Home » Sri N T Rama Rao » 40 Years of TDP
తెలుగుదేశం పార్టీ సైద్ధాంతిక పునాదులు పటిష్టమైనవి. బలమైన రాష్ట్రాలే బలమైన కేంద్రానికి తోడ్పడతాయని రాష్ట్రాల సమగ్రాభివృద్దె దేశ ప్రగతికి మార్గమని తెలుగుదేశం ఆనాడే ప్రకటించింది. జాతీయ భావానికి కట్టుబడి, తెలుగు జాతి ఔన్నత్యానికి పాటు పడటమే పరమావధిగా తెలుగుదేశం ఆవిర్భవించింది. తెలుగువాడును పాడిపంటలతో, పరిశ్రమలతో , విద్య, వైద్య సదుపాయాలతో, సంస్కృతీ సంపదలతో సకల కళావిలసితంగా తీర్చిదిద్దాలని, తెలుగు జాతి నిండు గౌరవాన్ని జెండాగా ఎగరవేయాలని ఆనాడు మ్యానిఫెస్టో లో చేసిన వాగ్దానానికి కట్టుబడి గడిచిన నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం ముందుకు సాగుతోంది.
సంక్షేమ ప్రభుత్వం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే తెలుగువారికి తెలిసింది. రెండు రూపాయలకే కిలో బియ్యం పధకం నందమూరి తారకరామారావు పేరుని పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిపింది. 1982 లో పార్టీని ప్రారంభించిన వెంటనే ఎన్టీఆర్ ఈ పధకానికి రూపకల్పన చేశారు. దారిద్యం విలయతాండవం చేస్తున్న ఆ రోజుల్లో కడుపు నిండా తిండి దొరకడం దుర్భరంగా ఉండేది. తన ప్రచారంలో ఈ పరిస్థితిని కళ్ళారా చూసిన ఎన్టీఆర్ , అన్నమో రామచంద్రా అన్నవారి ఆకలి తీర్చాలని ప్రతినబూనారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు రూపాయలకే కిలో బియ్యం పధకాన్ని సమర్ధంగా, విజయవంతంగా అమలు చేసి, సంక్షేమ పధకాల అమలుకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు.
(ఎన్ని ఇబ్బందులున్నా చౌక బియ్యాన్ని పేదలకు అందించాల్సిందేనన్న ఎన్టీఆర్
నిబద్దత కారణంగానే రెండు రూపాయలకే కిలో బియ్యం పధకం
విజయవంతంగా అమలైంది. )
1983 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో కోటి కుటుంబాలకు నెల నెలా క్రమం తప్పకుండా కిలో రెండు రూపాయల చొప్పున 25 కిలోల బియ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అందించింది. ఇంత విసృతంగా, మారుమూల ప్రాంతాల్లోని పేదలకు కూడా అందేలా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని రూపిందించడం దేశంలోనే తొలిసారి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా 27,221 రేషన్ దుకాణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు చౌక బియ్యం సరఫరా అయింది.
ఆనాడు రాష్ట్రంలో 43 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నారని ప్రణాళికా సంఘం అంచనా వేసింది. తొలుత ఏడాదికి 3,000 రూపాయలకు దిగువున ఆదాయం ఉన్నవారికి చౌక బియ్యం పధకాన్ని అమలు చేశారు. అయితే ప్రణాళికా సంఘం లెక్కల కన్నా రాష్ట్రంలో పేదల సంఖ్య ఎక్కువున్నదని గ్రహించిన ఎన్టీఆర్ , ఏడాదికి ఆరు వేల రూపాయల లోపు ఆదాయం వచ్చే వారందరికీ ఈ పధకాన్ని వర్తింపజేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో కోటి 43 లక్షల కుటుంబాలకు సబ్సిడీ బియ్యం పధకం ద్వారా లబ్ది చేకూరింది. రాష్ట్రంలో 86 శాతం కుటుంబాలకు ప్రభుత్వం చౌక బియ్యాన్ని అందించింది. 1982 లో 41 వేల టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణి చేస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 1985 నాటికి కనీవినీ ఎరుగని రీతిలో ఏడాదికి 18లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఎన్ని ఇబ్బందులున్నా చౌక బియ్యాన్ని పేదలకు అందించాల్సిందేనన్న ఎన్టీఆర్
నిబద్దత కారణంగానే రెండు రూపాయలకే కిలో బియ్యం పధకం
విజయవంతంగా అమలైంది.
ముఖ్యమంత్రే దన్నుగా నిలబడడంతో ఈ ప్రతిష్టాత్మక పధకాన్ని అమలు చేయడం సుసాధ్యమైందని ఐఏఎస్ అధికారి కెఆర్ వేణుగోపాల్ అంటారు. ఈ పధకాన్ని అమలు చేసే బాధ్యతను ఎన్టీఆర్ స్వయంగా ఈ సీనియర్ అధికారికి అప్పజెప్పారు. భారీఎత్తున బియ్యాన్ని సేకరించడానికి వ్యతిరేకంగా రైస్ మిల్లర్ల లాబీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి యెంత ప్రయత్నించినా ఎన్టీఆర్ పట్టుదల ముందు అటువంటి ఆటలు సాగలేదని ఆ కాలంలో పౌర సరఫరాల కమిషనర్ గా పనిచేసిన మరి ఐఏఎస్ అధికారి సిడి అర్హ చెబుతారు. ఈ పధకానికి పరిమితులు విధించి, ప్రభుత్వం మీద ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవాలని పలువురు సలహా ఇచ్చినా, ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు. 1988-89 లో గతంలో ఎన్నడూ లేని విధంగా సబ్సిడీ బియ్యం మీద ప్రభుత్వం 1,626 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆహార భద్రతను ప్రాధమిక హక్కుగా ఇవాళ ప్రపంచం గుర్తించింది. కాని ఆనాడే తెలుగుదేశం పార్టీ ఆకలి బాధ నుంచి పేదలను విముక్తుల్ని చేయడానికి పూనుకుంది. ఈ పధకం అమలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆకలి చావులు గణనీయంగా తగ్గిపోయాయని, మారుమూల పల్లెల్లో కూడా పౌష్టికాహారం అందుబాటులోకి వచ్చిందని వివిధ అధ్యయనాలు తెలుపుతున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావంతో రాష్ట్రంలో కడు పేద కూడా కడుపు నిండా అన్నం తినే రోజులొచ్చాయి.
(ఆనాటి పేదల ఆర్ధిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని తొలి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ అట్టడుగు వర్గాలకు ఆసరాగా పెద్దఎత్తున సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టారు.)
రాష్ట్రంలో పేదల జీవితాలకు భరోసా కల్పిస్తూ విసృతంగా సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశానిదే. తొలిసారిగా 65 సంవత్సరాలు పైబడిన పేద వృద్దులకు నెలకు 30 రూపాయల ఫించన్ ను ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆనాడు ఏటా 2.27 లక్షల మందికి ఈ సాయాన్ని అందించారు. అదేవిధంగా అనాధ వితంతు మహిళలకు నెలకు 50 రూపాయల ఫించను పధకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో 55 వేల మందికి ప్రతి నెలా ఈ మొత్తాన్ని ముట్ట జెప్పారు. అరవై ఏళ్ళు నిండిన 5.64 లక్షల వృద్ద వ్యవసాయ కార్మికులకు నెలకు 30 పించను చెల్లించే పధకాన్ని అమలు చేశారు.
(వృద్దులకు, వితంతువులకు తొలిసారిగా ఫించన్ల పధకాన్ని ప్రవేశపెట్టిన ఘనత
తెలుగుదేశానిదే . కార్మికులు, చేనేత పనివారు, విద్యార్ధులు, రైతులు మొదలైన సకల వర్గాలను తెలుగుదేశం ఆదుకుంది.)
వికలాంగుల సంక్షేమానికి ఎన్టీఆర్ ప్రభుత్వం అనేక పధకాలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ లో వికలాంగుల కోసం కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పించి, అంధుల కోసం హిందూపురం, విశాఖపట్నం , మహబూబ్ నగర్ జిల్లాల్లో మూడు ఆశ్రమ పాఠశాలలను , మూగ, చెవిటి వారి కోసం గుంటూరు, నల్గొండ జిల్లాల్లో రెండు పాఠశాలలను ఏర్పాటు చేసింది. టిటిడి సాయంతో వరంగల్ లో చెవిటి వారి కోసం పాఠశాలను నిర్మించింది. చెవిటి బాలికల కోసం తూర్పు గోదావరి జిల్లాల్లో వికలాంగుల కోసం ప్రకాశం జిల్లాల్లో అంధుల కోసం గుంటూరు జిల్లాల్లో మూడు హాస్టళ్ళలను నిర్మించింది. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ముద్రించే ముద్రణాలయాన్ని హైదరాబాద్ లో నెలకొల్పింది.
చేనేత వస్త్రాలకు డిమాండ్ కల్పిస్తూ ప్రభుత్వ రాయితీతో జనతా వస్త్రాల పేరుతొ పేదలకు అతి తక్కువ ధరలకు బట్టలను అందించే కార్యక్రమం ఎన్టీఆర్ హయాంలో విజయవంతంగా సాగింది. ఈ పధకం కింద రేషన్ కార్డులున్న వారికి 50 శాతం ధరకే చీరలు, ధోవతులు అందించారు. పేదలకు ఆరున్నర లక్షల ఇళ్ళు నిర్మించడంతో పాటు, మరో 13 లక్షల కుటుంబాలకు ఇళ్ళ స్థలాలను 1983-89 మధ్య ఎన్టీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసింది. మురుకివాడల్లో నివసించే పిల్లలకు పాలు, అందించడానికి బాలల క్షీర సంక్షేమ పధకం , రిక్షా కార్మికుల కోసం తోక్కేవారిదే రిక్షా పధకం, పల్లె వాసుల కోసం గ్రామీణ క్రాంతి పధకం పేరుతొ 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ పధకం , తెలుగు మాగాణి సమారాధనం కింద మిగులు భూమి పంపకం, అయిదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు భూమి శిస్తు రద్దు మొదలైన అనేక పధకాలను తొలి ప్రభుత్వంలోనే తెలుగుదేశం శీకారం చుట్టింది.
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరాను లక్ష్యంగా చేసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇందుకోసం గణనీయంగా కృషి చేసింది. అంతకుముందు మూడు దశాబ్దాల్లో 5.16 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ సౌకర్యం ఉంటె, తెలుగుదేశం ప్రభుత్వం నాలుగేళ్లలోనే మరో 3.34 లక్షల కొత్త పంపుసెట్లకు ఈ సౌకర్యాన్ని కల్పించింది. అంతేకాదు, దేశంలోనే తొలిసారిగా రైతుల మీద విద్యుత్ బిల్లుల భారం పడకుండా , వ్యవసాయ రంగంలో ఏడాదికి హార్స్ పవర్ కు 50 రూపాయలు మాత్రమే ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ విద్యుదీకరణ కు ప్రాధాన్యం ఇచ్చి, రాష్ట్రంలోని 27,379 పల్లెలో 91 శాతం వరకు కరెంటు సౌకర్యం కల్పించిన ఘనత కూడా తెలుగు దేశానిదే.