత్రి నుంచే మొదలుపెట్టాలనీ, శివరాత్రి ఉపవాసాన్ని కూడా ముందురోజు నుంచే ఆరంభించాలనీ చెబుతుంటారు. - ఉపవాసం ఉండటం మంచిదే! కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండితీరాలన్న నియమం ఏదీ లేదు. షుగర్ వ్యాధి ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారు, విపరీతంగా కాయకష్టం చేసే పనిలో ఉండేవారు ఉపవాసం ఉండటం వల్ల లేనిపోని సమస్యలు రావచ్చు. - స్వల్ప వ్యాయామం చేసినా కానీ మనకి తెలియకుండానే శరీరంలోని శక్తంతా దహించుకుపోతుంది. దానిని తిరిగి భర్తీ చేసేందుకు తగిన ఆహారం అందదు కాబట్టి నిస్సత్తువ, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఉపవాసం చేసే రోజున వ్యాయామానికి సెలవివ్వడం మంచిది. - శరీరానికి ఆహారం ద్వారా ఎంతో కొంత నీరు అందుతూ ఉంటుంది. ఉపవాసం రోజున ఆ అవకాశం ఉండదు కాబట్టి, ఎక్కువ మంచినీటితో ఆ లోటుని భర్తీ చేయవలసి ఉంటుంది. తద్వారా డీహైడ్రేషన్కు లోనయ్యే ప్రమాదం రాదు. ఇక ఉపవాసం రోజున జీర్ణవ్యవస్థ ఖాళీగా ఉంటుంది కాబట్టి, అందులోకి చేరిన నీరు పేగులను శుద్ధి చేసే అవకాశం దక్కుతుంది. అందుకనే ఉపవాసపు రోజున ఎప్పటికప్పుడు తగినంత నీరు తాగుతూ ఉండాలి. - ఆహారం లేకుండా పూట గడవని మనకి ఉపవాసం నిజంగా ఓ పరీక్షే! అందుకే ఎలాంటి నీరసానికి లోనవకుండా ఉండాలంటే తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోమని సూచిస్తున్నారు. పెద్దగా జీర్ణప్రక్రియ అవసరం లేకుండానే తేనె మన శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది. ఇక నిమ్మరసం సత్తువని కలిగిస్తుంది. - ఉపవాసం ఉన్న రోజున ఏదో ఒక వ్యాపకంలో మునిగితేలండి. శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టకుండా మనసు మాత్రమే నిశ్చలంగా ఉండే పనిలో నిమగ్నమవ్వండి. ఏదన్నా పుస్తకం చదవడమో, ప్రసంగాలు వినడమో, ధ్యానంలో గడపడమో చేయడం వల్ల ఉపవాసానికి మంచి ఫలితం దక్కుతుంది. - చాలామంది ఉపవాసం చేసే రోజు విపరీతంగా కాఫీ,టీ, సిగిరెట్లు తాగేస్తుంటారు. ఇలా చేయడంకంటే ఉపవాసం ఉండకపోవడమే మేలంటున్నారు వైద్యులు. వీలైతే రోజూ తాగే కాఫీ, టీలు కూడా మానేయమని చెబుతుంటారు. దీని వల్ల కొందరికి తలనొప్పి వచ్చినా అది తాత్కాలికమే కాబట్టి ఓపికపట్టమని సూచిస్తున్నారు. - ఉపవాసం అంటే పూర్తిగా ఆహారాన్ని నిషేధించాలని ఏమీ లేదు. పాలు, పండ్లు వంటి అపక్వమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసాన్ని సాగించడం వల్ల కూడా ఎంతోకొంత ఫలితం ఉంటుంది. ఉపవాసాన్ని విరమించే సమయంలో కూడా ఒక్కసారిగా జీర్ణవ్యవస్థ మీద భారం కలగకుండా ఉండేందుకు ఇలాంటి తేలికపాటి ఆహారాన్నే తీసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. యాపిల్, కమల, అరటిపండు, పుచ్చకాయలు, ఖర్జూరాలు, పాలు, గ్రీన్టీ వంటి ఆహారం జీర్ణవ్యవస్థకి పెద్దగా పని కల్పించకుండానే శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంటాయి. - నిర్జర.
read moreమృత్యువుని దూరం చేసే బిల్వదళాలు
శివరాత్రి వచ్చిందంటే నీటితో అభిషేకం, బిల్వపత్రాలతో అర్చనా గుర్తుకువస్తాయి. శివుని ఎన్ని విధాలా పూజించినా, అందులో బిల్వ పత్రం లేనిదే మనసుకి లోటుగానే ఉంటుంది. మరి ఆ పరమేశ్వరునికే ప్రీతిపాత్రమైనదంటే... బిల్వ పత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండే ఉంటాయి కదా! వాటిలో కొన్ని... - బిల్వవృక్షంగా పిలుచుకునే మారేడు చెట్టు మన దేశంలోనే ఉద్భవించిందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ చెట్టు -7 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకూ ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకుని ఎంతటి నేలలో అయినా ఎదుగుతుంది. కాబట్టి ఊరూరా కనిపించే ఆ బిల్వదళాలు అటు అర్చనకే కాదు ఇటు ఆయుర్వేదంలోనూ విస్తృతంగా వినియోగించేవారు. - గాలి, వెలుతురు సరిగా సోకని గర్భగుడులలోని తేమకి రకరకాల సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. కానీ అక్కడ శివలింగం చెంతన ఉండే బిల్వదళాలు అక్కడి వాతావరణాన్ని మార్చేస్తాయి. మిగతా ఆకులతో పోలిస్తే బిల్వదళాలు రోజుల తరబడి తాజాగా ఉంటాయి. పైగా సూక్ష్మక్రిములను సంహరించే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు వీటి సొంతం. కాబట్టి గర్భగుడిని నిరంతరం పరిమళభరితంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో బిల్వానిది గొప్ప పాత్ర! - చక్కెర వ్యాధికి బిల్వం గొప్ప ఔషధం. బిల్వపత్రాల నుంచి తీసిన రసాన్ని కానీ, ఆ పత్రాలను ఎండించి చేసిన పొడిన కానీ తీసుకుంటే చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయట. వగరుగా ఉండే బిల్వ ఫలాలని తిన్నా కూడా చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. - జీర్ణ సంబంధమైన అనేక వ్యాధులకు మారేడు ఫలాలు, దళాలు ఉపయోగపడతాయి. మలబద్ధకం, అతిసారం, ఆకలి లేకపోవడం, పేగులలో పుండ్లు, ఎసిడిటీ వంటి సమస్తమైన సమస్యలలోనూ బిల్వం ప్రభావవంతంగా పనిచేస్తుంది. - బిల్వపత్రాలకి యాంటీఫంగల్ లక్షణం ఉంది. ఆ కారణంగా వీటి రసాన్ని శరీరానికి రాసుకుంటే ఎలాంటి దుర్వాసనా రాకుండా కాపాడతాయి. అంతేకాదు! గాయాలు త్వరగా మానాలన్నా, వాపులు తగ్గాలన్నా కూడా బిల్వపత్రాల నుంచి తీసిన రసాయనం పైపూతగా రాస్తే సరి! - మారేడు ఫలాల నుంచి తీసిన గుజ్జుతో చేసిన పానీయంతో శరీరం చల్లగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది. మనవైపు తక్కువ కానీ ఇలా మారేడు పండ్లతో పానీయాలు, షర్బత్లు చేసుకునే అలవాటు ఒడిషా, బెంగాల్ ప్రాంతాలలో ఇంటింటా కనిపిస్తుంది. - బిల్వ పత్రాలలో కనిపించే Aegeline అనే రసాయం చక్కెర నిల్వలను అదుపులో ఉంచడంలోనూ, రక్తపోటుని నియంత్రించడంలోనూ, కొవ్వుని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుందనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. మారేడు పూలు, పత్రాలు, బెరడు, వేళ్లు.... ఇలా మారేడు వృక్షంలోని అణువణువుకీ ఆరోగ్యాన్ని అందించే లక్షణం ఉంది. అందుకనేనేమో మారేడు వృక్షం సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపం అని చెబుతారు. మూడు ఆకులుగా ఉండే ఆ దళంలో ఆయన త్రినేత్రాలను దర్శిస్తారు. ఎలాంటి ఆరోగ్య సమస్యనయినా మారేడు దూరం చేయగలదు కాబట్టే దానికి ‘మృత్యు వంచనము’ అనే పర్యాయపదం కూడా ఉంది. కేవలం శైవారాధనలోనే కాకుండా వినాయకచవితినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో మారేడు కూడా చోటు చేసుకుంది. అంతదాకా ఎందుకు! మారేడు విశిష్టతను ఎరిగిన మన పెద్దలు బిల్వాష్టకం పేరుతో ఒక స్త్రోత్రాన్నే రూపొందించుకున్నారు. - నిర్జర.
read moreఅతిగా తినేవారి వల్లే ఆకలి చావులు
అవసరానికి మించి తినే ఆహారం వల్ల మన ఒక్కరి ఆరోగ్యం మాత్రమే పాడవుతుందని అనుకునేవారం. కానీ మన ఆహారపు అలవాట్లు ఏకంగా ప్రపంచంలోని ఆకలినే శాసిస్తున్నాయని ఓ సర్వే తేల్చి చెబుతోంది. అతిగా తినడం, ఆహారాన్ని వృధా చేయడం వంటి అలవాట్లతో ప్రపంచంలో దాదాపు 20 శాతం ఆహారం పనికిరాకుండా పోతోందని హెచ్చరిస్తోంది. అంతేనా మాంసాహారాన్ని ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనూ విలువైన పంటలు వృధా అవుతున్నాయని సర్వే సూచిస్తోంది. స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆహారానికి సంబంధించిన ఈ పరిశోధనకు పూనుకున్నారు. దీని కోసం వాళ్లు ఐక్యరాజ్య సమితి దగ్గర ఉన్న గణాంకాలన్నింటినీ సేకరించి విశ్లేషించారు. ఈ విశ్లేషణ తరువాత, తాము అనుకున్నదానికంటే ఎక్కువ ఆహారమే అనవసరంగా వృధా అవుతోందని గమనించారు. ఆహారం పండించే దశ నుంచి దానిని వినియోగించే దశ వరకూ జరుగుతున్న వృధాను గమనిస్తే మన కళ్లు కూడా చెదిరిపోక తప్పదు. ఆహారాన్ని పండించే దశలో జరిగే నష్టాన్ని నివారించడం కష్టం కావచ్చు. కానీ చేతికి అందిన ఆహారాన్ని కూడా మనం వృధా చేయడం దారుణం. ప్రపంచవ్యాప్తంగా పండుతున్న ఆహారంలో దాదాపు పదిశాతం ఆహారాన్ని వృధాగా నేలపాలు చేస్తున్నట్లు గమనించారు. కొందరు అతిగా తినడం వల్ల మరో పదిశాతం ఆహారం ఇతరులకు అందకుండా పోతోందట. సర్వేలో బయటపడిన మరో ఆశ్చర్యకరమైన అంశం – పశువుల పోషణ! పాల కోసమో, మాంసం కోసమో ఇబ్బడిముబ్బడిగా పశువులని పెంచడం వల్ల కూడా ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతోందట. ఎందుకంటే ఆ పశువులని పెంచేందుకు టన్నుల కొద్దీ పంటలను వాడాల్సి వస్తోంది. ఉత్పత్తి అవుతున్న ఆహారంలో దాదాపు 20 శాతం ఇలా పశుపోషణ కోసమే వినియోగిస్తున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదోవంతు మంది సరైన తిండి లేకుండా బతికేస్తున్నారు. ఇప్పటికీ రోజుకి 20 వేల మంది ప్రజలు తగిన ఆహారం అందక చనిపోతున్నారు. మనం వృధా చేస్తున్న ఆహారం వీరికి అందితే ఎంత బాగుంటుందో కదా! అందుకే తిండి మీద కాస్త ధ్యాసని తగ్గించి, ఒంటికి తగిన పోషకాహారం అందుతోందా లేదా అన్న విషయం మీదే దృష్టి పెట్టమంటున్నారు. అంతేకాదు! జంతుసంబంధమైన ఉత్పత్తుల మీద కాస్త ఆసక్తిని తగ్గించుకోమంటున్నారు. మరి ఈ మాట వినేదెవరో! - నిర్జర.
read moreలాలిపాటతో డిప్రెషన్ దూరం
నెలల వయసు పసికందుని చూసి తల్లి నిశబ్దంగా ఉండగలదా! ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఓదార్చేందుకు తన గొంతు విప్పకుండా ఉంటుందా! అందుకే ప్రపంచంలో ఏ పురాణాలూ, కావ్యాలూ పుట్టకముందే లాలిపాటలు పుట్టి ఉంటాయి. అలాంటి లాలా పాటలను ఏవో లల్లాయి పదాల్లాగా తీసిపారేయవద్దని సూచిస్తున్నారు పరిశోధకులు. లాలిపాటల గురించి పరిశోధనలు జరగడం కొత్తేమీ కాదు. లాలిపాటల వల్లే మాతృభాష పిల్లలకు అలవడుతుందనీ, తల్లీబిడ్డల మధ్య సంబంధం మెరుగుపడుతుందనీ ఇప్పటికే అనేక పరిశోధనలు నిరూపించాయి. మియామీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మరో అడుగు ముందుకు వేసి, లాలిపాటల వల్ల అటు తల్లి మీదా ఇటు బిడ్డ మీదా ఎలాంటి ప్రభావం ఉంటుందో గమనించే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ఓ 70 మంది పసిపిల్లలను ఎన్నుకొన్నారు. వీరికి ఆరురకాల శబ్దాలను వినిపించారు. వీటిలో తల్లి తన బిడ్డ కోసం పాడే పాట, ఎవరో ఆగంతకుడు పాడే పాట, మ్యూజిక్ సిస్టమ్ నుంచి వచ్చే సంగీతం, పుస్తకం చదివి వినిపించడం... వంటి శబ్దాలు ఉన్నాయి. వీటన్నింటిలోకీ తల్లి తన కోసం పాట పాడినప్పుడే, పిల్లవాడి మెదడు చురుగ్గా ప్రతిస్పందిస్తున్నట్లు గమనించారు. పిల్లవాడి మానసిక ఎదుగుదలకు లాలిపాటలు ఉపయోగపడుతున్నట్లు తేలింది. పిల్లల సంగతి అలా ఉంచితే మరి తల్లి పరిస్థితి ఏమిటి? దానికీ జవాబు కనుగొన్నారు పరిశోధకులు. పిల్లలు పుట్టిన తరువాత శరీరంలో ఏర్పడే మార్పుల వల్ల తల్లులలో డిప్రెషన్ తలెత్తే ప్రమాదం ఉంది. పిల్లల వంక చూస్తూ, వారి ప్రతిస్పందనలకి అనుగుణంగా స్వరంలో మార్పులు చేస్తూ.... లాలిపాటలు పాడటం వల్ల అలాంటి డిప్రెషన్ చిటికెలో తీరిపోతుందంటున్నారు. మరింకేం! స్వరం గురించి సంకోచం లేకుండా మీ గొంతుని చిన్నారి ముందు విప్పండి. - నిర్జర.
read moreఅంతరిక్షంలో శరీరం ఏమవుతుంది?
ఇస్రో పుణ్యమా అని ఇప్పుడంతా అంతరిక్షం గురించే మాట్లాడుతున్నారు. మరికొన్నాళ్లకి భారతీయులు అంతరిక్షంలోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదంటూ సంబరపడుతున్నారు. ఇంతకీ భూమ్యాకర్షణ శక్తిని దాటి అంతరిక్షంలోకి ప్రవేశించే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా... కండరాలు – ఎముకలు భూమి మీద ఉన్న ఆకర్షణశక్తిని (గ్రావిటీ) తట్టుకుంటూ నడవడం వల్ల మన కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. కానీ జీరో గ్రావిటీ వద్ద ఇలాంటి ఒత్తిడి ఏమీ ఉండదు. దాంతో ఎముకలు, కండరాలకి ఎలాంటి పనీ ఉండదు. ఫలితంగా ఎముకలు దృఢత్వం తగ్గుతుంది. కండరాలు కూడా మెత్తబడిపోతాయి. దీనికల్లా ఒకే ఉపాయం! స్పేష్ షటిల్లో వీలైనంత వ్యాయామం చేస్తూ ఉండాల్సిందే! కళ్లు శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుందన్న విషయం తెలిసిందే కదా! నేల మీద ఉన్నప్పుడు శరీరంలోని రసాయనాలన్నీ భూమ్యాకర్షణ శక్తి వల్ల కిందకి ప్రవహిస్తాయి. కానీ అంతరిక్షంలో అలా కాదు... ఒంట్లోని రసాయనాలన్నీ సమంగా వ్యాపిస్తాయి. ఫలితంగా కంటి చుట్టూ కూడా కొంత తడి చేరుతుంది. దీని వల్ల కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అంతేకాదు... అలా కంటి లోపల ఒత్తిడి ఏర్పడటం వల్ల ఒకోసారి కంటిచూపు కూడా మందగించే ప్రమాదం ఉంది. వెన్నెముక అంతరిక్షంలో ఉన్నప్పుడు మనిషి ఎత్తు ఓ మూడు శాతం పెరుగుతుంది. అంటే ఆరడుగుల ఎత్తున్న మనిషి ఏకంగా మరో రెండు అంగుళాలు పెరుగుతాడన్నమాట. వెన్నెముక మీద భారం తగ్గడం వల్ల, అందులోని డిస్కులు కాస్త వెడం కావడమే దీనికి కారణం. అయితే భూమి మీదకు వచ్చిన కొద్ది నెలలకే తిరిగి వెన్ను సాధారణ స్థితికి చేరుకుంటుంది. మానసిక స్థితి అసలే రోజుల తరబడి భూమికి దూరంగా ప్రయాణం... అక్కడ అంతరిక్షంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఉత్కంఠత. ఆపై రోజూ గంటల తరబడి అవే మొహాలు. అన్నింటికీ మించి సరిగా నిద్ర ఉండదు. బయట నుంచి మిరుమిట్లు గొలిపే కిరణాల ప్రభావంతోనూ, భూమ్యాకర్షణ లేక గాలిలోనే పడుకోవాల్సి రావడంతోనూ... కంటి మీద కునుకు ఉండని పరిస్థితి. ఇవన్నీ కూడా వ్యోమగాములకు ఓ సవాలుగా నిలుస్తాయి. రేడియేషన్ భూమి మీద మనుషులు హాయిగా మనుగడ సాగించడానికి కారణం... సూర్యుడో, నీరో కాదు – ఓజోను పొర. ఆ పొర మనల్ని అతినీలలోహిత (UV) కిరణాల నుంచి రక్షిస్తుంది. కానీ అంతరిక్షంలో ఇలాంటి రక్షణలేవీ ఉండవు. వ్యోమగాముల శరీరం మీద ఉండే దుస్తులే వారిని కాపాడాలి. అంతేకాదు! అంతరిక్షంలో ఉన్నప్పుడు కేవలం సూర్యుడి నుంచే కాకుండా విశ్వంలోని ప్రతి మూల నుంచీ కూడా రేడియేషన్ కిరణాలు వారి మీద దాడి చేస్తుంటాయి. అందుకనే వ్యోమగాముల దస్తులకు రేడియేషన్ తాకిడిని కొలిచే ఓ పరికరాన్ని ఉంచుతారు. వారు ఒక స్థాయికి మించిన రేడియేషన్కు లోనయ్యారని తెలిస్తే ఇక వారిని భవిష్యత్తులో అంతరిక్షంలో పంపరు. అదీ సంగతి! అంతరిక్షంలోకి తేలిపోవాలనుకునేవారి శరీరంలో ఇలాంటి మార్పులెన్నో కనిపిస్తాయి. అయినా మానవాళ కోసం, విజ్ఞానం అభివృద్ధి చెందడం కోసం ప్రమాదాలకు తెగించి వారు ప్రయోగాలకు సిద్ధపడుతూ ఉంటారు. - నిర్జర.
read moreHave Eggs and a Healthy Heart
Eggs , the staple breakfast food since time immemorial have always been a comeback but are a regular in any home and in any part of the world. It’s true that egg yolks have a lot of cholesterol—and so may weakly affect blood cholesterol levels—eggs also contain nutrients that may help lower the risk for heart disease, including protein, vitamins B12 and D, riboflavin, and folate. Research shows that for most people, cholesterol in food has a much smaller effect on blood levels of total cholesterol and harmful LDL cholesterol than does the mix of fats in the diet. Recent research has shown that moderate egg consumption—up to one a day—does not increase heart disease risk in healthy individuals and can be part of a healthy diet. Well that’s good news! People who have difficulty controlling their total and LDL cholesterol may want to be cautious about eating egg yolks and instead choose foods made with egg whites. The same is true for people with diabetes. In the Nurses’ Health Study and Health Professionals Follow-up Study, heart disease risk was increased among men and women with diabetes who ate one or more eggs a day. For people who have diabetes and heart disease, it is best to limit egg consumption to no more than three yolks per week. This research doesn’t give the green light to daily three-egg omelettes. While a 2008 report from the ongoing Physicians’ Health Study supports the idea that eating an egg a day is generally safe for the heart, it also suggests that going much beyond that could increase the risk for heart failure later in life. To your cardiovascular system, scrambled eggs, salad, and a whole wheat bread toast is a healthier option than having scrambled eggs with cheese, sausages, home fries, and white bread.The Key to health is eat in moderation. Source:Harvard School of Public Health
read moreతక్కువ తింటే వయసు తగ్గిపోతుంది
అసలే మనం తింటున్న ఆహారం, పీలుస్తున్న గాలి విషమయం. వీటికి తోడు నరాలు చిట్లిపోయేంత ఒత్తిడి. సహజంగానే ఈ ప్రభావమంతా శరీరం మీద పడుతుంది. నలభై ఏళ్లకే అరవై ఏళ్ల వచ్చేసినట్లుగా కనిపిస్తుంది. కాస్త డబ్బున్నవారు, ఆకర్షణీయంగా కనిపించాలన్న తపన ఉన్నవారు బొటాక్స్ ఇంజక్షన్లూ, యాంటీ ఏజింగ్ క్రీములూ వాడేస్తుంటారు. కానీ అంత కష్టపడనవసరం లేకుండానే యవ్వనాన్ని కాపాడుకునే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. అవే పోషకాలు – తక్కువ కేలొరీలు అమెరికాలోని Brigham Young Universityకి చెందిన పరిశోధకులు... ఆహారానికీ, వయసుకీ మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. దీనికోసం వారు ఎలుకల మీద ఓ ప్రయోగం చేశారు. వాటిలో కొన్నింటికి సాధారణంగానే ఆహారాన్ని అందిస్తూ, మరికొన్ని ఎలుకలకు మాత్రం తక్కువ కేలరీలను అందించే ఆహారాన్ని అందించారు. కేలరీలను అందించడంలో ఎక్కువ తక్కువలు ఉన్నా, పోషకాల విషయంలో మాత్రం ఎలాంటి తేడా లేకుండా చూసుకున్నారు. రైబోజోమ్స్ మన కణాలలో రైబోజోమ్స్ అనే విభాగం ఉంటుంది. కణాలకు అవసరమయ్యే ప్రొటీన్లను ఉత్పత్తి చేయడంలో వీటిది కీలక పాత్ర. తక్కువ ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ రైబోజోమ్స్ నిదానించాయట. ఇలా రైబోజోమ్స్ ఉత్పత్తి నిదానించినప్పటికీ, వాటి పనితీరు మెరుగుపడటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది.రైబోజోమ్స్ నిదానించడం వల్ల అవి వీలైనంత శక్తిని పుంజుకునే సమయం లభించడమే దీనికి కారణం అని తేల్చారు. రోగాలు దూరం కేలరీలు తక్కువ తీసుకోవడం వల్ల రైబోజోమ్స్ తీరులో మార్పు వచ్చిందని రుజువైపోయింది. దీని వలన ఎలుకల ఆరోగ్యంలో కూడా తేడా కనిపించింది. అవి ఎక్కువ చురుగ్గానూ, ఎలాంటి రోగాలు లేకుండానూ జీవించాయి. రైబోజోమ్స్లోని ఈ మార్పు శరీరం మొత్తం మీదా కనిపించింది. ‘రైబోజోమ్స్ అనేవి కారు టైర్లలాంటి. టైర్లు కారులో ఓ చిన్న భాగమే కదా అనుకోవడానికి లేదు. అవి లేకపోతే అసలు కారు పనితీరే మారిపోతుంది. అలాగే రైబోజోమ్స్ కూడా సమర్థవంతంగా పనిచేస్తే జీవితకాలం మెరుగుపడుతుంది,’ అంటున్నారు పరిశోధకులు. వయసుకి సంబంధించిన పరిశోధనల్లో ఇది చాలా కీలకమైన పరిశీలనగా భావిస్తున్నారు. మనం తినే ఆహారం శరీరం మీద ఎలా పనిచేస్తుంది? అది వయసు మీద ఎలా ప్రభావం చూపుతుంది? అని తెలుసుకునేలా మరిన్ని పరిశోధనలు చేసేందుకు దీనిని తొలిఅడుగుగా భావిస్తున్నారు. అప్పటివరకూ తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలూ ఉండే ఆహారాన్ని తీసుకోమంటూ సిఫారసు చేస్తున్నారు. - నిర్జర.
read moreప్రేమికుని అండ ఉంటే... డిప్రెషన్ తీరిపోతుంది
ప్రేమలో ప్రపంచమంతా అందంగానే కనిపిస్తుంది. కాని అన్నివేళలా జీవితం రంగులమయం కాదు కదా! ఊహించని కష్టాలుంటాయి. నిలదీసే సమస్యలు ఎదురవుతాయి. ఒకోసారి ఏం చేయాలో తోచని స్థితిలో నిస్సహాయంగా మిగిలిపోతాము. డిప్రెషన్లో కూరుకుపోతాము. ఇలాంటి సందర్భాలలో మనల్ని ప్రేమించినవారు అండగా నిలిస్తే.... డిప్రెషన్ కాస్తా ఎగిరిపోతుందంటున్నారు పరిశోధకులు. కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు డిప్రెషన్లో ఉన్న మనుషుల మీద వారి భాగస్వామి ప్రభావం గురించి అధ్యయనం చేశారు. డిప్రెషన్లో కూరుకున్న భాగస్వామికి అండగా నిలబడటం వల్ల, సమస్య చాలావరకు పరిష్కారం అయినట్లు తేలింది. డిప్రెషన్ వల్ల ఏర్పడే మానసిక సమస్యలు తీరడమే కాకుండా, ఆ సమయంలో లభించిన అండతో వారి మధ్య ఉండే బంధం కూడా దృఢపడినట్లు గమనించారు. ఈ పరిశోధనలో తేలిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అటు డిప్రెషన్తో బాధపడుతున్న వ్యక్తితో పాటుగా, వారికి అండగా నిలిచిన భాగస్వామి కూడా లాభపడ్డారట. వారిలో ఆత్మవిశ్వాసపు స్థాయి పెరగడాన్ని గమనించారు. అంతేకాదు... ఇలాంటి స్థితి గుండా దాటిన బంధంలోని వ్యక్తులలో, భవిష్యత్తులో కూడా డిప్రెషన్, ఆత్మన్యూనతకు సంబంధించిన సమస్యలు రాకపోవడాన్నీ గుర్తించారు. పరిశోధన అంతా సవ్యంగానే ఉంది. కాకపోతే ఇందులో ఓ చిక్కు ఉంది. మానసిక సమస్యలు ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు భాగస్వాముల తోడ్పాటు చాలా ఉపయోగపడుతుంది. నిజమే! కానీ పూర్తిస్థాయిలో డిప్రెషన్ వంటి సమస్యలలో కూరుకుపోయేవారికి అండగా నిలబడం కష్టం. ఇలాంటివారికి సలహా ఇచ్చేందుకు ప్రయత్నించినా, సాయం చేయబోయినా... సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. అలాంటి భాగస్వాములు కలిగినవారు మరింత నేర్పుగా వ్యవహరించాలంటున్నారు. వారికి మీరు అండగా ఉన్నామన్న విషయం తెలియచేయాలే కానీ, నేరుగా వారి చేయిపట్టుకుని నడిపించే ప్రయత్నం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఏదన్నా సాయం చేసినా కూడా వారి బరువుని పంచుకుంటున్నామన్న అనుమానం రానీయకుండా ప్రయత్నించమని సూచిస్తున్నారు. ఏదన్నా విహారయాత్రకు ప్లాన్ చేయడం, వారి రోజువారి పనులను కొంత భుజాన వేసుకోవడం... వంటి చర్యల ద్వారా పరోక్షంగా వారి మనసుని తేలికపరచమంటున్నారు. గాయపడిన మనసు సేదతీరాలన్నా, ఓడిపోతామనుకున్న జీవితంలో తిరిగి నిలదొక్కుకోవాలన్నా... మన భాగస్వామి అండ చాలా అవసరం అన్నమాట! - నిర్జర.
read moreప్రేమలో ఏం జరుగుతుంది (వాలెంటైన్స్ డే స్పెషల్)
ప్రేమ దోమ కుట్టనివారు ప్రపంచంలో అరుదుగా కనిపిస్తారు. అలా ప్రేమలో పడిన మనిషి వింతగా ప్రవర్తిస్తాడని అందరికీ తెలిసిందే! ఆకలి ఉండదు, దాహం వేయదు, నిద్ర పట్టదు... అసలేదీ పట్టదు. ఇంతకీ ఇవన్నీ మనం సరదాగా అవతలివారిని ఏడిపించేందుకు చెప్పే మాటలా లేకపోతే వీటి వెనక ఏదన్నా శాస్త్రీయమైన కారణం ఉందా... అంటే జవాబుగా బోలెడు పరిశోధనలు ముందుకు వస్తున్నాయి. ప్రేమలో మన ప్రతి ఒక్క చర్యకీ స్పష్టమైన కారణాలను అందిస్తున్నాయి. వయసులోకి అడుగుపెడుతూనే టీనేజిలోకి రాగానే మనసు ప్రేమ కోసం తపించిపోయేందుకు కారణం మనలోని హార్మోనులే. ఈ విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మగవారిలో టెస్టోస్టెరాన్, ఆడవారిలో ఈస్ట్రోజన్ వంటి హార్మోనులు ప్రేమలో పడమని తొందరపెడుతూ ఉంటాయి. ప్రేమ ఒక మైకం ప్రేమించిన మనిషి మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటుంది. దానికి కారణం డోపమైన్ అనే రసాయనమే! మన మెదడులో ఉత్తేజాన్ని రగిలించే ఆ డోపమైన్తో సిగిరెట్లు, మందు, కొకైన్ తీసుకుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో... ప్రేమలో ఉన్నప్పుడు అంతే తృప్తిగా ఉంటుంది. లవ్ లవ్ లబ్ డబ్ ప్రేమించిన మనిషిని చూడగానే గుండె ఎందుకలా డబడబా కొట్టుకుంటుందో తెలుసా! మన నరాల మీద పనిచేసే అడ్రినలిన్, నోర్ఫినెఫ్రైన్ అనే రసాయనాల ఉత్పత్తి ఎక్కువ కావడం వల్లే. వీటి వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, చెప్పలేని ఉద్వేగం, ఏమీ తోచకపోవడం వంటి లక్షణాలన్నీ తలెత్తుతాయి. ఒకటే ధ్యాస ప్రేమలో ఉన్న మనిషికి తను ప్రేమించే వ్యక్తి తప్ప మరో మనిషి గురించి ధ్యాసే ఉండదు. దానికీ సెరిటోనిన్ అనే రసాయనమే కారణం. ఈ సెరటోనిన్ అటు జ్ఞాపకశక్తినీ, ఇటు జీర్ణాశయాన్నీ కూడా ప్రభావితం చేస్తుందట. అలాంటి సెరటోనిన్ స్థాయి తగ్గిపోవడంతో మతిమరపుతో ఉండటం, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంత నమ్మకం ప్రేమించే మనిషి మనని దూకమంటే దూకుతాం, నరకమంటే నరుకుతాం. అంతటి నమ్మకానికి కూడా కారణం ఉందట. వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ అనే రసాయనాల వల్ల మనం సురక్షితంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అలాంటి సురక్షితమైన భావన కలగడం వల్లే ప్రేమలో అవతలివారిని నమ్ముతాము. వారితో సుదీర్ఘకాలం బంధాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధపడతాము. ప్రేమ గుడ్డిది చివరగా ప్రేమ గుడ్డిది అన్న మాటలో కూడా నిజం లేకపోలేదంటున్నారు. పైన పేర్కొన్న కారణాలన్నింటినీ చూస్తే, ఆ విషయాన్ని ప్రత్యేకంగా రుజువు చేయనవసరం లేదేమో! ప్రేమలో పడ్డవారు ఎంత చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారో, చుట్టూ చూసేవారికి అర్థమవుతూ ఉంటుంది కానీ... ప్రేమికులు మాత్రం తమ లోకంలో తాము విహరిస్తూ ఉంటారు. మెదడులో సుఖాన్ని ప్రేరేపించే కేంద్రానికి రక్తసరఫరా ఎక్కువగా జరుగుతూ ఉండటంతో, ప్రపంచం తలకిందులైపోయినా సరే... తాము మాత్రం తమ బంధంలో హాయిగా ఉండిపోతారు ప్రేమికులు. - నిర్జర.
read moreబియ్యం ఇలా వండకపోతే విషమే!
కంటి ముందు ఎన్ని పదార్థాలున్నా కానీ... బియ్యం లేకపోతే ఏదో లోటుగానే తోస్తుంది. బియ్యంతో మన బతుకులది ఓ శాశ్వతమైన బంధం. కానీ ఆ బియ్యం ఎంతవరకు సురక్షితం అంటే మాత్రం... ఆలోచించక తప్పదు! మనం తినే బియ్యంలో ఆర్సెనిక్ అనే విషం ఉందంటూ ఓ ఇంగ్లండు శాస్త్రవేత్త చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఏమిటీ ఆర్సెనిక్ ఆర్సెనిక్ అనే రసాయనం చాలా ఖనిజాలలో కనిపిస్తుంది. పరిశ్రమల్లో అయితే దీని ఉపయోగం అపారం. బ్యాటరీల దగ్గర నుంచి మందుగుండు వరకూ ఆర్సెనిక్ను అడుగడుగునా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక పురుగు మందులలోనూ, క్రిమిసంహారకాల్లోనూ ఆర్సెనిక్ది కీలకమైన పాత్ర. అలా ఈ ఆర్సెనిక్.... నీటి ద్వారా, మందుల ద్వారా మనం తినే పంటల్లోకి చొచ్చుకుపోతోందని, పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. పదేపదే ఆర్సెనిక్తో నిండిపోయిన నేల మీద పంటలను పండించడం వల్ల ఈ ప్రమాదం ఎప్పటికప్పుడు పెరిగిపోతోందని తలలు బాదుకుంటున్నారు. ఏమిటీ ప్రమాదం మోతాదు దాటిన ఆర్సెనిక్ మన శరీరంలోకి చేరితే అది రకరకాల సమస్యలకు దారితీస్తుంది. వాంతులు, రక్తవిరేచనాలు, కడుపునొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక దీర్ఘకాలికంగా కనుక అది శరీరంలో తిష్ట వేసుకుంటే డయాబెటిస్, గుండెజబ్బులు, కేన్సర్ వంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. చర్మం రంగు మారిపోతుంది, నరాల బలహీనత ఏర్పడుతుంది. ముఖ్యంగా పసిపిల్లల్లో ఈ ఆర్సెనిక్ అతి తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఉపాయం ఏమిటీ ఇంగ్లండులోని Queens University Belfastకు చెందిన Andy Meharg అనే శాస్త్రవేత్త బియ్యంలో ఉండే ఈ ఆర్సెనిక్ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందేమో అని పరిశీలించారు. ఆయన పరిశీలనలో ఓ రెండు పద్ధతులు కాస్త ప్రభావవంతంగా కనిపించాయి. ఒక గ్లాసుడు బియ్యాన్ని అయిదు గ్లాసుల నీటిలో ఉడికిస్తూ మిగిలిన నీటిని కనుక పారబోస్తే... దాదాపు 50 శాతం ఆర్సెనిక్ కొట్టుకుపోతుందని తేలింది. ఇక బియ్యాన్ని ఓ రాత్రంతా నానబెట్టి, ఆ నీటిని పారబోస్తే కనుక కనీసం 80 శాతం ఆర్సెనిక్ తగ్గిపోతుందని కనిపెట్టారు. అలా కాకుండా బియ్యాన్ని యథాతథంగా కనుక వండేస్తే అందులో ఉండే ఆర్సెనిక్ నేరుగా మన శరీరంలోకి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.
read moreఇంట్లోనే ఉంటే కంటి సమస్యలు
ఇప్పటి పిల్లల తీరు మారిపోతోంది. తల్లిదండ్రులకు సమయం లేకనో, ఆడుకునేందుకు స్థలమే లేకనో... పిల్లలు ఇప్పుడు నాలుగు గోడల మధ్యే గడిపేస్తున్నారు. అయితే బడి లేకపోతే ఇల్లు- ఈ రెండింటిలోనే వారి బాల్యం దాటిపోతోంది. కానీ ఈ పరిస్థితి వారికేమంత మేలు చేకూర్చదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అదేపనిగా ఇంట్లో ఉండే పిల్లలు హస్వదృష్టి (myopia) సమస్యలని ఎదుర్కొంటారని చెబుతున్నారు. అదెలాగంటే.... ప్రత్యేకమైన వ్యవస్థ కంటి ముందర ఉన్న దృశ్యాన్ని రెటీనా మీద నిలపడానికి కంట్లో ఒక ప్రత్యేక కణం పనిచేస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో అనుమానిస్తున్నారు. అయితే అది ఏ కణం అన్నది నిర్దిష్టంగా కనిపెట్టలేకపోయేవారు. అమెరికాకు చెందిన పరిశోధకులు ఇప్పుడు ఆ కణం ఏమిటన్నది కనిపెట్టేశారు. ఎలుకల కళ్ల మీద రకరకాల కాంతులను ప్రసరిస్తూ, వాటి రెటీనాలలోని కణాల పనితీరుని పసిగట్టారు. సదరు కణానికి ‘ON Delayed’ అని పేరు పెట్టారు. ఎదుగుదలకు సైతం ‘ON Delayed’ కణజాలం కేవలం దృశ్యాన్ని సరఫరా చేయడంలోనే కాదు... కంటి ఎదుగుదలలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని తేలింది. ఒక వయసు వచ్చేనాటికి మన కళ్లు సంపూర్ణంగా ఎదిగేందుకు ఈ కణాలు తోడ్పడతాయి. అయితే ఇక్కడే అసలు సమస్య కనిపించింది. ఇళ్లలో కృత్రిమంగా ఉండే వెలుతురు కళ్ల మీద చూపే ప్రభావం విభిన్నంగా ఉంటుంది. కాంతిలోని సప్తవర్ణాలు ఉంటాయని తెలిసిందే కదా! కృత్రిమ కాంతిలో వీటిలోని ఎరుపు, ఆకుపచ్చ రంగుల గాఢత మరింత ఎక్కువగా ఉంటుందట. దాంతో ON Delayed కణజాలం పనితీరు మీద ప్రభావం పడుతోంది. అది కంటి ఎదుగుదలను ఎప్పుడు నిలిపివేయాలో కనిపెట్టలేకపోతోంది. ఫలితం! కన్ను అవసరమైన పరిమాణాన్ని మించి ఎదిగిపోతుంది. హస్వదృష్టి ఏర్పడుతుంది. ఇదీ ఉపయోగం మన శరీరంలో కన్ను ఒక సున్నితమైన, సంక్లిష్టమైన అవయవం. ఇందులో కనీసం 50 రకాల కణాలు కలిసి పనిచేస్తేనే ఒక దృశ్యం మన మెదడుని చేరుతుందని అంచనా! వాటిలో ఏఏ కణాలు ఏఏ పనులు చేస్తాయో కనుక తెలుసుకోగలిగితే... తత్సంబంధమైన కంటి సమస్యలను నివారించవచ్చని ఆశిస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు హస్వదృష్టికి కారణం ON Delayed కణజాలం అని తేలిపోయింది కదా! దీంతో మున్ముందు చిన్నపాటి జన్యు చికిత్సను చేసి హస్వదృష్టి ఉన్నవారి కంటిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు. ఇంతేకాదు కణాల పనితీరులో లోపం వల్ల ఏర్పడే అంధత్వం వంటి తీవ్రమైన సమస్యలను సైతం సరిదిద్దవచ్చు. భవిష్యత్తు సంగతేమో కానీ.... ప్రస్తుతానికి మాత్రం ఈ పరిశోధన వల్ల ఓ ముఖ్యమైన విషయం తెలిసింది. పిల్లలను కోడిపిల్లల్లాగా అక్కడక్కడే ఉంచకుండా వారికి కాస్త గాలి, వెలుతురు తగిలేలా తిరగనివ్వాలని ఈ పరిశోధన సూచిస్తోంది. - నిర్జర.
read moreఫుట్బాల్ని తలతో కొడితే...
ఫుట్బాల్ ఏమంత ఆషామాషీ ఆట కాదు. చూడటానికి బాగానే ఉంటుంది కానీ, బరిలోకి దిగితే ఒళ్లు హూనమైపోతుంది. ఇక ఆటలో నిమగ్నమైపోయి ఏమాత్రం అశ్రద్ధ చూపినా... తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకనే ఎప్పటికప్పుడు ఆట ఆడే విషయంలో జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. అందులో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇదిగో... తలతో ఢీకొట్టవద్దు – కొంతమంది ఫుట్బాల్ ఆటగాళ్లు తలతో బంతిని ఢీకొంటూ ఉంటారు. సరదా కోసమో, ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసమో, అలవాటులో భాగంగానో... తరచూ తలతోనే బంతిని అడ్డుకుంటూ ఉంటారు. కానీ ఇదేమంత క్షేమం కాదంటున్నారు పరిశోధకులు. ఇలా ఢీకొనడం వల్ల ఏకంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫుట్బాల్కు తలని తాకించడం వల్ల ఏమన్నా ప్రమాదం ఉందేమో గమనించేందుకు పరిశోధకులు కొన్ని వివరాలను సేకరించారు. ఇందుకోసం తరచూ ఫుట్బాల్ ఆడే ఓ 222 మంది ఆటగాళ్లను ఎన్నుకొన్నారు. ఈ ఆటగాళ్లకి అనేక ప్రశ్నలు సంధించారు. మీరు ఆట ఆడే సమయంలో ఎన్ని సార్లు బంతితో తలని ఢీకొన్నారు? అలా ఢీకొంటున్న తరువాత ఏమన్నా ఆరోగ్య సమస్యలను గమనించారా? వంటి ప్రశ్నలకు జవాబులను సేకరించారు. ఆరునెలల కాలంలో రెండు దఫాలుగా ఈ వివరాలను సేకరించారు. ఫుట్బాల్ని తలతో ఎక్కువసార్లు తాకించినవారు అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు తేలింది. కొందరైతే రోజుకి దాదాపు పదిసార్లు ఫుట్బాల్ని తాకించే అలవాటుతో కనిపించారు. ఇలాంటివారిలో దాదాపు మూడురెట్లు అధికంగా మెదడుకి సంబంధించిన సమస్యలు బయటపడ్డాయి. నొప్పి, కళ్లు తిరగడం, దృష్టిని నిలపలేకపోవడం వంటి ఇబ్బందులే కాదు ఒకోసారి స్పృహ కోల్పోయిన సందర్భాలూ కనిపించాయి. ఇక అనుకోకుండా ఇద్దరి ఆటగాళ్ల తలలు ఢీకొంటే పరిస్థితులు మరింత విషమంగా కనిపించాయి. ఇలాంటివారు దాదాపు ఆరురెట్లు అధికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు తతేలింది. కాబట్టి ఫుట్బాల్ని కాలితో ఆడండి... ఆరోగ్యం బాగుంటుంది. తలతో ఆడారా మతి చెడుతుంది! - నిర్జర.
read moreకోటు ఉతుక్కోండి డాక్టరుగారూ!
ఆసుపత్రులలో రకరకాల క్రిములు స్వైరవిహారం చేస్తూ ఉంటాయి. పైగా ఇవి మొండిబారిపోయి ఉంటాయి. వీటిలో కొన్ని సూక్ష్మక్రిములు దాడి చేస్తే... ఎలాంటి మందులూ పనిచేయవు. ఇలాంటి మొండి బ్యాక్టీరియాను ‘సూపర్బగ్’ అని పిలుస్తారు. అందుకనే మన పెద్దలు ఆసుపత్రికి వెళ్లి వచ్చిన వెంటనే స్నానం చేయమని చెబుతూ ఉంటారు. కానీ అసలు వైద్యుడి ఒంటి మీద ఉన్న తెల్లకోట్లే అనేక రోగాలను వ్యాపింపచేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఐసీయూ వంటి క్లిష్టపరిస్థితులలో ఉన్న రోగుల పాలిట ఇవి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందన్న భయం బలపడుతోంది. నిబంధన లేకపోయినా నిజానికి వైద్యుడనేవాడు తప్పకుండా తెల్లకోటు ధరించాలన్న నిబంధన ఏమీ లేదు. కానీ ఓ వందేళ్ల నుంచీ ఇలా తెల్లకోట్లని ధరించే అలవాటు పెరిగిపోయింది. వైద్య విశ్వవిద్యాలయాలూ, కార్పొరేట్ ఆసుపత్రులూ వచ్చిన తరువాత తెల్లకోటు ధరించడాన్ని ఒక హుందాతనంగా భావించడం మొదలుపెట్టారు. కానీ వీటి శుభ్రత ఏ స్థాయిలో ఉంటోందన్నదే ఇప్పుడు చర్చ. పైగా అరకొర సౌకర్యాలు ఉండే మన దేశంలోని ఆసుపత్రులలో, ఈ కోట్లను ఎక్కడపడితే అక్కడ విడుస్తూ ఉంటారు. కుర్చీలకి తగిలించడమో, బల్లల మీద పడేయడమో, రోగుల మంచాల పక్కన పెట్టడమే చేస్తుంటారు. ఇక కుర్ర డాక్టర్లయితే ఈ తెల్లకోట్లు తీసుకునే షాపింగులకీ, సినిమాలకీ వెళ్లి వస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శుభ్రత శూన్యం తెల్ల కోట్లు వేసుకోవడం, వేసుకోకపోవడం అన్నది సమస్యే కాదు! వాటిని ఉతక్కపోవడమే అసలు ఇబ్బంది. అమెరికాలో ప్రసిద్ధ విర్జీనియా ఆసుపత్రిలో దీనికి సంబంధించి ఓ సర్వేను నిర్వహించారు. అందులో తేలిందేమిటంటే... కేవలం ఒక్కశాతం వైద్యులు మాత్రమే రోజూ తమ కోటుని ఉతికిస్తారట. ఇక 39 శాతం మంది వారానికి ఓసారి, 40 శాతం మంది నెలకి ఓసారి మాత్రమే తమ కోట్లను శుభ్రం చేయిస్తున్నారు. 17 శాతం మంది సిబ్బంది ఇంతవరకు అసలు తమ కోటుని ఉతకనే లేదని తేలింది!!! వాదోపవాదాలు 2015లో బెంగళూరులో జరిగిన ఓ పరిశోధనలో, వైద్యులు తొడుక్కుంటున్న కోట్ల పరిస్థితి ఏమీ బాగోలేదనీ... వాటిని నిషేదించి తీరాలని తీర్మానించారు. ఇలాంటి తీర్మానాలు చాలానే జరిగాయి కానీ, ఆ దిశగా ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోలేకపోయింది. 2007లో ఇంగ్లాండులోనూ, 2009లో అమెరికాలోనూ ఇలాంటి ప్రస్తావనలు ముందుకు వచ్చినా లాభం లేకపోయింది. మరోవైపు వైద్యులకు తెల్లకోటు ఉండితీరాలన్న వాదన కూడా గట్టిగానే ఉంది. వైద్యుల హుందాతనానికి తెల్లకోటు చిహ్నమని కొందరి నమ్మకం. ఆ తెల్లకోటుని చూసినప్పుడు రోగులలో కాస్త విశ్వాసం కలుగుతోందనీ, తమ సమస్యను కూలంకషంగా చర్చించేందుకు ఆ నమ్మకమే దోహదపడుతోందనీ మరికొన్ని పరిశోధనలు నిరూపించాయి. అదీ విషయం! తెల్లకోటు మీద ఇన్ని చర్చోపచర్చలు జరుగుతున్నాయి కాబట్టి.... మధ్యేమార్గంగా ఓ ఉపాయాన్ని సూచిస్తున్నారు. మోచేతుల వరకు మాత్రమే ఉండే తెల్లకోటుని ధరించడం వల్ల, సమస్య తీవ్రత తగ్గిపోతుందని సూచిస్తున్నారు. బ్రిటన్ వంటి దేశాలలో ఈ నిబంధన ఇప్పటికే అమలులోకి వచ్చేసింది. అన్నింటికీ మించి తమ కోటుని తరచూ శుభ్రం చేసుకోమని వైద్య సంస్థలన్నీ తమ సభ్యులకు సూచిస్తున్నాయి. - నిర్జర.
read moreతల్లి పాలతో కొలెస్ట్రాల్ సమస్యకి చెక్
మీ పిల్లలు భవిష్యత్తులో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడకూడదంటే వారు పుట్టినప్పటి నుంచి రెండేళ్ళ వరకు చక్కగా తల్లిపాలు ఇవ్వండి అంటున్నారు లండన్ లోని సెయింట్ జార్జి మెడికల్ స్కూల్ పరిశోధకులు . తల్లిపాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి . తల్లిపాలలోని సుగుణాలు ఎన్నో బైటకి వస్తూనే వున్నాయి అయితే ఓ పరిశోధనలో చిన్నప్పుడు తల్లిపాలు తాగిన పిల్లలు తర్వాత తర్వాత కొలస్ట్రాలా బారిన పడరాని గుర్తించారు పరిశోధకులు. ఈ పరిశోధనలో భాగంగా టీనేజ్ లో వున్న1500 మందిని పరిశీలించారు. తర్వాత వారిలో ఎంతమంది తల్లిపాలు తాగి పెరిగారు , ఎంతమంది చిన్నతనంలో పోతపాలు మీద ఆధారపడ్డారన్నది వారి తల్లితండ్రులను ప్రశ్నించి తెలుసుకున్నారు . ఆ తర్వాత శిశువుల జీవనసరళినీ, వివిధ వయసుల్లో వారి కొలస్ట్రాల్ స్థాయిలు ఎలా వున్నాయన్నది అధ్యయనం చేసారు. లండన్ లోని సెయింట్ జార్జి మెడికల్ స్కూల్ పరిశోధకుల అధ్యయన ఫలితాలు చాలా ఆసక్తిగాకరంగా వుంటాయి. చిన్నతనంలో తల్లిపాలు తాగిన పిల్లలు పెరిగి పెద్దయ్యాక కొలెస్ట్రాల్ నిల్వలు తక్కువగా ఉండడం వల్ల వీరికి భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం 10 శాతంగా తగ్గుతుందని గుర్తించారు సో ఎలా చూసిన తల్లి పాలు శ్రేష్టం. అవి పిల్లల మేధస్సుకు, ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి.... ....రమ
read moreచిరుతిళ్లే కాదు - వాటి కవర్లూ ప్రమాదమే
ఒకప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కుని కడుపునిండా తినేవారం. కాలం మారిపోయింది. రోడ్డు మీద అలా నడుస్తూ నడుస్తూ... మధ్యలో ఒక శాండ్విచ్ కొనుక్కొని దానిని సుతారంగా పేపర్లోనే ఉంచి తినడం అలవాటైపోయింది. ఇలా చిరుతిళ్లకు చుట్టి ఉంచే పేపర్లు, డబ్బాల వల్ల నానారకాల రోగాలూ వస్తాయని ఓ పరిశోధన హెచ్చరిస్తోంది. అమెరికా నడిబొడ్డున ఈ పరిశీలిన ఏదో మన దగ్గర జరిగింది కాదు. అమెరికాలో ఏకంగా 400 నమూనాలను పరిశోధించిన తేల్చిన విషయం. అవి కూడా ఆషామాషీగా రోడ్డు పక్కన కనిపించే బేకరీలలోని నమూనాలు కావు. మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి 27 ప్రముఖ దుకాణాల నుంచి సేకరించారు. దేశంలోనే ప్రముఖ నగరాలైన వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలలో ఈ సేకరణ సాగింది. PFAS శాండ్విచ్లను చుట్టి ఉంచే పేపర్లు, పేస్ట్రీల డబ్బాలు, చిప్స్ వేసి ఇచ్చే కవర్లు... ఇలా అన్నిరకాల ఆహారపదార్థాలతో పాటుగా వచ్చే సరంజామాలో polyfluoroalkyl substances (PFASs) అనే విష రసాయనాలు కనిపించాయి. పేపర్లు, కవర్లు మరకలు అంటకుండా తళతళలాడుతూ ఉండేందుకు, ఈ తరహా రసాయనాలను చేరుస్తున్నట్లు కనుగొన్నారు. నాన్స్టిక్ వంటపాత్రలలోనూ, మరకలు అంటని వస్తువుల తయారీలోనూ ఈ రసాయనాలను వాడుతూ ఉంటారు. శాండ్విచ్లను చుట్టి ఉంచే 40 శాతం పేపర్లలో ఈ PFASల ఆనవాళ్లు కనిపించాయి, ఇక బ్రెడ్ను అందించే 60 శాతం కవర్లలో PFASలు దర్శనమిచ్చాయి. మిగతా పదార్థాలతో పాటుగా వచ్చే సరంజామాలోనూ అంతోఇంతో ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఏంటట! ఈ PFASల ఉనికి వల్ల ప్రమాదం ఏముంటుందిలే అనుకోవడానికి లేదు. ఎందుకంటే చిరుతిండితో పాటుగా ఇవి శరీరంలోకి చేరతాయనీ, ఆ తర్వాత అవి ఒంట్లో పేరుకుపోతాయనీ తేలింది. అలా పేరుకుపోయిన PFASలు మన రక్తంలో కలిసిపోయి నానారకాల రోగాలకు దారితీస్తాయని అంటున్నారు. PFASలు కాలేయం, థైరాయిడ్ వంటి అనేక అవయవాలను దెబ్బతీయడంతో పాటుగా క్యాన్స్ర్కు సైతం దారితీస్తాయని ఈపాటిలే అనేక పరిశోధనలు రుజువు చేశాయి. వదల బొమ్మాలీ వదల ఈ PFASలు ఒక్కసారి కనుక శరీరంలోకి చేరితే, అవి ఓ పట్టాన వదిలి పోవట! శరీరంలో పేరుకున్న ఓ 50 శాతం PFASలు వదలడానికి కూడా ఏళ్ల తరబడి పడుతుందట. అంతేకాదు! ఇవి పర్యావరణంలో కూడా అంతగా కలవవని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే తాము ఆహారపదార్థాలను అందిస్తున్న పేపర్ల వెనుక ఇంత విషం దాగుందని సదరు దుకాణాలకు కూడా తెలియవట. కాబట్టి ఈ విషయమై ప్రభుత్వాలే చొరవ చూపాలనీ, వినియోగదారులు జాగ్రత్త వహించాలనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. - నిర్జర.
read moreపార్టీలో బెలూన్ పేలితే... చెవుడే!
ఓ ఇరవై ఏళ్ల క్రితం పిల్లల సంగతి వేరు. వారి పుట్టినరోజులు చాలా సాదాసీదాగా సాగిపోయేవి. ఇంట్లో పిండివంటలు చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, బడిలో చాక్లెట్లు పంచిపెట్టడంతోనే అవి ముగిసిపోయేవి. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. పుట్టినరోజు వచ్చిందంటే పార్టీ తప్పనిసరి. ఆ పార్టీకి వన్నె తెచ్చేందుకు రంగురంగుల బెలూన్లూ సరేసరి! కానీ ఆ బెలూన్లతో జర జాగ్రత్తగా లేకపోతే చెవుడు తప్పదంటున్నారు. కెనడాకు చెందిన కొంతమంది పరిశోధకులు పార్టీలో వాడే బెలూన్లు పేలినప్పుడు ఎంత చప్పుడు వస్తుందో చూడాలనుకున్నారు. ఇందుకోసం వారు అత్యాధునికమైన మైక్రోఫోన్లను ఉపయోగించి బెలూన్లు పేలిన చప్పుడుని రికార్డు చేశారు. ఊదుతూ ఉండగా బెలూను పేలినప్పుడు ఎంత చప్పుడు వస్తుంది, దానిని సూదితో పొడిచినప్పుడు ఎన్ని డెసిబుల్స్ ఉత్పత్తి అవుతాయి, బెలూను పేలేదాకా నొక్కినప్పుడు ఎంత శబ్దం వస్తుంది అంటూ లెక్కలు వేశారు. బెలూను పేలేదాకా ఊదుతూ ఉంటే కనుక వచ్చే చప్పుడు అంతా ఇంతా కాదని తేలింది. ఆ సమయంలో ఏకంగా 168 డెసిబిల్స్ చప్పుడు నమోదు అయ్యిందట. వివిధ శబ్దాల తీవ్రతను మనం డెసిబుల్స్లో కొలుస్తామన్న విషయం తెలిసిందే కదా! ఈ డెసిబుల్స్ స్థాయి కనుక 140 పాయింట్లను దాటితే వినికిడి సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. అలాంటిది ఏకంగా 168 డెసిబుల్స్ శబ్దాన్ని అకస్మాత్తుగా వినడం అంటే.... కోరి కోరి చెవుడుని తెచ్చుకున్నట్లే! చెవి పక్కన ఒక తుపాకీ పేలినప్పుడు వచ్చే శబ్దం కంటే (165 డెసిబుల్స్) ఈ శబ్దం ఎక్కువ కావడం గమనార్హం. బెలూన్ని సూదితో పేల్చినా, కేవలం ఒత్తిడి వల్ల అది పేలినా కూడా తీవ్రమైన శబ్దాలు ఉత్పన్నం అవుతున్నట్లు గమనించారు. ఒక్కసెకనుపాటు బెలూను పేలుడు శబ్దాన్ని విన్నా కూడా శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తే అవకాశం ఉంది. సదరు శబ్దానికి మన చెవి అంతర్భాగాలలో ఉండే కేశాలు దెబ్బతినడం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి పార్టీలో ఆకతాయితనానికి పోయి బెలూన్లను పగలకొట్టడం మానుకోవాలి. ఇంట్లో పార్టీ చేసుకునే ముందు కూడా ఈ విషయమై పిల్లలకు స్పష్టమైన హెచ్చరికను అందించాలి. బెలూన్లను ఊదేటప్పుడు కూడా ఓ స్థాయికి మించి ప్రయత్నించకూడదు, లేదా చెవిలో దూది పెట్టుకునన్నా ఊదాలి. కాదూ కూడదూ అనుకుంటే!!! - నిర్జర.
read more













.jpg)



.jpg)



.jpg)