ఎల్లావు - ఎల్లమంద
రంగయ్యగారి ఎల్లావు తొలిచూలు నిండి కోడెదూడను పెట్టింది.
ఆరోజు ఇల్లంతా పండగలా హడావిడిగా వుంది. రెండు రోజులు ఎల్లావు ఇంటి దగ్గరే వుంది.
మూడో రోజు చైనా జీతగాడు ఎల్లావును మిగతా గొడ్లతోపాటు బీట్లో మేపుకొని రావడానికి వదిలాడు.
తొలి ఈత బిడ్డమీద మమత తీరని ఎల్లావు, దూడను వదిలి వెళ్ళలేక, చావిట్లోకి దొడ్లోకి కదం తొక్కుతూ మారాం చేసింది.
కాని జీతగాడు తనను వదిలి వెళ్ళాడని తెలుసుకొన్నాక అన్ని గొడ్లకంటే ముందుగా బీట్లోకి నడిచింది.
పొద్దు వాటాలింది.
గొడ్లకాడ బుడ్డోడు బీడుకు అల్లంత దూరాన వున్న నల్లచెరువులోకి పశువుల్ని తోలి, చెరువు గట్టుమీద చింతచెట్టు కింద బాచీపెట్లు వేసుక్కూర్చుని అన్నం మూట విప్పాడు. కొరివికారం పచ్చడితో కలిపిన అన్నం ముద్దల్ని గబగబా ఉసిళ్ళు తోలుతూ తినడంలో మునిగిపోయాడు జీతగాడు.
చెరలో దిగి, నీళ్ళు తాగి, చల్లని నీటిలో తుళ్ళుతూ, పొర్లుతూ, జలకాలాడుతున్న ఎల్లావుకు దూడ గుర్తొచ్చింది.
పొదుగు జివ జివ లాడింది.
అంతే!
అక్కడా లేచిన ఎల్లావు, చెరువుకట్ట దూకి, పుట్టదాటి, డొంక వదలి, మాగాటి చేలకు అడ్డం పాడింది.
గుండెల్లో బిడ్డమీద మమకారం మసులుతోంటే, జివ జివ లాడుతోన్న పొదుగులో పాలు కదులుతోంటే మెడకింద గంగడోలు అల్లల్లాడుతోంటే, పట్టుకుచ్చుల తోక పైకెత్తి, మోరచాచి, ఉరకలు వేస్తూ, నురగలు కక్కుతూ, చెంగు చెంగునా పరుగులు వేస్తూన్న ఎల్లావుకు, ఈనకాచిన పిల్లి పెసరచెను తన గిట్టలకింద నలిగిపోతోందన్న సంగతి తెలియదు. బాణాకర్రతో ఎల్లమంద ఎదురునిల్చి నడిచేలో నిలేసేదాకా!
గుండెలు పగిలిన పసిబిడ్డతల్లి రివ్వున వెనక్కు మళ్ళింది. మళ్ళీ పరుగు లంకించుకొనే లోపున ఎల్లమంద చేతుల్లోవున్న పలుపు ఎల్లావు మెడకు చుట్టుకుపోయింది.
పల్లపుసాగు సన్నరైతు ఎల్లమంధకు ఎగువసాగు మోతుబరి రైతు రంగయ్య అంటే మహా కసి. చేను తడిచే నీళ్ళు అందినా, కిందటేడు ఆసామి రంగయ్య చప్పున నీళ్ళు వదలలేదని అగ్గిబుగ్గయిపోయాడు. రంగయ్యమీద కసి తీర్చుకొనే అదను దొరక్క మరీ మండిపోతున్నాడు లోలోపలే.
తన పంటచేనుకు అడ్డంపడి అల్లిబిల్లి తిరుగుతున్న రంగయ్యగారి ఎల్లావును చూసేసరికి యల్లమందకు అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది యల్లమంద ఎల్లావును దొరకపుచ్చుకున్నాడు.
ఇంతకాలానికి చిక్కాడు రంగయ్య తన చేతిలో! దొరికిన అదను పోగొట్టుకోకూడదు! అవును బందెలదొడ్లో పెట్టేస్తే సరి!
ఉన్న ఊళ్ళో పాడి ఆవును బందెలదొడ్లో పెట్టిస్తే నలుగురూ చివాట్లు వేస్తారని భయపడ్డాడు ఎల్లమంద. ఆలోచించి కోసెడు దూరానవున్న గోపాలపురం తోలు కెళ్ళి ఎల్లావును బందెల దొడ్లో పెట్టించి హాయిగా గాలి పీల్చుకున్నాడు. ఏదో ఘనకార్యం చేసినవాడిలా చాతీ విరుచుకుంటూ, భుజాలు ఎగరేసుకుంటూ మీసాలు దువ్వుకుంటూ తిరిగి ఊళ్ళోకి వచ్చాడు. కొంచెం దూరం అయినా చుట్టూ తిరిగి రంగయ్య ఇంటిముందు నుంచి వెళ్ళాడు. రంగయ్య దొడ్లోనుంచి వస్తున్న "అంభా!" అనే లేగదూడ అరుపులు ఆనందాన్ని కలిగించాయ్.
ఎల్లమంద ఇంటికి చేరేసరికి ఊరు మాటు మణిగింది.
తడికతోసి, గడప దాటుతోన్న ఎల్లమందను చూడగానే, మూడు నెల్ల పసిగుడ్డును వళ్ళో పెట్టుకుని కునుకు తీస్తోన్న ముసల్ది బావురుమంది.
బిడ్డ మధ్యాహ్నంనుంచి మూసినా కన్ను తెరవలేదు. వాళ్ళు తెలియని జ్వరంలో మధ్య మధ్య ఉలిక్కిపడుతున్నాడు.
ఎల్లమంద భార్య ప్రసవించిన మూడో రోజున పసికందును ఎల్లమంద చేతుల్లోపెట్టి కళ్ళుమూసింది.
అప్పటినుంచీ నాయనమ్మ చేతుల్లో, ఎల్లమంద కనురెప్పలకింద ఆప్యాయంగా సాకబడుతోన్న బిడ్డకు అమాంతంగా జ్వరం ముంచుకొచ్చింది.
భుజాన కండువా అన్నా వేసుకోకుండా ఎల్లమంద అనంతా చార్యులవారి దగ్గరకు పరుగెత్తాడు.
అనంతమైన వ్యాధులకూ, ఆ పొట్లాలమందే ఇచ్చే అనంతాచార్యులవారు బిడ్డ నాడి పరీక్షించారు. నాడి చూస్తూ గంభీరంగా తల ఆడించారు. ఆత్రంగా ఎల్లమంద ఆచార్యులవారి ఆడుతున్న తలను చూస్తూ నిలబడ్డాడు.


