"శాస్త్రాలలో లేనిదేమీ ఇవాళ క్రొత్తగా రాసుకోవాల్సింది లేదు. మనుషులు స్వార్ధంతో తమ కనుగుణమైన రూపాల్ని ఇచ్చారు వాటికి. ఆచరణ లోపం తప్పితే శాస్త్రాలలో లోపంలేదు. ఏ శాస్త్రమైనా విప్పిచూడు, స్త్రీకి శీలం ఎంత ముఖ్యమో, పురుషుడికీ అంతేనని చెబుతాయి." అంది ప్రేమీ.
ఈ సంభాషణ విసుగు కలిగినట్టుగా లేచాడు అజయ్. "నువ్వొస్తావా?"
"వస్తాను. కాస్సేపు కూర్చో."
19
సువర్చల ఇంటిహాలులో మహిళా సమావేశంలా కూర్చొని ఉన్నారు స్టేట్ హాం అసిస్టెంట్ డైరెక్టర్ పద్మినీదేవి, మహిళా మండలి సెకరెట్రీ భ్రమర, ఈ మధ్యే పైకివస్తూన్న రచయిత్రి శ్రీమంత దాదాపు ఓ ఎనిమిదిమందిదాకా ఉన్నారు.
స్టేట్ హాంలో జరుగబోయే వార్షికోత్సవం సందర్భంగా సువర్చలను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడానికి వచ్చింది పద్మినీదేవి.
"దేశ సేవకైనా ప్రజాసేవకైనా మనిషికి నిజాయితీ కావాలండీ! నిజాయితీ లేకపోయాక ఏ సేవ అయినా ఉత్త ఆడంబరమే అవుతుంది. ఇదివరకులా నేను ఏ విషయంలోనూ పెద్దరికం వహించలేనేమో! నా కొడుకే నా నడుం విరగ్గొట్టాడు. ఇంట గెలువలేని దాన్ని బయట ఏం గెలుస్తాను? నా ఇంటినే చక్కదిద్దుకోలేని దాన్ని బయట ఏం చక్కదిద్దుతాను? ఇప్పుడు నేను స్త్రీ సంక్షేమం గురించి మాట్లాడితే అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? ఏం చెప్పినా ఉత్తనీతులుగా, హరిదాసు ఉపదేశంలా అవుతుంది" సువర్చల ఆవేదనగా అంది.
"మీలో ఏ లోపమూ లేదు! మీరు చేయగలిగింది చేశారు. మీ అజయ్ ఎన్నాళ్ళు హోటల్ తిండి తింటూ బయట ఉంటాడు? అతడు ఈ రోజు కాకపోయినా రేపైనా లొంగిరాక తప్పదు." అంది భ్రమర. "ఆ అమ్మాయి కాలేజీ ఎందుకు మానేసింది?"
"మానక్కరలేదని చెప్పాను. తప్పు చేశానని క్రుంగిపోనక్కరలేదని ఎంత నూరిపోసినా ఆ మనిషికి ధైర్యం రావడం లేదు. తన గదివదిలి బయటికి రాదు. తనకు జరిగిన అన్యాయానికి ఎదిరించే శక్తి లేకపోతే మగవాడి దౌర్జన్యం ఇలాగే సాగుతూ ఉంటుంది కదా? తన సహకారం లేకపోతే నేనొక్కదాన్ని ఎంతని పోరాడగలను?" మ్లానంగా అంది సువర్చల. "పాపా! మీనాక్షిని పిలుస్తున్నానని తీసుకురా!"
ప్రేమీ తిరిగి వచ్చి, "తలనొప్పిగా ఉందట. రాదట. ఆంటీ!" అని చెప్పింది.
"ఇదీ వరుస. నలుగుట్లోకి రావాలంటే భయపడుతుంది. ఇంట్లో కొత్తవాళ్ళు ఎవరూ లేకపోయినా ఆ గదివిడిచి ఇవతలికి రాదు."
"కొత్త మలుపు నవల చదివారా? కొంచెం ఎబ్బెట్టుగా, అసహజంగా అనిపించినా ఆడపిల్లకి ఆ మాత్రం తెగింపు అవసరమనిపిస్తుంది. తనను గర్భవతిని చేసిన బాయ్ ఫ్రెండును కోర్టుకు లాగి, తనను గర్భవతిని చేసింది అతడేనని రుజువు చేస్తుంది ఆ అమ్మాయి! ఒక ఆడపిల్లను మోసగించిన మనిషిగా అతడిని సమాజం ముందు నిలబెట్టి తన కక్ష తీర్చుకొంటుంది. తను చెడిపోయిన పిల్లనని ప్రపంచానికి తెలిసిపోయినా సరే తనను వంచన చేసిన ప్రియుడికి గుణపాఠం చెబుతుంది. అలాంటి సాహసం కావాలి ప్రతి ఆడపిల్లకూ."
భ్రమర ఆమెతో ఏకీభవించనట్టుగా అంది. "కక్ష తీర్చుకొంటుంది నిజమే. గుణపాఠం చెబుతుంది నిజమే. కాని, తను ఎంత పోగొట్టుకొంటే అది సాధించింది? తను చెడిపోయిన పిల్లనని బయట పడకపోతే ఎవరైనా పెళ్ళాడతారు. సంసారం, పిల్లలు ఏర్పడతారు. అందరాడపిల్లల్లా తనూ సుఖపడేది. నిజంగా ఏ ఆడపిల్లకైనా కావలసింది అదేకదా?"
"అలాచేస్తే తను మరొకడిని మోసగించడంకాదా? పతివ్రతలా నటించడంకాదా? నటించే సంసారంలో నిండుదనం, నిజమైన సుఖశాంతులుంటాయా?"
"చేసిన తప్పులు జీవితమంతా అంటిపెట్టుకొని ఉండవు! చాలా మరిచిపోతాం! చాలా నేర్చుకొంటాం! చాలా పొరపాట్లు సవరించుకొంటాం! తెలిసో తెలియకో ఒకపొరపాటు జరిగితే దాని నీడ జీవితమంతా వెంటాడాలా ఏమిటి? ఎప్పటికప్పుడు క్రొత్తగా జీవితం నిర్మించుకోకపోతే, చేసిన తప్పునే పట్టుకొని వ్రేళాడుతుంటామా? చేసిన తప్పుకు జీవితమే బలిపెట్టుకొంటామా"
"ఇలా ఆడపిల్ల పిరికితనంవల్లో, మళ్ళీ జీవితంలో వసంతం ఉదయించాలన్న ఆశతోనో తన పొరపాటు కప్పి పుచ్చుకోవడమే తనను అన్యాయం చేసిన మగవాడు తప్పించుకుపోయేలా, రాజాలా తిరిగేలా చేస్తూంది. మరో ఆడపిల్లను వంచించే అవకాశం తనే వాడికి కల్పిస్తూంది!"
"మీరు చదివింది కథ! చదవడానికి బాగుంది! తన తప్పును బయట పడేసుకొన్నంత మాత్రాన మగవాడికి బుద్ది వస్తుందంటే నాకు నమ్మకంలేదు! మీనాక్షి సంగతే చూడండి. ఆ అమ్మాయి గుట్టుగా ఏ అబార్షనో చేయించుకొనిఉంటే, భవిష్యత్తులో ఏ ఆదర్శయువకుడో తారసపడి ఆమెను వివాహం చేసుకొనే అవకాశమైనా ఉండేది! స్త్రీకి కావలసిన ప్రేమానురాగాలు, అండదండలు అతడి వల్ల లభించేవి! ఇప్పుడేముంది? అజయ్ ఆమె ఛాయలకు కూడా వచ్చేట్టులేడు. చేసిన తప్పా, బయట పడిపోయింది. సమాజంలో ఇప్పుడు ఆ అమ్మాయి స్థానం ఏమిటి? కొడుకు పుస్తెకట్టని ఈ అమ్మాయిని సువర్చలగారు కోడలుగాని కోడలుగా ఎన్నాళ్ళు భరిస్తారు?"
"అవునూ! మీ అజయ్ అనుకొన్నట్టుగా లొంగిరాకపోతే మీనాక్షిని ఏం చేస్తారు?" కుతూహలం ప్రదర్శించింది పద్మినీదేవి.
"ఈ ఆస్తిఅంతా మీనాక్షిని పుట్టే బిడ్డకు రాసిస్తాను! అజయ్ కు ఒక్కపైసా దక్కనివ్వను!" నిశ్చయంగా చెప్పింది సువర్చల.
"ఆవేశంలో అంటున్నారుకాని కన్నకడుపుకొడుకి అంత అన్యాయం చేయనివ్వదు. దానికి రఘురామయ్యగారు అసలు అంగీకరిస్తారనుకోను. ఎందుకంటే ఆయన ఇప్పటికే మీకు వ్యతిరేకంగా ఉన్నారని విన్నాను"


