బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు కావడంవల్ల ఆ పేరుచూడగానే అతన్ని ఆకర్షించింది.
రచయిత పేరు చూసాడు.
Dr.Gangadhararao.
వరసగా పేజీలు తిప్పుతున్నాడు.
సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తకు ఉండాల్సింది చదువు, డిగ్రీలు కాదు. వ్యాపార దక్షత. మానవ స్వభావాన్ని విశ్లేషించి, మంచి చెడులను చూడగలిగే ప్రతీవాడు సక్సెస్ ఫుల్ గా తన జీవితాన్ని మలచుకోగలడు. మధుకర్ దృష్టి ఒక చాప్టర్ దగ్గర ఆగింది.
A Mischievous College student becoming an enter- preneur spears of the significant role played by Industrial estates.
అది చూడగానే వీడెవడో తనలాగే వున్నాడు అనుకున్నాడు మధుకర్. ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన వెంకట్రావ్ అనే యువకుడు, అల్లరి చిల్లరిగా వున్నాడని, తను చదువుతున్న చదువుకి న్యాయం చేయలేదనే కోపానికి గురై బయటికి వచ్చి, తన స్వశక్తితో, ఎలా ఒక వ్యాపారవేత్తగా పరిణామం చెందాడో రచయిత వివరించాడు.
ఇరవై ఆరేళ్ళ వెంకట్రావ్, ఆముదాలవలసలోని కోర్ణకోట గ్రామానికి చెందినవాడు. ఆ సమయంలోనే, అతను శ్రీశ్రీనివాసా నవ్వార్ టేప్ ఇండస్ట్రీస్ రూపకల్పన చేసాడు. అప్పట్లో అది శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు ఏకైక నవ్వార్ టేప్ ఇండస్ట్రీ.
ఆ ఇండస్ట్రీ స్థాపన వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అంతకుముందు అతను శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాలలో బి.కాం. చదువుతుండేవాడు. స్టూడెంట్స్ యూనియన్ కి ఛైర్మన్ గా, లాంగ్వేజ్ అసోసియేషన్ కి కార్యదర్శిగా, స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ తలలో నాలుకలా వుండేవాడు. తానెప్పుడూ నాగావళి నదిలా ఉత్సాహంగా వుంటూ, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేవాడు.
కానీ అలాంటివాడు ప్రిన్సిపాల్ కోపానికి గురయ్యాడు. తనేం తప్పు చేయలేదని వెంకట్రావ్ వాదన. కానీ తనని కాలేజీ నుంచి పంపించెయ్యడమే కాకుండా, తనని అసభ్యమైన పదజాలంతో దూషించినందుకు ప్రిన్సిపాల్ మీద హైకోర్టులో కేసు కూడా వేసాడు వెంకట్రావ్. కొంత గొడవ సహజంగా జరిగింది. ఈ కారణంగా ప్రిన్సిపాల్ దృష్టిలో వెంకట్రావ్ అల్లరి విద్యార్థిగా గుర్తింపు పొందాడు. దాంతో మానసికంగా చాలా బాధపడ్డాడు వెంకట్రావ్. నిజాన్ని ఎవరూ గుర్తించలేని పరిస్థితిలో అబద్ధమే నిజంగా చలామణీ అవుతుందని వెంకట్రావ్ నమ్మాడు. దాంతో చదువుమీద విముఖత ఏర్పడింది.
చదువు ఆగిపోయింది. మరి చదవాలనే ధ్యాస కూడా లేదు. ఏం చెయ్యాలనే ఆలోచనలో పడిన సమయంలో తండ్రి, అన్నగార్ల సలహాతో నవ్వార్ టేప్ ఇండస్ట్రీని పెట్టాడు. ఆ యూనిట్ మంచాలకు నవ్వార్ ని, కిరోసిన్ దీపాలకు వత్తుల్ని తయారుచేస్తుంది. ప్రారంభ సంవత్సరంలో దానికి వెంకట్రావ్ పెట్టిన పెట్టుబడి 50 వేలు మాత్రమే. అప్పట్లో అతని దగ్గర 15మంది పనిచేస్తుండేవారు.
స్వయం ఉపాధి పథకం. వెంకట్రావ్ ప్రారంభించిన నవ్వార్ టేప్ ఇండస్ట్రీని అంచెలంచెలుగా తన కృషితో, దీక్షతో పైకి తీసుకొచ్చాడాయన.
తను పుట్టి పెరిగిన ప్రదేశంలో తను వ్యాపారవేత్తగా మారిన వెంకట్రావ్ ది ఒక కథ అయితే, విజయనగరానికి చెందిన టి.రాజగోపాలరావుది ఇంకొక ఆసక్తికరమైన కథ.
ఇవ్వాళ, రేపు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రతి విద్యార్థి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చూపెట్టే ఆసక్తి, స్వంత ఊళ్ళోగాని, స్వంత రాష్ట్రంలో గానీ వుండడానికి చూపించడంలేదు. దానిక్కారణం ఇక్కడ మనం బతకలేం- ఇక్కడ బతికే అవకాశాలు తక్కువగా వున్నాయి అని అనుకోవడమే. అది తప్పు. మనసుంటే మార్గం వుంటుంది. స్థిరపడాలనే చిత్తశుద్ధి వుంటే ఎక్కడయినా తన తెలివితేటల్ని నమ్ముకుని, అమ్ముకుని స్థిరపడొచ్చు. తను స్థిరపడడమే కాకుండా, మరికొంత మందికి ఉద్యోగావకాశాన్ని సృష్టించొచ్చు. టి.రాజగోపాలరావు, కృష్ణాజిల్లా, గుడివాడ సమీపంలో అంగలూరులో 1920 లో పుట్టాడు. 1947 లో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుంచి ఎమ్.ఎస్.సి. చేసాడు. ఆ తరువాత ప్రభుత్వ ఉపకారవేతనమ్మీద తోళ్ళ పరిశ్రమ విషయంలో కృషి చెయ్యడానికి అమెరికా వెళ్ళాడు. 1951లో అక్కడ నుంచి విశేష అనుభవంతో తిరిగి వచ్చిన రాజగోపాలరావు స్వంత వూరికి ఎంతో దూరంలో వున్న విజయనగరంలో వెల్లిమర ప్రాంతంలో "The Associated Tanners" అనే కంపెనీ పెట్టాడాయన.
అసోసియేటెడ్ టానర్స్ ప్రారంభించినప్పుడు దాని పెట్టుబడి కేవలం 80 మాత్రమే. అప్పటికి అవసరమైన ఆ డబ్బును సంపాదించడానికి ఆయన తన పొలాన్ని అమ్మేసాడు. కొంతమంది బంధువులు స్నేహితుల దగ్గర్నించి కూడా ఆర్ధిక సహాయాన్ని తీసుకున్నాడు. ప్రారంభించిన ఆనతి కాలంలోనే అసోసియేట్ టానరీస్ అభివృద్ధిపథంలోకి దూసుకుపోయింది. ఫ్యాక్టరీకి లభించే ఆదాయంలో విదేశాలకు చేసిన ఎగుమతులవల్లే 50 శాతం ఆదాయం లభిస్తోంది.
ప్రధానంగా అసోసియేటెడ్ టానరీస్ లో రెండు విధాలున్నాయి. ఒకటి పాదరక్షల తయారీ విభాగం- రెండు తోళ్ళ విభాగం- పాదరక్షల విభాగం 1972లో ప్రారంభమైంది. బాటా ఇండియా లిమిటెడ్ కు పాదరక్షల్ని సరఫరా చేసే యూనిట్లలో ఇదొక యూనిట్ అంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ యూనిట్ లోనే పాదరక్షలు తయారుచేసి బాటా స్టిక్కర్స్ అంటించి- బాటా కంపెనీ పంపమన్న చోటికి పంపుతుంది.
మనం ఈనాడు కొంటున్న బాటా బ్రాండ్ పాదరక్షలు తెలుగువారు తయారుచెయ్యటం గర్వకారణం కదా!
ఆనాటి రాజగోపాలరావు వూహవల్ల ఈనాటి యువతరం ఎంతయినా నేర్చుకోవాల్సిన అవసరం వుంది.
లెదరు టెక్నాలజీలో తను కృషి చేసాడు కాబట్టి ఏ విదేశంలోనో ఆయన స్థిరపడాలని అనుకోలేదు- తను ఏదయితే నేర్చుకున్నాడో, తను ఏదయితే చెయ్యాలనుకున్నాడో, ఆ పరిశ్రమను స్థాపించడానికి ఆయన కృషి చేసాడు- చదువుకున్నవాడు, వ్యవహారజ్ఞానం తెల్సినవాడు, ఎక్కడయినా స్థిరపడగలడు అని రుజువు చేశాడు. ఈ మూడు విషయాలు ఆయన జీవితంలోంచి నేటి యువతరం నేర్చుకోవాల్సిన అంశాలు. ఇది చదివాక వరసగా పేజీలన్నీ ఆసక్తిగా తిప్పాడు మధుకర్.60,70 ప్రాంతంలో మన రాష్ట్రంలో ప్రారంభమైన ఎన్నో వ్యాపారాలు, ఆ వ్యాపారాలను తెలివితేటలతో అభివృద్ధి చేసిన వ్యాపారస్తుల వివరాలు, దానికితోడు అలసత్వం, అజ్ఞానం, తొందరపాటుతనంవల్ల బంగారం లాంటి వ్యాపారాన్ని పాడుచేసుకున్న వారి వివరాలు కూడా అందులో వున్నాయి.
ఆ పుస్తకాన్ని అటూ ఇటూ తిప్పి చూసాడు. ఎప్పుడు ప్రింటయిందో వివరాలు చూసాడు . పదేళ్ళక్రితం ప్రింటయినా, ఇప్పటికీ కొత్తగానే వుంది. అంటే- ఏ ఒక్కరు దాని జోలికి వెళ్ళి వుండరు.
మంచి పుస్తకాలెప్పుడూ లైబ్రెరీలో పదిలంగా, భద్రంగా వుంటాయి. వాటి జోలికి ఎవరూ వెళ్ళకపోవడమే అందుకు కారణం. ఇక దేశమెలా బాగుపడుతుంది? సెక్స్, బూతు, కలలు, కల్పనలు ఇవే చదివేవాళ్ళు ఎలా ఎదుగుతారు? కాలక్షేపాన్నిచ్చే పుస్తకాల అట్టలు మాత్రం చిరిగిపోయుంటాయి. ఈ పుస్తకం యిప్పుడు కొనాలంటే బజార్లో దొరకవు. ఎలా... లైబ్రేరియన్ అడిగితే యివ్వకపోవచ్చు- ఎవ్వరికి నచ్చిన పుస్తకాన్ని వాళ్ళు తీసుకుపోతామంటే?
తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది. అయినా సందేహ నివృత్తి కోసం లైబ్రేరియన్ దగ్గరకెళ్ళాడు.
తన దగ్గరికి వస్తున్న ఆ కుర్రాడివేపు లైబ్రేరియన్ తలెత్తి చూశాడు, ఏం కావాలన్నట్టుగా.


