లోపలికి అడుగుపెట్టారు.
ఏ.సి. లేకపోయినా చల్లగా వుంది లోపల.
హాలు కాస్త పెద్దదిగానే వుంది. ఓ మూల స్టాండ్ పైన టి.వి. దానిప్రక్కనే స్టీరియో రికార్డర్, వి.సి.ఆర్, మరో మూల ఫ్రిజ్, హాలు మధ్య మెత్తటి సోఫా, కుర్చీలు, టీపాయ్ మినహా మరే ఫర్నీచరూ లేదు.
గోడలకి నీలం రంగు వేసివుంది. ఓ చోట గోడకి తగిలించిన ఫోటో చూసి క్షణం ఆశ్చర్యపోయింది అంకిత. అది భరద్వాజ ఫొటోలా వుంది. కాకపోతే వయసులో మార్పు.
"మా నాన్నగారు" చెప్పాడు సిద్ధార్థ అంకిత ఆ ఫొటోకేసి చూడటంతో.
"అంటే...." అర్దోక్తిలో ఆగిపోయింది.
"కాదు....ఈ భరద్వాజగారు కాదు. ఈయన కేశవ్ భరద్వాజ. ఫొటోలో వున్నది విజయ్ భరద్వాజ."
ఫ్రిజ్ లోంచి ఆమెకో కూల్ డ్రింక్ అందించి తనొకటి అందుకున్నాడు.
తర్వాత సిగరెట్ అంటించుకున్నాడు.
లైటర్ నుండి సంగీతం వినిపించింది.
పొగ గుండెలనిండా పీల్చుకొని, అంకితకేసి తిరిగాడు.
"సాగర్ అపాయంలో వున్నట్టు మీకు ఫోన్ చేసింది నేనే."
అప్పుడు వెలిగింది అంకితకి ఫోన్ లో తనకి లీలగా సంగీతం వినిపించడం.
"గొంతు మార్చాలని సిగరెట్ నోట్లో పెట్టుకుని మాట్లాడాను."
ఏం మాట్లాడాలో తెలీక కాసేపు మౌనంగా కూర్చుంది. తరువాత అడిగింది. "మీకెలా తెలుసు సాగర్ అపాయంలో వున్నాడని?"
"అది చెబుదామనే మిమ్మల్ని పిలిచింది"
"పోలీస్ స్టేషన్ కి వెళ్ళేలోగా నీకు కొన్ని వివరాలు తెలియడం మంచిది. అయితే మనం అరవయ్ సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి"
గోడకి తగిలించిన తండ్రి ఫోటోకేసి చూస్తూ అన్నాడు సిద్ధార్థ.
అతని నోటినుండి మాటలు ప్రవాహంలా వస్తున్నాయ్.
* * * *
మార్కండేయులుగారికి పెళ్ళయిన ఆరేళ్ళవరకూ సంతానం కలగలేదు. డాక్టర్లు ఆయనలోనూ ఆయన భార్య కస్తూరిలోనూ కూడా లోపం లేదన్నారు. వాళ్ళు తిరగని తీర్థంలేదు, దర్శించని గోపురం లేదు. ఏడో సంవత్సరం పండంటి అబ్బాయిని కని ఆయన చేతుల్లో పెట్టి కన్నుమూసింది కస్తూరి.
కొడుక్కి 'కేశవ్ భరద్వాజ' అని పేరుపెట్టి ఎంతో గారాబంగా పెంచుకోసాగాడు....ఆయన ఇప్పటి....మీకు తెలిసిన ఈ భరద్వాజ గారు....
బంధువుల ప్రోద్బలం వల్లనైతేనేమి వయసు చూపిన ప్రభావం వల్లనైతేనేమి మార్కండేయగారు తన ముప్పై నాలుగోయేట కేశవ్ కి రెండేళ్ళపుడు మరో పెళ్ళి చేసుకున్నాడు....లలితని.
లలిత చాలామంది సవతితల్లుల్లాకాక చాలా శాంత స్వభావురాలు కావడం తన అదృష్టంగా భావించారు మార్కండేయులుగారు.
లలిత కేశవ్ కి ఆరేళ్ళు వయసుండగా ఓ మగపిల్లాడిని ప్రసవించింది. అతనికి విజయ్ భరద్వాజ అని నామకరణం చేశారు. అంటే ఈ ఫోటోలో వున్న వ్యక్తి....మా నాన్నగారన్నమాట.
కేశవ్ ని, ఉన్నది మారుమూల పల్లె కావడంతో పట్నం పంపారు. కాలేజీ చదవటానికి.
మార్కండేయులుగారి సంపాదన చాలా తక్కువ కావడంవలన విజయ్ ని అతని మేనమామ దగ్గర ఢిల్లీలో వుంచి పెంచసాగారు.
ఢిల్లీలో వున్న విజయ్, వైజాగ్ లో వున్న కేశవ్ ఎక్కువగా కలుసుకోలేదు. విజయ్ చదువులు మేనమామ చెప్పించడమే కాకుండా కేశవ్ పై చదువులకి కూడా లలిత పుట్టింటినుండే డబ్బులు అందుతూ వుండేవి.
* * * *
"అంత డబ్బుకలవారు రెండో పెళ్ళెందుకు చేశారామెకి?" అంకిత అడిగింది కుతూహలంగా.
"ఆమెకి పోలియో....ఓ కాలు పన్చేయదు ఆల్మోస్ట్....అదీగాక పెళ్ళినాటికి అత్త, ఆడపడుచులాంటి వాళ్ళెవరూ లేక ఒంటరివాడయిన ముప్పైనాలుగేళ్ళ మార్కండేయులు మంచి సంబంధమే అనిపించింది వారికి. ఇక బాబంటారా....రెండేళ్ళేగా....?"
* * * *
ఢిల్లీలో విజయ్ కన్నా వైజాగ్ లో కేశవ్ చదువు ఖర్చులు బాగా ఎక్కువ కావడంతో దుబారా చేస్తున్నాడేమో అన్న అనుమానం లలితకి అప్పుడప్పుడు కలిగినా ఆమె అనుమానాన్ని తనలోనే దాచుకొంది. కేశవ్ అన్నా ఆమెకున్న వాత్సల్యం దాన్నో పెద్ద విషయంగా కనిపించనివ్వలేదు.
విజయ్ ఢిల్లీలో ఓ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళయ్యాకే అతను ఆ విషయం ఇంటిలో చెప్పడానికి కారణం ఆ యువతి అంధురాలు కావడమే.
కాని అతని ధైర్యాన్నీ, భావాల్నీ గౌరవించారు మార్కండేయులు, లలిత.
ఆమెను తల్లిదండ్రుల దగ్గరుంచి తాను ఢిల్లీలో చదువు పూర్తిచేయడం కోసం వుండిపోయాడు విజయ్.
కాలచక్రం లలితను కూడా తనలో కలిపేసుకుని చరిత్రలో భాగం చేసింది.
ఆమె మరణవార్త విని రైలులో బయలుదేరి వస్తూ ఏక్సిడెంటు పాలయ్యాడు విజయ్. దాదాపు నెల రోజులు ఆసుపత్రిలో ఏదో వూళ్ళో కోమాలో వుండిపోయాడు.
అతని దగ్గిర ఎలాంటి గుర్తింపు కాగితమూ లేకపోవడంతో అతని బంధువులకీ విషయం నెలరోజుల తరువాత గాని తెలియలేదు. పినతల్లి మరణవార్త విని వచ్చిన కేశవ్, విజయ్ భార్య ధరణిని చూశాడు.
కాలేజీలో తాను అలవాటు చేసుకున్న చెడు తిరుగుళ్ళ మైకానికి ధరణిని బలి చేసి తన దారిన తాను పోయాడు.
నెల తరువాత విజయ్ వచ్చాడు, ఆసుపత్రిలో పూర్తిగా కోలుకొని తన గుండెల్లోని భారాన్ని విజయ్ కి తెలిపి గుండెలు పగిలేలా రోదించింది ధరణి.
విజయ్.... అంటే మా నాన్నగారు.... పట్టలేని ఆవేశంతో వైజాగ్ బయలుదేరాడు.
అలా వెళ్ళిన విజయ్ తిరిగి ఇంటికి రాలేదు.
ఏవఁయ్యాడో ఎవరికీ తెలీదు.
మరో నాలుగు నెలలకి బయటపడింది ధరణి గర్భవతన్న విషయం. కోడల్నాస్థితిలో వదిలి కొడుకు వెళ్ళిపోయాడని చుట్టుప్రక్కల వాళ్ళనే సూటిపోటి మాటల్ని భరించలేక పోయింది వయసుడిగిన మార్కండేయుని గుండె.
ఓ రోజది ఆగిపోయింది.
ప్రక్కవాడి కష్టాన్ని కుళ్ళబొడిచే సమాజంలో ఒంటరిగా దిక్కుతోచక మిగిలిన ధరణి ఎలాగో కష్టపడి అనకాపల్లి దగ్గర రెండేళ్ళ కొడుకుతో నానా బాధలూ పడుతున్న వేలు విడిచిన అక్క సరస్వతి ఇల్లు చేరింది.


