పిల్లకు మూడోనెల వచ్చింది. కాస్త ఒళ్ళు చేసింది.
నాగమ్మ విశాఖపట్టణానికి ప్రయాణం కట్టింది. పున్నమ్మ కూతుర్ని వెంటబెట్టుకుని విశాఖపట్నం బయలుదేరింది. స్టేషన్ వరకూ మాధవయ్యా, సుబ్బారాయుడూ వచ్చి బండి ఎక్కించారు.
స్టేషన్ కి వచ్చిన వెంకట్రావుని చూసిన నాగమ్మ నిర్ఘాంతపోయింది. మనిషి మరీ చిక్కిపోయి వున్నాడు. కళ్ళు లోతుగా ఉన్నాయి. కళ్ళ చుట్టూ నల్లటి చారలు ఏర్పడ్డాయి. పచ్చని శరీరచ్చాయ వన్నె తగ్గింది.
చిరునవ్వుతో పార్వతిని భార్య చేతుల్లోనుంచి అందుకున్నాడు. నాగమ్మ కళ్ళలో గిర్రున నీరు తిరిగింది.
"ఏమిటి నాయనా, మరీ సగం అయిపోయావు?" పున్నమ్మ గొంతుకు ఏదో అడ్డుపడినట్లుంది.
"అబ్బే! ఏమీలేదు. హోటల్ తిండి పడలేదు. బాల వచ్చిందిగా ఇక బాగుపడతాను" అన్నాడు ఏదో పెద్ద విషయం కాదన్నట్లే.
నాగమ్మ భర్తతో ఒక్కమాట మాట్లాడలేదు. పెల్లుబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకోవటంలో సతమత మవుతోంది. జట్కాబండిలో కూచునికూడా ఒక్క మాట మాట్లాడలేదు. వెంకట్రావుకూడా మాట్లాడలేదు. పలకరిస్తే నాగమ్మ నెత్తినవున్న నీళ్ళకుండ భళ్ళున పగులుతుందని తెలుసు వెంకట్రావుకు.
వాకిలిముందు బండి ఆగగానే నాగమ్మ లోపలకు పరుగెత్తింది. పున్నమ్మ వెంకట్రావు చేతుల్లో వున్న పిల్లను తీసుకొని లోపలికి నడిచింది. బండివాడికి డబ్బులిచ్చి లోపలికివచ్చిన వెంకట్రావును చుట్టుకొని నాగమ్మ బావురుమని ఏడ్చింది.
"ఛ! ఏమిటి బాలా ఇది? ఇప్పుడు నా కేమయిందని?" మృదువుగా మందలించాడు.
"నన్నూ, నా బిడ్డనూ అన్యాయం చెయ్యకండి" వెక్కిళ్ళ మధ్యనుంచి ఆగి ఆగి వెలువడ్డాయి ఆ మాటలు.
"ఇదిగో చూడు! మీ అమ్మగారు ఎలా దిగాలుపడి నిలబడిపోయారో? నాకేం కాలేదు. కొద్దిగా బలహీనంగా వున్నానని చెప్పాగా?" అన్నాడు వెంకట్రావు భార్య చెక్కిళ్ళమీద కన్నీటిని తుడుస్తూ.
నాగమ్మ వచ్చాక వెంకట్రావు కొంచెం అగ్గి తీరినట్లు కనిపించాడు. అయినా నాగమ్మ భర్తను రోజూ మంచి డాక్టరుకు చూపించుకోమని పోరుతూనే వుంది. "చూపించుకుంటాను" అంటూనే దాటివేత చేశాడు వెంకట్రావు. భార్య పోరుపడలేక ఇంటిపక్కనవున్న డాక్టరుకు చూపించుకుంటే ఏవో ఇంజక్షన్లు ఇచ్చాడు. కొంత ఆరోగ్యం బాగుపడినట్లే అనిపించింది. ప్రతి చిన్నదానికి డాక్టరు దగ్గరకు వెళ్ళాలంటే మహా చిరాకు వెంకట్రావుకు. శరీరం ఒక్కసారి డాక్టరు చేతిలో పడితే మందుల పుట్టగా మారాల్సిందేనని అతనికి గట్టి నమ్మకం.
మూడు నెలలు ఇట్టే గడిచిపోయాయి.
పార్వతి బంతాడటం నేర్చుకుంది. ఇల్లంతా కలియ తిరుగుతుంది. తండ్రిని బాగా గుర్తు పడుతుంది. అతనిని చూడగానే చేతులు చాస్తుంది. వెంకట్రావుకు పార్వతి అంటే ప్రాణం.
మాధవయ్యకు ఒంట్లో బాగాలేదని ఉత్తరం వస్తే పున్నమ్మ ప్రయాణం కట్టింది. వెళుతూ వెళుతూ అల్లుడి ఆరోగ్యం గురించి కూతుర్ని మరీమరీ హెచ్చరించింది.
"నన్నేం చెయ్యమంటావమ్మా! ఆ మనిషి నా మాట లెక్కచెయ్యకపోతేనూ! ఎలా చిక్కిపోతున్నారో చూస్తున్నావుగా! రాత్రి ఖళ్ళు ఖళ్ళున ఒకటే దగ్గడం".......నాగమ్మ కంటనీరు పెట్టుకుంది.
"అవును తల్లీ! మనిషిని చూస్తుంటే భయంగా వుంది. నాకు వెళ్ళాలని లేదు. కాని ఆరోగ్యం బాగాలేని మీ నాన్న ఏం బాధపడుతున్నారో ఏమో! ఆ మనిషికి అభిమానం ఎక్కువ. కొడుకుల ఇళ్ళలో ఒక పూట కూడా ముద్ద ఎత్తరు. భాగాల పంపిళ్ళతో మీ నాన్న కూడా చాలా కుంగిపోయారు."
"అవునమ్మా! అన్నయ్యలు ఇలా మారిపోతారని నాన్న కలలో కూడా అనుకుని ఉండరు. నాన్నకు కొంచెం తగ్గగానే ఇద్దరూ ఇక్కడికి వచ్చేయండమ్మా!" అంది నాగమ్మ స్టేషన్ లో బండి కదలబోయేముందు.
"అలాగే తల్లీ! పిల్లను భద్రంగా చూసుకో. అబ్బాయిని డాక్టర్ దగ్గరకు పంపించు." బండి కదిలింది. పున్నమ్మ కూడా కళ్ళ నీళ్ళతో కదిలిపోయింది. వెంకట్రావు పిల్లను పెట్టుకుని ఇంట్లోనే వుండిపోయాడు. ముందులా వెంకట్రావు కాలేజీకి వెళ్ళి వచ్చాక మళ్ళీ బయటికి వెళ్ళటం లేదు. సగం ఓపిక లేకపోవటం, సగం ఇంట్లోనే కాలక్షేపం జరిగిపోవటమూ కారణం.
నాగమ్మ వంటమనిషిని మానిపించింది.
సినిమాలకు వెళ్ళటం తగ్గిపోయింది.
పిల్ల కలిగాక బాధ్యతారహితంగా ప్రవర్తించటం ఆమె మనస్కరించటంలేదు. నాలుగు డబ్బులు ఇప్పటినుండే వెనక వేసుకుంటేనే తన పిల్లల్ని నలుగుర్లో గొప్పగా నిలుచోబెట్టగలదు.
వెంకట్రావు పార్వతిని గుండెలమీద దొర్లించుకుంటూ అనేవాడు "నా చిట్టితల్లికి డాక్టర్ చెప్పిస్తాను" అని.
"అమ్మాయి డాక్టర్ అయ్యేదాకా మీరు డాక్టర్ కు చూపించుకోరులా వుంది" అంది ఒకరోజు నాగమ్మ చిరునవ్వుతో.
"అవును నా పార్వతికి మొదటి రోగిని నేనే!"
"సంతోషించాం లెండి! రేపు మీరు డాక్టరు దగ్గరకు వెళతారా లేదా!" నిలదీసి అడిగింది నాగమ్మ.
"వెళ్ళాలనే అనుకుంటున్నాను" అని పిల్లతో ఆడుకోవటంలో మునిగిపోయాడు.
భార్యాభర్తలిద్దరూ ఆరు నెలల పార్వతిని చేతిలో స్టెతస్కోపుతో, తెల్ల కోటుతో ఆసుపత్రికి వెళుతున్న డాక్టరుగా ఊహించుకుంటూ మురిసిపోయేవారు.
వెంకట్రావు ఇంట్లో వున్నంతసేపూ కూతుర్ని భుజాలమీద నుంచి దింపేవాడు కాదు. అతని జీవితమంతా ఆ పసిపాప చుట్టూనే పరిభ్రమిస్తున్నట్లుండేవాడు. ఆ పసిదాని బోసి నవ్వుల్లో ఎన్నో కలలను చూసేవాడు. ఆ అమాయకపు చూపుల్లో ఎన్నో ఆశలు అల్లుకున్నాడు.
వెంకట్రావు తెలిసిన డాక్టరు దగ్గిర మందు తీసుకుంటూనే వున్నాడు. కాని ఉన్నట్లుండి ఆరోగ్యం క్షీణించసాగింది. రాత్రిళ్ళు ఖళ్ళుఖళ్ళున దగ్గటం ఎక్కువయింది. అతని దగ్గు నాగమ్మ ప్రాణాలను తోడేసేది.
"మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవటంలేదు" అంది నాగమ్మ ఒకనాటి ఉదయం.
"మందు తింటూనే ఉన్నాగా!"
"ఈ డాక్టరుమీద నమ్మకం పోయింది. ఎవరైనా మంచి డాక్టరుకు చూపించుకోండి. గవర్నమెంటు ఆసుపత్రి పెద్ద డాక్టరు దగ్గిర కెళ్ళండి" అంది నాగమ్మ రుద్దకంఠంతో.
"అలాగే!"
"అలాగే కాదు, రేపే వెళతానని మాట ఇవ్వండి."
"వెళతానన్నానుగా? ఇంతకాలం అదే పోతుందనుకున్నాను. నాకూ చాలా బాధగానే వుంది. రేపే వెళతాను."
అంతలో దగ్గుతెర వచ్చింది.
బయటనుంచి "వెంకట్రావు!" అన్న కేక వినిపించింది.
ఆ స్వరం ఎవరిదో గుర్తు పట్టిన వెంకట్రావు సంతోషంగా ఒక్క దూకుతో బయటకొచ్చాడు.
"ఒరేయ్ రఘూ! చెప్పకుండా చెయ్యకుండా ఊడిపడ్డావేంరా?" ఉల్లాసంగా ప్రశ్నించాడు వెంకట్రావు.
రఘు పేరు వినగానే నాగమ్మ కూడా బయటికి వచ్చింది.
రఘు వెంకట్రావునే తెల్లమొహం వేసి చూస్తూ నిలుచుండిపోయాడు.
"ఏమిటిరా అలా నిలుచుండిపోయావు?" వెంకట్రావు రఘును దాదాపు కావలించుకున్నంత పని చేశాడు.
"లోపలికి రండి అన్నయ్యా!" అంది నాగమ్మ.
రఘు వెంకట్రావు ప్రాణ స్నేహితుడు. అతను కూడా వెంకట్రావు చేస్తున్న కాలేజీలోనే పని చేస్తుండేవాడు. సంవత్సరం కూడా కాలేదు, హైద్రాబాదులో సైకాలజీ ప్రొఫెసర్ ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాడు.
"ఏమిటి చెల్లెమ్మా, వీడు ఇలా అయిపోయాడు?" రఘు స్వరంలో ఆశ్చర్యం, బాధా నేను ముందంటే నేను ముందన్నాయి.
"రారా బాబో౧ ముందు లోపలికిరా!" ఉత్సాహంగా వెంకట్రావు రఘు చెయ్యి పుచ్చుకుని లోపలికి తీసుకెళ్ళాడు.
"ఏమిటిరా! ఒంట్లో బాగుండటంలేదా?" రఘు వెంకట్రావును ప్రశ్నించాడు.
"ఏదో కాస్త బలహీనంగా వుంటూంది. అప్పుడప్పుడు సాయంకాలాల్లో జ్వరం కూడా వస్తూ వుంటుంది."
"డాక్టర్లేమన్నారు?" ఆదుర్దాగా ప్రశ్నించాడు రఘు.
"ఆలు ఆయన సరిగ్గా డాక్టర్లకు చూపించుకుంటేగా?" అంది నాగమ్మ.
రఘు చిత్రంగా చూశాడు. "ఏరా నిజమేనా? ఇంత ఇడియట్ వేమిటిరా? విశాఖపట్నంలో వుండి ఇంతకాలంగా జ్వరం వస్తుంటే డాక్టర్లకు చూపించుకోకపోవడమేమిటి? జీవితం మీద అంత విరక్తి కలిగిందా?" మందలింపుగా అడిగాడు.
"చూస్తుంటే నాకు అలాగే వుంది. నేనంటే విరక్తి కలిగిందేమో!" దుఃఖం పెల్లుబికింది నాగమ్మ కంఠంలో.
"బాలా!" బాధగా నిట్టూర్చాడు వెంకట్రావు.
"మరి లేకపోతే ఏమిటిరా?"
"డాక్టరు కెందుకు చూపించుకోలేదు? ఇద్దరికి చూపించుకున్నాను. మందు కూడా తింటున్నాను."
"అదీ నేను చెవుల్లో ఇల్లు కట్టుకుని పోరగా పోరగా, ఊరు పేరు లేని డాక్టరు దగ్గర ఏదో మందు తెచ్చుకుంటున్నారు" అంది నాగమ్మ.
"ఒరేయ్ రఘూ! అమ్మాయిని చూపిస్తాను ఉండరా!" అంటూ లోపలికి వెళ్ళాడు వెంకట్రావు.
"ఇదన్నయ్యా ఈయన వరస!" అంది నాగమ్మ రఘూతో.
"చూడరా, మా అమ్మాయి ఎంత అందంగా వుందో! నా పార్వతిని డాక్టర్ను చేస్తాను" అంటూ నిద్రపోతున్న బిడ్డను బుజాన వేసుకుని వచ్చాడు.
రఘు పార్వతిని తీసుకున్నాడు.
పార్వతి కళ్ళు తరచి గొల్లుమంది.
"రఘు మామయ్య! ఏడవకు. ఒరే, మా అమ్మాయిని మీ చంద్రానికి చేసుకుంటావు కదూ?"
"అలాగే" అన్నాడు రఘు, పెద్ద ఉత్సాహం చూపించకుండానే.
నాగమ్మ కళ్ళు ఒత్తుకుంటూ లోపలికి వెళ్ళింది.
"మీవాడికి ఇంజనీరు చెప్పిస్తేనే మా అమ్మాయిని ఇస్తాను, తెలుసా?" అన్నాడు వెంకట్రావు.
"అలాగేలే! బయలుదేరు."
"ఎక్కడికిరా? బండిదిగివచ్చి స్నానం అన్నా చెయ్యకుండా అప్పుడే ఊరిమీద పడతానంటావే? మెల్లిగా వెళ్ళొచ్చులే. విశాఖపట్నం ఎక్కడికీ పారిపోదు" అన్నాడు వెంకట్రావు ఎగతాళిచేస్తూ.
"బయలుదేరు, డాక్టరు దగ్గరికి వెళదాం! డాక్టరు శంకర్రావు మంచి డాక్టరు. నా స్నేహితుడు కూడా" అన్నాడు రఘు.
"రే పెళ్ళొచ్చులే."
"వీల్లేదు బయలుదేరు" అంటూ వెంకట్రావు మరో మాట మాట్లాట్టానికి అవకాశం ఇవ్వకుండానే రఘు బయలుదేరాడు.
"వెళ్ళిరండి! అన్నయ్య దేముడులా వచ్చాడు సమయానికి" అంటూ నాగమ్మ చెరో గ్లాసుడు కాఫీ అందించి పార్వతిని తీసుకొంది.
డాక్టరు దగ్గరనుంచి తిరిగివచ్చిన రఘును ఆదుర్దాగా ప్రశ్నించింది నాగమ్మ "డాక్టరు ఏమన్నాడన్నయ్యా!" అంటూ.
"రేపు హాస్పటల్ కు రమ్మన్నాడు. ఎక్స్ రే తియ్యాలట."
రఘు మాటలు వింటూనే స్తంభించిపోయింది నాగమ్మ.
"భయపడకమ్మా! శంకర్రావు మంచి డాక్టరు" అన్నాడు రఘు నాగమ్మకు దైర్యం చెబుతూ.
15
ఎక్స్ రే తీసారు. రక్తపరీక్ష మొదలైన టెస్టులు కూడా పూర్తి అయాయి. వెంకట్రావుకు క్షయ అనీ, బాగా ముదిరిపోయిందనీ, ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయనీ, ఆరు నెలల పాటన్నా మదనపల్లి వెళ్ళి వుండటం మంచిదనీ చెప్పాడు డాక్టరు.
ఆ విషయం విని వెంకట్రావు దిగాలుపడిపోయాడు. ఇంతవరకూ వస్తుందనుకోలేదు. ఏదో మామూలు అస్వస్థత, అదే పోతుందిలే అనుకున్నాడు.
రఘు ద్వారా విషయం విన్న నాగమ్మకు తను నిలబడివున్న భూమే తనను మోసం చేసినట్లనిపించింది.
ప్రపంచమంతా చీకటి గుహలా తోచి నిలువెల్లా వణికిపోయింది.
వెంకట్రావుని కావలించుకొని భోరు భోరున ఏడ్చింది.
రఘు ఆమెను ఎన్నో విధాలు ఓదార్చటానికి ప్రయత్నించాడు. ఈ రోజు క్షయవ్యాధికి భయపడాల్సిందేమీ లేదన్నాతడు. వెంటనే వెంకట్రావును మదనపల్లి పంపించే ఏర్పాటు చెయ్యమని చెప్పాడు. నాలుగురోజులుండి రఘు హైదరాబాదు వెళ్ళాడు. మదనపల్లి వెళ్ళేంత వరకూ శంకర్రావు వైద్యం చెయ్యటానికి అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళాడు.
"ఇంకా నాలుగురోజులు వుందామనుకున్నానమ్మా. కాని సెలవు లేదు. మదనపల్లి సీటుకొరకు కూడా శంకర్రావుగారే ప్రయత్నిస్తానన్నారు. అప్పుడప్పుడు వాడి పరిస్థితి నాకు రాయమని కూడా చెప్పాను. మళ్ళీ వీలు చూచుకొని నేను కూడా వస్తాను" అన్నాడు రఘు బయలుదేరేముందు.
"నాకు భయంగా వుందన్నయ్యా! ఇంతలోనే ఇంత ముంచుకొస్తుందనుకోలేదు." బొంగురుపోయిన గొంతుతో అంది.
"భయం ఏమీ లేదమ్మా! మనుషులన్నాక జబ్బులు రాకుండా వుంటాయా? నువ్వుమాత్రం వాడిముందు కంటనీరు పెట్టవద్దు. ధైర్యంగా వున్నట్లు కనిపించాలి."
"అలాగే అన్నయ్యా!" రెండు చేతులతో ముఖం కప్పుకొని కుమిలి కుమిలి ఏడ్చింది.
"అదో వాడు వస్తున్నాడు. ఊరుకోమ్మా! నాన్నగారికి ఉత్తరం రాయి" అన్నాడు రఘు.


