రావడం రావడమే దుందుభికొమ్ములు పట్టుకొని గిరగిరా తిప్పాడు వాలి. పర్వతంలాంటి ఆ రాక్షసుణ్ణి నేలకువేసి కొట్టాడు. దుందుభి చెవుల్లోంచి రక్తం ప్రవహించింది. దాంతో దుందుభీ ఉగ్రుడైపోయి వాలిమీద పడ్డాడు. కాని వాడి బలం ఉడగడంవల్లా వాలి బలం పెరగడంవల్లా వాలి మళ్లీ వాణ్ణి నేలమీద కొట్టాడు. దాంతో వాడి శరీరం పిండి పిండి అయిచచ్చి ఊరుకున్నాడు.
అప్పుడు గుట్టలాంటి దుందుభి కళేబరం ఎత్తి ఒక్క విసురు విసిరాడు వాలి. ఆ విసురుకు కళేబరం ఆమడదూరాన ఉన్న మతంగపర్వతం మీద పడింది. రక్తం చిమ్ముతున్న ఆ కళేబరం అక్కడ పడేప్పటికల్లా అక్కడే ఉన్న మంతంగ మహర్షిమీద కూడా రక్తం పడింది. యోగదృష్టితో అతడు జరిగిందంతా ఇట్టే గ్రహించాడు. "వాలి ఈ పర్వతంమీదకివస్తే చస్తాడు. అంతేకాదు. ఈ ఆశ్రమానికి ఆమడకైవరంలో వాడుగాని వాడిమంత్రిగానీ అడుగుపెడ్తే చచ్చేడన్న మాటే" అని శపించేశాడు. అప్పణ్నుంచీ వాలి ఆ పర్వతాల చాయలకైనా రావడం మానేశాడు.
హనుమంతుడి సలహా చొప్పున సుగ్రీవుడూ అతని మంత్రులూ ఋష్యమూకం చేరుకున్నారు. దాంతో చేసేదిలేక సుగ్రీవుణ్ణి వదిలేశాడు వాలి. అందుకే కిష్కింధకు దగ్గరే అయినా సుగ్రీవుడు నిక్షేపంలా ఆ పర్వతం మీద ఉంటున్నాడు.
సుగ్రీవుడు రామునికి వాలి కథ యావత్తూ పూసగుచ్చినట్లు చెప్పడంలో అతని ఉద్దేశాలు రెండు. వాటిల్లో ఒకటి వాలి బలపరాక్రమాల్ను గూర్చి రామునికీ తెలియచేయడం. రెండోది రాముడి బలాన్ని పరీక్షించి అతడు వాలిని చంపగలవాడని నిర్ధారణ చేసుకోవడం. ఆ ఉద్దేశంతోనే అతడన్నాడు. "రామా! మా అన్న బలపరాక్రమాలు విన్నావు. అదిగో చూడు. పర్వతంలా పడిఉంది ఎముకలగుట్ట. అది దుందుభి కళేబరానిది. పోతే వరుసగా ఏడు మద్దిచెట్లున్నాయి చూశావూ? మా అన్న లాగి బాణం విడిస్తే ఈ చెట్లలో ఒక్కొక్కదాన్ని కొట్టి దూసుకుపోయేది. రాఘవా! అలాంటి మా అన్నను నువ్వెలా వధించగలవు?
రాముడు చిరునవ్వు నవ్వాడు. సుగ్రీవుడికి తన బలంమీద విశ్వాసం కలిగించాలనుకున్నాడు. అక్కడ ఉన్న ఎముకల గుట్టను కాలిబొటనవేలితో చిమ్మాడు. ఆ గుట్ట యావత్తూ పది ఆమడల దూరంలో పడింది.
"నా బలపరాక్రమాలమీద నమ్మకం కలిగిందా?" అని అడిగాడు దాశరథి సుగ్రీవుణ్ని.
"మా అన్న దుందుభి కళేబరం విసిరినప్పుడు అది వచ్చింది. అంతేకాదు. అప్పుడు మా అన్న అలసి ఉన్నాడు. ఇప్పుడో! ఎముకల గుట్ట ఎండిపోయి గడ్డిపరకలా ఉంది. పైగా నువ్వు ఉత్సాహముతోనూ ఉన్నావు" అన్నాడు సంశయం వ్యక్తపరుస్తూ సుగ్రీవుడు.
"అయితే చూడు" అతని ఇంద్రధనుస్సులాంటి ధనుస్సుకు రాముడు నిప్పులు కక్కుతున్న రామబాణం తొడిగాడు. ఆకర్ణాంతం లాగి విడిచాడు. రివ్వుమని దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. ఆ బాణం ఏడు మద్దిచెట్టనూ కూల్చి భూమిలో దూరి తిరిగివచ్చి రాముని అమ్ముల పొదిలో ప్రవేశించింది.
అది చూసి సుగ్రీవుడు ఆశ్చర్యచకితుడై పోయాడు. వెంటనే సాష్టాంగ పడి ప్రభూ! ముక్కోటి దేవతలు ఎత్తివచ్చినా నీ ఒక్క బాణంతో పిండి పిండి చేయగల సామర్ధ్యం నీది. ఇక వాలి లెక్కేమిటి? ఒక్క బాణంతో ఏడుసాల వృక్షాలూ, పర్వతభాగమూ ఛేదించగల నీ ఎదుట నిలువగలడు? నీ సందేహం తీరింది. నా దుఃఖం అంతరించింది. నీమీద ప్రీతి పెరిగింది. మహేంద్రునితోనూ, వరుణునితోనూ సాటి అయిన నీవు నీకు మిత్రుడవైనావు. నాకింకేమిలోటు? ఇదో చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. (వైరిణ భ్రాతృ రూపిణం) అన్న రూపంలో ఉన్న నా శత్రువును వధించు" అని ప్రార్థించాడు.
రాముడు సుగ్రీవునితో మైత్రిచేశాడు. సుగ్రీవునికీ రామునికీ సుమారు ఒకేరకపు సమస్యలున్నాయి. మైత్రికి సమైక్యతకూ ఒకేరకపు సమస్యలు తోడ్పడతాయి. ఒకేరకపు సమస్యలున్నవారు, సంఘాలుగా ఏర్పడడం, తమ హక్కులను సాధించుకోవడానికి పోట్లాడ్డం మనం చూస్తున్నాం. సమస్యలు మనుషులను దగ్గరికి చేరుస్తాయి. సంఘటిత శక్తిని బలపరుస్తాయి.
సుగ్రీవునితో మైత్రి చేయవలసిందని కబంధుడు సలహా ఇచ్చాడు. ఎందుకు? రాముడు వంటరిగా రావణుని గెలవలేడు. సీతను తెచ్చుకోలేడు. అసలు రామాయణకథ సాంతం సీతను తెచ్చుకోవడం మీద ఆధారపడి ఉంది. సీతను తెచ్చుకోవడానికి రామునికి సాయం కావాలి. రామునికి సాయం ఎలా లభిస్తుంది? రాముని సమస్యలు అర్దం చేసుకోగలవాని వల్లనే లభిస్తుంది. రాముని సమస్యను అర్థం చేసుకోవడానికి రాముని లాంటి పరిస్థితుల్లో ఉన్న వాడు కావాలి.
అలాంటివాడు సుగ్రీవుడు. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. కాని వారు రాముడు, భరతునిలాంటివారు కారు. వారిలో భ్రాతృప్రేమ లేదు. రాజ్యంకోసం భార్యకోసం ఒకరినొకరు కొట్టుకొని చావడానికి సిద్ధంగా ఉన్నారు. వాలి చచ్చాడని సుగ్రీవుడు రాజయినాడు. వాలి చావలేదు. సుగ్రీవుని మీద పగబట్టాడు. రాజ్యంలోంచి సుగ్రీవుని పెళ్లాం - రుమను లాక్కున్నాడు.
సుగ్రీవుడు ఏదశలో ఉన్నాడు. అన్న రాజ్యం లాక్కున్నాడు. భార్యను లాక్కున్నాడు. అతన్ను చంపి ఆరెంటినీ సాధించాలని చూస్తున్నాడు. రాముడూ సుమారు అలాంటి దశలోనే ఉన్నాడు. అతని రాజ్యం పోయింది. భార్యను రావణుడు ఎత్తుకుపోయాడు. అందుకోసం సుగ్రీవునితో మైత్రి కోరాడు.
సుగ్రీవుడు రామునితో మైత్రి చేయడానికి కారణం తన పని సాధించుకోవడం. తనకు రాజ్యం వచ్చిం తరవాత రామునికి సాయం చేయడం. ముందు తన పని సానుకూలం అవుతుంది. తరవాత రామునికి సాయం చేయడం.
రాముడు సుగ్రీవునికి సాయంచేయగలడా? అతనికి ఆ శక్తి సామర్థ్యాలున్నాయా? ఉన్నాయని గ్రహించాడు సుగ్రీవుడు. ఎంచాతంటే రాముని దగ్గర బాణం ఉంది. విల్లునమ్ములు వానరులకు కొత్తవి. వారికి ఎదురుపడి పోట్లాడుకోవడమే తెలుసు. ముష్టి యుద్ధం మాత్రం తెలుసు. బాణం వారికి వింత. దూరంగా ఉన్న లక్ష్యాన్ని బాణంతో ఛేదించవచ్చు. మనిషి దగ్గరగా ఉండాల్సిన అక్కరలేదు. దూరంలో ఉండి గురిచూసి కొట్టగలడు.
సుగ్రీవునికి కావలసింది అదే. వాలి బలవంతుడు. ఎదురుపడి అతన్ని ఎవరూ చంపలేరు. దూరంగా ఉండి గురిచూసి కొట్టగలవాడు కావాలి. అలాంటివాడు రాముడనే విషయం గ్రహించాడు. స్నేహం చేసాడు. అయినా రామునిమీద నమ్మకం కలగలేదతనికి. పరీక్షించాడు. దుందుభి కళేబరం బాపతు ఎముకలను విసరమన్నాడు. రాముడు చిమ్మాడు. సుగ్రీవునికి సంతృప్తి కలగలేదు. ఎంచాతంటే అది రాముని బలానికి సంబంధించింది. అతనికి కావలసింది రాముని బలంకాదు. గురి. అతనికి నమ్మకం కలిగించడానికి రాముడు మద్దిచెట్లను కొట్టాడు. అది చూచి సుగ్రీవునికి నమ్మకం కుదిరింది. రామునితో చెలిమి చేశాడు.
సుగ్రీవుడు రామునితో స్నేహం చేసింది - రాముని దగ్గరున్న ఆయుధాన్ని చూసి. బలమైన ఆయుధాన్ని చూసి. దుర్బలులు స్నేహం చేయడం పరిపాటే. నేటి అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతున్నది అదే. అగ్రరాజ్యాలకు బలమైన ఆయుధాలున్నాయి. ఆయుధాలను చూసి ఆ రాజ్యాలతో దుర్బల రాజ్యాలు చెలిమి చేస్తున్నాయి.
వాలికి బాణప్రయోగంరాదు. బాణ ప్రయోగం వస్తే సుగ్రీవుణ్ణి ఎన్నడో కొట్టి చంపేవాడు. అతన్ని దేశదేశాలు తరిమికొట్టాల్సిన పనిలేదు. వాలి దుందుభితో కూడా ముష్టియుద్ధమే చేశాడు. సుగ్రీవుడు వాలికి బాణం వేయడం వచ్చని అబద్ధం ఆడాడు. వాలికి బాణం వేయవచ్చునంటే గాని రాముడు తన బాణప్రయోగనైపుణ్య ప్రదర్శన చేయడు. అందుకని అబద్ధం ఆడి వుంటాడు.


