Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



                                                        ఆలోచనామృతము
    భాగవతమున భరద్వాజుని కధ ఉన్నది. దానిని అన్వయించిన కొన్ని విషయములు బయటపడును. భరద్వాజుని కధ ఇట్లుండును.
    మమత బృహస్పతికి వదిన. బృహస్పతి కన్ను మమత మీద పడినది. బృహస్పతి మమతను విడువలేదు. ఆమెతో సంగమించినాడు. మమత గర్భవతి అయినది. ఒక పుత్రుని కన్నది. ఆమె భయపడినది. భర్త తనను త్యజించును అనుకున్నది. బృహస్పతి దగ్గరికి వెళ్ళినది. పుత్రుని చూపినది. "వీడు నీకు పుట్టినాడు. పోషించుము" అన్నది. అందుకు బృహస్పతి "ద్వాజ" అనిన వీడు ఇద్దరకు కలిగినాడు. నీవే పోషించుము అన్నాడు. ఆమె "భరద్వాజ" అన్నది. అంటే వీడు మన ఇద్దరికీ కలిగినవాడు పోషించుము అన్నది.
    అందువలన అతను "భరద్వాజుడు."
    భరద్వాజుని పోషణ విషయమున బృహస్పతికి మమతకు జగడము కలిగినది. ఇద్దరును భరద్వాజుని వదలివేసినారు. వెళ్ళిపోయినారు.
    భరద్వాజుని మరత్తులు పోషించినవి.
    ఈ కధ వలన తలిదండ్రులు బిడ్డలను వదలివేయుట విరివిగా జరిగినట్లు కనిపించును. స్త్రీ, పురుషులు సంగమము జరుపువారు. సంతానమునకు బాధ్యత వహించువారు కారు. భరద్వాజునకు అది చాల బాధ కలిగించినది. అతడు తల్లిదండ్రుల ప్రమేయము లేని సంతానమును గురించి ఊహించినాడు. నిరంతరము శ్రమించినాడు. సఫలుడు అయినట్లు కనిపించుచున్నది.
    కృపాచార్యుని జననములు గురించి అలోచించినాము. అప్పుడు సంగమము అక్కరలేని సంతానము ఉన్నదని తెలుసుకున్నాము. ఇది భరద్వాజుని కృషి ఫలితము అయి ఉండవలెను.
    ద్రోణుని జననము కృత్రిమ ప్రయోగము వలన జరిగినది. భరద్వాజుడు ఘ్రుతాచితో సంగమించలేదు. ఆమెను తాకనయిన లేదు. అతనికి స్తలనము అగుటకు మాత్రము ఆమె ఉపకరించినది.
    పృషతునకు ద్రుపదుడు కూడ అట్లే కలిగినాడు. అతడు మేనకతో సంగామించలేదు. అతనికి స్థలనము అగుటకు మాత్రము ఆమె ఉపకరించినది. ద్రుపదునికి జననము కూడ జాబాలి చేసిన ప్రయోగము అయి ఉండవలెను.
    ఇక్కడ ఒక విషయము స్పష్టమైనది. సంతానమునకు స్త్రీ పురుష సంగమము అక్కరలేదు. కాని స్త్రీ, పురుషులు అవసరము. ప్రకృతిని దిక్కరించిన ప్రయోగములు లేవు. ప్రకృతిని అనుసరించినవే ప్రయోగములు.
    జాబాలి ప్రయోగ ఫలితముగా పుట్టినవారు కృపి, కృపాచార్యుడు, ద్రోణుడు, ద్రుపదుడుగా కనిపించుచున్నారు.
    జాబాలి మరొక ప్రయోగము చేసినాడు. కృత్రిమ జాతులకు వివాహము జరిపించినాడు. కృపి, ద్రోణుడు అట్టివారే. వారు సంగమ జాతుల వలె పరుపూర్ణులు అగుడురో కారో అని ప్రయోగము చేసినాడు. వారికీ సంగమమున సంతానము కలిగినది. అట్లు పుట్టినవాడు అశ్వత్ధామ.
    కౌరవుల జననమును గురించి చర్చించినాము. అప్పుడు వ్యాసుని ప్రయోగమును గురించి చర్చించినాము. వ్యాసుడు ధృతరాష్ట్రుని వీర్యము సేకరించినాడు. ఆ వీర్యము వలన ధృతరాష్ట్రుని నూరుగురు భార్యలకు కృత్రిమ గర్బములు ధరింపచేసినాడు. అట్లు చేయుటవలన నూరుగురు ఒకేసారి పుట్టినారు. ఒకరి తరువాత ఒకరు పుట్టుటకు మానవుని అయుష్యము చాలదు.
    జాబాలి మరొక అడుగు ముందుకు వేసినాడు.
    కృత్రిమ గర్బమును కాక కృత్రిమ సంతానమునే సృష్టించినాడు.
    జాబాలి అపర సృష్టి చేసినాడు.
    పాశ్చాత్యులు ఇందు గురించి ఇప్పుడు పరిశోధనలు జరుపుచున్నారు. వారు కృత్రిమ గర్బోత్పత్తి వరకు వచ్చినారు.
    ఇక్కడ మనము ఒక విషయము గుర్తించవలెను. కృత్రిమ గర్బోత్పత్తి సమాజ కళ్యాణమునకు తోడ్పడదు. అది అనేక అనర్ధములకు దారితీయును. ఈ విషయము ఈ మధ్యన విదితము అయినది.
    ఇంగ్లండు లో తొలి కృత్రిమ సంతానము కలిగినపుడు అది సమాజమునకు అనర్ధదాయకమని ఎలుగెత్తి చాటుట జరిగినది.
    మన దేశమున బెంగాలులో కూడా కృత్రిమ గర్భధారణ చేయించి సంతానము కలిగించుట జరిగినది. అప్పుడు కూడ వ్యతిరేకత వెల్లడి అయినది. ఇందుకు కారణము అయిన డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
    కృత్రిమ సంతానము సమాజమునకు ఆరోగ్యకరము కాదు. ఈ విషయము వ్యాసుడు తెలుసుకున్నాడు. జాబాలి తెలుసుకున్నాడు. అందుకే దానిని అంతటితో అపినారు.
    ఆధునిక శాస్త్రజ్ఞులు ఇంకను అందు గురించి తెలుసుకొనవలసి ఉన్నది. అప్పుడు గాని దానిని ఆపరు.
    పోతపాలకంటే చనుబాలు మంచివని కొన్ని వేల సంవత్సరముల క్రితము భారతీయులు కనుగొన్నారు. ఈ విషయము ప్రతి సామాన్యునికి ఇక్కడ తెలియును.
    అట్లు కాక పోతపాలే మంచివని కొంతకాలము క్రితము పాశ్చాత్యులు కనుగొన్నారు. ఇప్పుడు అందుగురించి అంతర్జాతీయ సంస్థలు పరిశోధన చేసినవి. చనుపాలను మించినవి లేవని నిర్ణయించినవి. భారతీయులు కొన్ని వేల సంవత్సరముల క్రితము కనుగొన్న సత్యమును, ఇప్పుడు పాశ్చాత్యులు కనుగొన్నారు.
    కృత్రిమ గర్బోత్పత్తి ప్రయోగములు ఇప్పుడు జరుగుచున్నవి. అవియు నిష్ప్రయోజనములని కొంతకాలమునకు గాని వారు తెలుసుకోరు.
    ఈ విషయమును వ్యాసుడు, జాబాలి తెలుసుకొని వేల సంవత్సరములు గడిచిపోయినవి.
    అయితే ఇప్పుడు పాశ్చాత్యులు కనుగొన్నవి అన్నియు భారతీయులు ఇదివరకే చేసినారనుట మూర్ఖత్వము . వారు కొత్తవి అనేకము కనుగొన్నారు. భౌతికముగా మానవుని ఉన్నత శిఖరము చేర్చుటకు వారి పరిశోధనలు ఎంతగానో ఉపకరించుచున్నవి.
    సామాజిక విషయమునను, మానవుని మానసిక పరిణామమును గురించి భారతీయ మేధావులు చేసినంత కృషి, సాధించిన ఫలితములు పాశ్చాత్యులు ఇంతవరకు చేయలేదు. అందుగురించిన ప్రయత్నము కూడ అంతంత మాత్రాముగనే ఉన్నది.
    ద్రుపద ద్రోణుల కధ అతి సామాన్యమయినది. ఈ కాలమున కూడ చాలామందికి జరుగుచున్నది. అధికార మదము వారితో అట్లు చేయించును. గాంధీజీ స్వీయ చరిత్రలో ఇందుకు సంబంధించిన ఒక వృత్తాంతము ఉన్నది. ఇంగ్లాండులో గాంధీజీకి సన్నిహిత మిత్రుడు పోర్ బందరుకు అధికారిగా వచ్చినాడు. గాంధీజీ అన్నగారి పనిమీద అతని దగ్గరికి వెళ్ళినారు. అధికారి గాంధీజీని అవమానించి పంపినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.